తిరిగొచ్చాక 'కొరియా' నేర్చుకోమంటారా?: మోడీని మించిపోతున్న బాబు, ఒరిగిందేమిటి?
విజయవాడ: ఒకటా.. రెండా.. ఇప్పటికీ 18 విదేశీ టూర్స్. కోట్ల కొద్ది ప్రజాధనం. సాధించిందేమైనా ఉందా? అని ప్రశ్నించుకుంటే.. కియో కార్ల కంపెనీ పేరు తప్ప మరొకటి కనిపించదు. అయినా సరే, చంద్రబాబు పట్టు వదలరు.. ఫ్లైట్ ఎక్కాల్సిందే, ప్రతీ దేశమూ తిరగాల్సిందే.
పెట్టుబడులు రావడం సంగతి అటు ఉంచితే.. ఈ టూర్స్ దెబ్బకు రాష్ట్ర ఖజానాపై భారం పడుతున్న పరిస్థితి. ఇలా చంద్రబాబు తరహాలో విదేశాల్లో ఇన్నిసార్లు ల్యాండ్ అయిన సీఎం కూడా మరొకరు లేరు. ఏకంగా ప్రధాని మోడీకే పోటీగా ఆయన విదేశీ టూర్స్ సాగిస్తున్నారు. విమర్శలెన్ని వచ్చినా.. అవేవీ పట్టించుకునే స్థితిలో కూడా ఆయన ఉన్నట్లు కనిపించడం లేదు.
దుబారా రూ.100కోట్లు, ఇదేం లెక్క బాబు!, జాతీయ మీడియానే నివ్వెరపోతోంది!
దక్షిణ కొరియా పర్యటన:
ఆంధ్రప్రదేశ్కు పెట్టుబడులే లక్ష్యంగా చంద్రబాబు&కో తాజాగా దక్షిణ కొరియాలో వాలిపోయింది. డిసెంబర్ 4నుంచి 6వరకు కొరియాలో బిజీబిజీగా పర్యటించనున్నారు. 6 ద్వైపాక్షిక సమావేశాలు, 2 గ్రూపు భేటీలు, 2 ఎంవోయూలు, 2 రోడ్ షోలు, పలు బిజినెస్ సెమినార్లతో చంద్రబాబు సియోల్ షెడ్యూల్ సాగనుంది. ఈ టూర్తో చంద్రబాబు పర్యటించిన దేశాల సంఖ్య దాదాపుగా 20 దాటింది. ఒక సీఎం ఇన్ని దేశాల్లోపర్యటించడం ఒక రికార్డు అనే చెబుతున్నారు.
పాలన పడకేసిందా?: బాబు సహా మంత్రులు కూడా విదేశాల్లోనే.., కష్టమే?
ఇప్పటిదాకా పర్యటించినవి:
2014లో అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఇప్పటివరకు సుమారు 20దేశాల్లో చంద్రబాబు పర్యటించారు. సింగపూర్, జపాన్, దావోస్, చైనా, టర్కీ, సింగపూర్, లండన్, థాయిలాండ్, స్విట్జర్లాండ్, కజకిస్థాన్, రష్యా, శ్రీలంక, అమెరికా, దుబాయ్, దక్షిణకొరియా.. ఇలా ఆ పరంపర కొనసాగుతోంది.
సౌత్ కొరియాకు మరో రాజధానిగా:
చంద్రబాబు ఎక్కడికెళ్లినా.. అమరావతిని ఆ దేశ రెండో రాజధానిగా ఉపయోగించుకోవాలంటూ అభ్యర్థిస్తుండటంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మొన్నటిదాకా అమరావతిని సింగపూర్, టోక్యో, షాంఘై, దావోస్, ఇస్తాంబుల్లా తీర్చిదిద్దుతానన్న బాబు.. ఇప్పుడు 'సియోల్' అంటున్నారు.
మొన్నామధ్య జపాన్ పర్యటన వెళ్లొచ్చారో లేదో.. అర్జెంటుగా అందరూ జపనీస్ నేర్చుకోవాలంటూ హడావుడి చేశారు. దీనిపై ఎన్ని జోక్స్ పేలినా ఆయన తీరు మాత్రం మారలేదు. ఇప్పుడు కొరియా వెళ్లారు కాబట్టి.. తిరిగొచ్చాక కొరియా నేర్చుకోమంటారా ఏంటీ? అన్న జోక్స్ పేలుతున్నాయి.
విమర్శలు?:
ఇప్పటికీ జాతీయ భాష హిందీలో సరిగ్గా మాట్లాడలేరన్న విమర్శ చంద్రబాబుపై ఉంది. అలాంటిది ఆంధ్రప్రదేశ్ ప్రజలను మాత్రం అర్జెంటుగా మరో దేశ భాష నేర్చుకోవాలనడంపై అప్పట్లో చాలానే సెటైర్స్ వినిపించాయి.
ఇప్పుడు గానీ దక్షిణ కొరియా నుంచి తిరిగొచ్చి కొరియా లాంగ్వేజ్ నేర్చుకోవాలన్నారంటే.. మళ్లీ సెటైర్స్, జోక్స్ పేలడం ఖాయం. ఇంత జరిగినా.. ఆయన మాత్రం తన పంథా మార్చుకోరు అనేవాళ్లు లేకపోలేదనుకోండి..
ఇదిలా ఉంటే, చంద్రబాబు విదేశీ పర్యటనలపై అప్పట్లోనే మోడీ సీరియస్ అయ్యారని ప్రచారం జరిగిన సంగతి తెలిసిందే. గత కొన్ని నెలలుగా చంద్రబాబును ఆయన దూరం పెడుతూ వస్తున్నారు. నీతి ఆయోగ్ ఆధ్వర్యంలో ఇటీవల నిర్వహించిన గ్లోబల్ ఎంటర్ప్రెన్యూర్షిప్ సమ్మిట్కు కూడా చంద్రబాబుకు ఆహ్వానం అందని సంగతి తెలిసిందే. విదేశీ పర్యటనలపై కేంద్రం సీరియస్ అయినా చంద్రబాబు పట్టించుకోకపోవడం గమనార్హం.