కలెక్టర్కు జగన్ బెదిరింపు: ఇదీ చంద్రబాబు.. 'సాక్షి' కౌంటర్
మొన్న విశాఖపట్నంలో ఎయిర్ పోర్ట్ అధికారులను, నిన్న నందిగామ ఆసుపత్రిలో కలెక్టర్ను వైసిపి అధినేత వైయస్ జగన్ బెదిరించాడని టిడిపి నేతలు విమర్శలు గుప్పిస్తున్నారు. దీనిపై సాక్షి టిడిపికి కౌంటరిచ్చింది.
విజయవాడ: మొన్న విశాఖపట్నంలో ఎయిర్ పోర్ట్ అధికారులను, నిన్న నందిగామ ఆసుపత్రిలో కలెక్టర్ను వైసిపి అధినేత వైయస్ జగన్ బెదిరించాడని టిడిపి నేతలు విమర్శలు గుప్పిస్తున్నారు. దీనిపై సాక్షి పత్రిక అధికార పార్టీకి కౌంటర్ ఇచ్చింది.
జగన్ ఆదేశం: 'ఆనం'తో మేకపాటి పావులు, బలమున్నా టిడిపిలో భయం
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఇతర నేతలు బెదిరించారంటూ ఓ కథనం రాసింది. వారు ఎప్పుడెప్పుడు ఎవరెవరిని బెదిరించారని రాసింది. అసెంబ్లీ ఆవరణ నుంచి మహారాష్ట్ర వరకు తిట్ల పురాణం కొనసాగిందని పేర్కొంది.
జనవరి 26వ తేదీన జల్లికట్టు తరహా ప్రత్యేక హోదా ఉద్యమం కోసం ఆర్కే బీచ్ వద్ద యువత ఆందోళనకు పిలుపునిచ్చింది. ఇందులో పాల్గొనేందుకు వెళ్లిన జగన్ను ఎయిర్ పోర్టులోనే అడ్డుకున్నారు. ఆ సమయంలో జగన్ అధికారుల పైన చిందులు తొక్కారు.
జగన్ను అరెస్ట్ చేయించే అధికారం కలెక్టర్కు, జైల్లో ఉండి..: బాబు, ముప్పేటదాడి
రెండు రోజుల క్రితం దివాకర్ ట్రావెల్స్ ప్రమాదం నేపథ్యంలో నందిగామ ఆసుపత్రికి వెళ్లిన జగన్ కలెక్టర్తో మాట్లాడుతూ ఊగిపోయారు. దీనిపై టిడిపి భగ్గుమంది. దీంతో సాక్షి కౌంటర్గా అధికార పార్టీ పైన కథనం రాసింది. టిడిపి తీరు గురువింద సామెతలా ఉందంటున్నారు.
చంద్రబాబు ఇలా అంటూ సాక్షి
ఏం పిచ్చపిచ్చగా ఉందా? తమాషాలు చేస్తున్నారా? మేం అధికారంలోకి వస్తే మీ అంతు చూస్తా! ఎంతలో ఉండాలో అంతలో ఉండాలి. ఎవరనుకున్నావ్ నన్ను. యూజ్ లెస్ ఫెలో.. తాట తీస్తా.. నీ ఉద్యోగం ఊడగొడతా!.. చంద్రబాబు అధికారంలో ఉన్నా, లేకున్నా ఇలా మాట్లాడారని పేర్కొంది.
వనజాక్షిపై దౌర్జన్యం అంటూ..
ఇసుక మాఫియాను అడ్డుకున్న అధికారిణి పైన టిడిపి ఎమ్మెల్యే దౌర్జన్యం చేసినా మహిళా అధికారిణినే మందలించిన తీరును ఏమంటారని ప్రశ్నించింది. సాక్షాత్తు అసెంబ్లీ ప్రాంగణంలోనే తన ఎల్లో మీడియాకు అడ్డుపడ్డారని పోలీసులను నోటికి వచ్చినట్లు మాట్లాడిన ఘటనలు ఉన్నాయని అభిప్రాయపడింది.
ఆనాటి కథ ఇదీ..!
1999 మార్చి.. నీటి పారుదల శాఖ సమీక్షలో ఎస్ఈ అప్పారావుపై చంద్రబాబు నిప్పులు చెరిగారని, ఆయన తీవ్రంగా మందలించారని, దీంతో మానసిక క్షోభకు గురైన ఆయన గుండెపోటుతో ప్రాణాలు కోల్పోయారని పేర్కొంది.
2004లో.. అనంతపురం జిల్లా కనగానపల్లి ఎంపీపీ తరగకుంట ప్రభాకర్ హత్యకు గురైన సందర్భంలో ఎస్పీ కార్యాలయం ఎదుట టిడిపి నేతలు ధర్నాకు దిగారని, ఈ సందర్భంగా అప్పటి ఎస్పీ అనిల్ కుమార్ను ఉద్దేశించి అధికార పార్టీ తొత్తుగా ఉన్నావని, హత్య జరుగుతుంటే ఏం చేస్తున్నావని చంద్రబాబు ఇష్టారీతిన తిట్టారని పేర్కొంది.
పరిటాల హత్య జరిగినప్పుడు..
2005 జనవరి 24.. పరిటాల రవి హత్య సందర్భంగా అప్పటి ఎస్పీని తాట తీస్తానని, నీ ఉద్యోగం ఊడగొడతానని చంద్రబాబు దుర్భాషాలాడారని పేర్కొంది.
2003లో.. విజయనగరంలో పర్యటన సందర్భంగా మహిళా కమిషనర్ను యూజ్ లెస్ ఫెలో, స్టుఫిడ్ అంటూ సస్పెండ్ చేస్తానని బెదిరించారని పేర్కొంది.
బాబ్లీ ప్రాజెక్టు కోసం మహారాష్ట్ర వెళ్లినప్పుడు..
2010 జూలై 20.. బాబ్లీ ప్రాజెక్టును అడ్డుకునేందుకు వెళ్లిన చంద్రబాబు బృందాన్ని మహారాష్ట్ర పోలీసులు అడ్డుకున్నారని. అప్పుడు మహా పోలీసులపై.. మీ వ్యవహారశైలి ఇంతనా, బిచ్చగాళ్ల కన్నా హీనంగా చూస్తున్నారని, నేను తొమ్మిదేళ్లు సీఎంగా చేశానని, ఇప్పుడు ప్రతిపక్ష నేతను అని, కనీస మర్యాద ఉండదా.. చూస్తామని వేలు చూపిస్తూ హెచ్చరించారని పేర్కొంది.
ఇబ్బందుల్లో పడతావని..
2012 జూలై 24.. విజయనగరం జిల్లా కలెక్టరేట్ వద్ద టిడిపి చేపట్టిన ధర్నా సందర్భంగా జిల్లా ఎస్పీ కార్తికేయను ఉద్దేశించి.. ఏంటి ఎస్పీ, కాంగ్రెస్ తొత్తులా వ్యవహరిస్తున్నావ్.. మా ప్రభుత్వం వస్తే నువ్వు ఎక్కడ ఉంటావో గుర్తుంచుకో.. ఇబ్బందుల్లో పడతావని హెచ్చరించినట్లు రాసింది.
అసెంబ్లీ ఆవరణలోనే..
2013 ఆగస్టు 3న అసెంబ్లీ ఆవరణలో మీడియా ప్రతినిధిని అడ్డుకున్నందుకు హైదరాబాద్ సెంట్రల్ జోన్ డీసీపీని ఉద్దేశించి.. ఏం పిచ్చపిచ్చగా ఉందా, తమాషా చేస్తున్నారా, ఇది అసెంబ్లీయా లేక పోలీసు రాజ్యమా అని నిలదీశారని పేర్కొంది.
ఉత్తరాఖండ్ వరదల సమయంలో..
2013 జూన్26న.. ఉత్తరాఖండ్ వరద బాధితులను పరామర్శించి ఢిల్లీలోని ఏపీ భవన్ చేరుకొని.. రెసిడెంట్ కమిషనర్ శశాంత్ గోయల్ పైన.. మీకు మానవత్వం ఉందా.. ఏపీ భవన్ గెస్ట్ హౌస్ కాదని, ఎవరు నేర్పారయ్యా.. ఏం ఎమ్మెల్యేలు వస్తే రూములు తీయడం తెలియదా, మీ మీద చర్య తీసుకోవాలని అన్నారని పేర్కొంది.
వదిలి పెట్టనని.
2016 జూన్ 1న కృష్ణా జిల్లా పెనగంచిప్రోలులో జన్మభూమి కార్యక్రమం సందర్భంగా జాయింట్ కలెక్టర్ను వేదిక పైకి పిలిచి.. ఏయ్ నువ్వు ఏం చేస్తున్నావ్. తమాషాగా ఉందా, ఇదేం అడ్మినిస్ట్రేషన్, ఇక్కడ రెవెన్యూ అధికారులు ఏం చేస్తున్నారు.. ఏయ్ జేసీ చంద్రుడు. నువ్వేం చేస్తున్నావ్. నేను ఎవర్నీ వదిలి పెట్టనని అన్నాడని పేర్కొంది.
2016 మార్చి 21న ఆర్థిక శాఖ అధికారిని సచివాలయానికి పిలిపించుకొని.. ఏం పిచ్చపిచ్చగా ఉందా, తమాషాలు చేస్తున్నారు, ప్రతి ఫైల్లో ఇష్టానుసారంగా రాస్తే ఎలా, ఇలాగైతే పరిపాలన ఎలా చేయాలని హెచ్చరించారని రాసింది.
బెదిరించి, చెప్పింది చేసిన బాబు
చివరలో కృష్ణా జిల్లా తహసీల్దారు వనజాక్షి పైన ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ దౌర్జన్యం చేసినా చంద్రబాబు ఆమె పైనే ఆగ్రహం వ్యక్తం చేశారని పేర్కొంది. ఆ తర్వాత 1993లో ఉప ఎన్నికల ప్రచారంలో భాగంగా కొడుమూరు వచ్చిన చంద్రబాబు.. నాటి స్థానిక ఎస్సై పీఎన్ బాబును దూషించారని, అధికారంలోకి వస్తే ఫుట్బాల్ ఆడుకుంటానని హెచ్చరించారని పేర్కొంది. అంతేకాదు, 1995లో అధికారంలోకి వచ్చాక బాబును రైల్వే డిపార్టుమెంటుకు బదలీ చేయించారని రాసింది.