సత్యం ఫ్రాడ్: రామలింగ రాజుకు దేవుళ్లు కూడా ముఖం చాటేశారు
హైదరాబాద్: సత్యం కంప్యూటర్స్ కుంభకోణం కేసులో రామలింగ రాజుకు దేవుళ్లు కూడా సహాయం చేయలేకపోయారు. వారంతా ముఖం చాటేసినట్లు కనిపించారు. సత్యం కుంభకోణం కేసు నుంచి రామలింగ రాజును బయటపడేయాలని ప్రార్థిస్తూ ఖరీదైన ఆచారాలు, యజ్ఞాలు చేపట్టారు.
తమకు పెద్ద దిక్కుగా భావించే రామలింగ రాజు కోసం ఆయన వంశానికి చెందినవారు పూజలు, యజ్ఞాలు, దానధర్మాలు చేశారు. ఇందుకు సంబంధించి జాతీయ మీడియాలో కూడా వార్తలు వచ్చాయి.
మీడియా కథనాల ప్రకారం - డజన్ల కొద్ది రామలింగ రాజు విధేయులు, అభిమానులు మేడ్చెల్లోని ఆయన అధికార నివాసం వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించారు. గత ఏడాది కాలంగా వారు చేయని పూజలు లేవు.
పౌర్ణమి పూజలు, శ్రీరామనవమి సందర్భంగా ప్రత్యేక పూజలు, హోమాలు చేశారు. రామలింగ రాజును, అతని బృందాన్ని కేసు నుంచి బయటపడేయాలని కోరుకుంటూ మేడ్చెల్లోని రామరాజు నగర్లో గల సీతారామాంజనేయ దేవస్థానాన్ని ప్రతి నిత్యం సందర్శిస్తూ వచ్చారు.
దేవాలయానికి విరాళాలు ఇచ్చారు. ఇతర భక్తులకు అన్నదానం చేశఆరు. ప్రత్యేక సుదర్శన యాగం నిర్వహించారు. అవేవీ రామలింగ రాజును కేసు నుంచి బయటపడేయలేదు. రామలింగ రాజుకు, అతని బృందాన్ని ఏడేళ్ల జైలు శిక్ష పడింది.