'సత్యం' రాజుపై సెబీ బ్యాన్: కథాకమామీషు ఏమిటి?
హైదరాబాద్: సత్యం కంప్యూటర్స్ వ్యవస్థాపకుడు రామలింగ రాజు పతనం మేటాస్తో ప్రారంభమైంది. సత్యం కంప్యూటర్స్ కుంభకోణంలో కీలక నిందితుడైన బి రామలింగరాజు సహా మరో నలుగురిపై మార్కెట్ నియంత్రణ సంస్థ సెబి వేటు వేసిన విషయం తెలిసిందే. పధ్నాలుగేళ్లపాటు మార్కెట్ లావాదేవీలు నిర్వహించకుండా నిషేధం విధించటంతో పాటు చట్టవిరుద్ధంగా సంపాదించిన 1,849 కోట్ల రూపాయల మొత్తాన్ని వడ్డీతో సహా చెల్లించాలని ఆదేశించింది. 65 పేజీలతో ఇందుకు సంబంధించి సెబీ ఉత్తర్వులు జారీ చేసింది.
2008 డిసెంబర్ 16వ తేదీన మేటాస్ ఇన్ఫ్రా లిమిటెడ్లో 51 శాతం, మేటాస్ ప్రాపర్టీస్లో 100 శాతం వాటాలను కొనుగోలు చేస్తున్నట్లు సత్యం ప్రకటించిన నాటి నుంచి పతనం ప్రారంభమైంది. ఈ రెండు కంపెనీలను 160 కోట్ల డాలర్ల పెట్టుబడితో రామలింగ రాజు కుమారులు తేజ రాజు, రామరాజు ప్రమోట్ చేశారు.
ఈ కొనుగోలు ప్రతిపాదనలపై ఇన్వెస్టర్ల నుంచి పెద్ద ఎత్తున వ్యతిరేకత వ్యక్తం కావటంతో మరుసటి రోజే డిసెంబర్ 17వ తేదీన దీన్ని విరమించుకున్నారు. ఈ రెండు కంపెనీల్లో సత్యం కంప్యూటర్స్కు ఉన్న వాటాలను విక్రయించేందుకు ప్రయత్నిస్తున్నట్లు చెప్పినప్పటికీ సత్యం పద్దు పుస్తకాల్లో అవకవతకలకు పాల్పడినట్లు వెల్లడి కావటంతో 2009 జనవరి 7న సత్యం బోర్డు నుంచి రామలింగ రాజు తప్పుకున్నారు. ఆ తర్వాత అరెస్టయిన రాజుకు నవంబర్ 2011న బెయిల్ మంజూరైంది.
కుంభకోణం విలువ రూ.12 వేల కోట్లు
సత్యం కంప్యూటర్స్ కుంభకోణం విలువ సుమారు 12,320 కోట్ల రూపాయల వరకు ఉంటుందని సెబి అంచనా వేస్తోంది. రాబడులు, చెల్లింపులను చేర్చకుండా కంపెనీ పద్దు పుస్తకాలను ఏమార్చారని ఈ మొత్తం విలువ 12,318 కోట్ల రూపాయల వరకు ఉంటుందని అంచనా వేస్తున్నట్లు తన 65 పేజీల ఉత్తర్వుల్లో తెలిపింది. ఈ తప్పుడు కార్యకలాపాలకు పాల్పడటం ద్వారా రాజు సహా మరో నలుగురు 1,849 కోట్ల రూపాయలు, వడ్డీల రూపంలో మరో 1,200 కోట్ల రూపాయలను ఆయాచితంగా సంపాదించారని తెలిపింది.
కంపెనీ అంతర్గత ఆడిట్ విచారణలో మొత్తం 7,561 నకిలీ బిల్లులను గుర్తించినట్లు తెలిపింది. అయితే ఈ బిల్లులన్నింటిని ఒక్క ఎగ్జిక్యూటివ్ ఇచ్చినట్లు వెల్లడైందని తెలిపింది. ఐదారేళ్ల కాలంలో ఈ నకిలీ బిల్లుల విలువ దాదాపు 4,783 కోట్ల రూపాయలుగా ఉందని వెల్లడించింది. దానికి తోడు, నకిలీ రుణదాతలను సృష్టించి మరో 500 కోట్ల రూపాయలు జేబులో వేసుకున్నారని తెలిపింది. ఇదే సమయంలో బ్యాంకు బ్యాలెన్స్లు 1,732 కోట్ల రూపాయలు, డిపాజిట్లు 3,308 కోట్ల రూపాయలుగా ఉన్నట్లు చూపించారు.
అదే విధంగా వీటిపై 376 కోట్ల రూపాయల వడ్డీని ఆర్జించినట్లు పద్దు పుస్తకాల్లో చూపించారు. ఇదేసమయంలో రాబడులు, చెల్లింపుల్లో తేడా కూడా 1,425 కోట్ల రూపాయలు, 195 కోట్ల రూపాయలుగా ఉన్నాయని నివేదిక తెలిపింది. మరోవైపు టిడిఎస్లో కూడా తప్పులున్నట్లు గుర్తించినట్లు తెలిపింది.
సెబి నిషేధం విధించిన వారిలో రామలింగరాజు సహా ఆయన సోదరుడు బి రామరాజు (అప్పట్లో సంస్థ మేనేజింగ్ డైరెక్టర్), వడ్లమాని శ్రీనివాస్ (మాజీ సిఎఫ్ఒ), జి రామకృష్ణ (మాజీ వైస్ ప్రెసిడెంట్), విఎస్ ప్రభాకర గుప్తా (మాజీ ఇంటర్నల్ ఆడిట్ అధిపతి) ఉన్నారు. ఈ ఐదుగురు ఉద్దేశపూర్వకంగా వైట్ కాలర్ నేరాలకు పాల్పడటమే కాకుండా వ్యక్తిగతంగా లాభపడే విధంగా ప్రణాళికలు రచించి కంపెనీ, ఇన్వెస్టర్ల ప్రయోజనాలను దెబ్బకొట్టారని సెబి తన 65 పేజీల ఉత్తర్వుల్లో సెబీ వివరించింది.