సత్యం స్కాం: జైలు నుండి విడుదలైన రామలింగరాజు
హైదరాబాద్: సత్యం కుంభకోణంలో అరెస్టైన రామలింగ రాజు సహా పదిమంది దోషులు చర్లపల్లి కారాగారం నుండి బుధవారం సాయంత్రం విడుదలయ్యారు. వీరు బుధవారం పూచీకత్తును సమర్పించారు. జరిమానాలో పదోశాతం చెల్లించారు. దీంతో వారి విడుదలకు కోర్టు ఆదేశాలు ఇచ్చింది.
సత్యం కుంభకోణంలోని దోషులు ప్రత్యేక న్యాయస్థానంలో తమ పూచీకత్తును సమర్పించారు. సత్యం స్కాం కేసులో సిబీఐ న్యాయస్థానం రామలింగ రాజుకు ఏడేళ్ల జైలు శిక్ష రూ.5 కోట్ల జరిమానా విధించింది. రామరాజుకు కూడా ఏడేళ్ల జైలు, రూ.5కోట్ల జరిమానా విధించింది. మిగతా నిందితులకు ఏడేళ్ల జైలు శిక్ష రూ.25 లక్షల జరిమానా విధించింది.
దీనిపై, సత్యం రామలింగ రాజు సహా మిగతా నిందితులు కోర్టులో అప్పీల్ చేసుకున్నారు. వారికి బెయిల్ వచ్చింది. నిందితులందరికీ నాంపల్లి ప్రత్యేక న్యాయస్థానం సోమవారం బెయిల్ మంజూరు చేసింది. రామలింగరాజు, రామరాజు రూ.లక్ష, మిగిలిన నిందితులు రూ.50వేలు ష్యూరిటీ ఇవ్వాలని కోర్టు ఆదేశించింది. దీంతో వారు ఈ రోజు విడుదలయ్యారు.
కాగా, సత్యం కంపూటర్స్ కుంభకోణం కేసు దోషులు పది రోజుల క్రితం హైదరాబాదులోని నాంపల్లి సెషన్స్ కోర్టును ఆశ్రయించారు. ఈ కేసులో దోషులుగా తేలి చర్లపల్లి జైలులో శిక్ష అనుభవిస్తున్న రామలింగ రాజు సహా ఇతరులు న్యాయస్థానంలో అఫీల్ దాఖలు చేశారు.
ప్రత్యేక న్యాయస్థానం చెప్పిన తీర్పును రద్దు చేయాలని వారు కోరారు. సత్యం కంప్యూటర్స్ కుంభకోణం కేసులో రామలింగ రాజు సహా పది మంది దోషులకు తమకు విధించిన శిక్షను సవాల్ చేస్తూ దాఖలు చేసుకున్న అప్పీళ్లను విచారించేందుకు హైకోర్టు నిరాకరించిన విషయం తెలిసిందే.
హైదరాబాదులోని నాంపల్లి ఎంఎస్జె కోర్టును ఆశ్రయించాలని హైకోర్టు వారికి సూచించింది. దాంతో ఈ కేసులో దోషులుగా తేలినవాళ్లంతా నాంపల్లిలోని కోర్టుకు వెళ్లారు. వారికి నాంపల్లి ఆర్థిక నేరాల కోర్టు వీరికి సోమవారం బెయిల్ మంజూరు చేయడంతో, బుధవారం పూచీకత్తు సమర్పించి విడుదలయ్యారు.