సత్యం స్కాం: రామలింగ రాజు సహా అందరికీ బెయిల్
హైదరాబాద్: సత్యం రామలింగ రాజుకు బెయిల్ వచ్చింది. సత్యం కుంభకోణం కేసులో జైలులో రామలింగ రాజుతో పాటు ఈ కేసులో నిందితులందరికీ నాంపల్లి ప్రత్యేక న్యాయస్థానం సోమవారం బెయిల్ మంజూరు చేసింది. రామలింగరాజు, రామరాజు రూ.లక్ష, మిగిలిన నిందితులు రూ.50వేలు ష్యూరిటీ ఇవ్వాలని కోర్టు ఆదేశించింది.
కాగా, సత్యం కంపూటర్స్ కుంభకోణం కేసు దోషులు వారం రోజుల క్రితం హైదరాబాదులోని నాంపల్లి సెషన్స్ కోర్టును ఆశ్రయించారు. ఈ కేసులో దోషులుగా తేలి చర్లపల్లి జైలులో శిక్ష అనుభవిస్తున్న రామలింగ రాజు సహా ఇతరులు న్యాయస్థానంలో అఫీల్ దాఖలు చేశారు.
ప్రత్యేక న్యాయస్థానం చెప్పిన తీర్పును రద్దు చేయాలని వారు కోరారు. సత్యం కంప్యూటర్స్ కుంభకోణం కేసులో రామలింగ రాజు సహా పది మంది దోషులకు తమకు విధించిన శిక్షను సవాల్ చేస్తూ దాఖలు చేసుకున్న అప్పీళ్లను విచారించేందుకు హైకోర్టు నిరాకరించిన విషయం తెలిసిందే.
హైదరాబాదులోని నాంపల్లి ఎంఎస్జె కోర్టును ఆశ్రయించాలని హైకోర్టు వారికి సూచించింది. దాంతో ఈ కేసులో దోషులుగా తేలినవాళ్లంతా నాంపల్లిలోని కోర్టుకు వెళ్లారు. వారికి నాంపల్లి ఆర్థిక నేరాల కోర్టు వీరికి సోమవారం బెయిల్ మంజూరు చేసింది.