సత్యం రామలింగ రాజుకు షాక్: 14 ఏళ్లు సెబీ బ్యాన్
న్యూఢిల్లీ: మార్కెట్ వాచ్ డాగ్ సెబీ సత్యం కంప్యూటర్స్ వ్యవస్థాపకుడు బి. రామలింగ రాజుకు షాక్ ఇచ్చింది. రామలింగ రాజుతో పాటు మరో నలుగురు ఎగ్జిక్యూటివ్లను క్యాపిటల్ మార్కెట్ నుంచి 14 ఏళ్ల నిషేధిస్తూ మంగళవారం నిర్ణయాన్ని ప్రకటించింది.
అంతేకాకుండా రూ.1,849 కోట్ల రూపాయల అక్రమ లాభాలను వడ్డీతో పాటు చెల్లించాలని సెబీ వారిని ఆదేశించింది. జులై 15వ తేదీ నుంచి 45 రోజుల్లోగా పెనాల్టీని చెల్లించాలని సూచించింది. దానికి ఏడాదికి 12 శాతం వడ్డీ కూడా చెల్లించాలని ఆదేశించింది.
దేశంలో అత్యంత పెద్ద కుంభకోణంగా పేరుమోసిన సత్యం కుంభకోణం 2009 జనవరి 7వ తేదీన వెలుగు చూసింది. కంపెనీ ఖాతా పుస్తకాలను తారుమారు చేశానని, కోట్లాది రూపాయల మేరకు చాలా ఏళ్లు లాభాలను అధికం చేసి చూపించానని రామలింగ రాజు స్వయంగా చెప్పుకున్నారు.
ఆ ప్రకటన చేసిన రెండు రోజుల తర్వాత ఆంధ్రప్రదేశ్ సిఐడి పోలీసులు రామలింగరాజును, ఆయన సోదరుడిని అరెస్టు చేశారు. అదే ఏడాది ఫిబ్రవరిలో సిబిఐ కేసును తన ఆధీనంలోకి తీసుకుని దర్యాప్తు చేపట్టింది. మొదటి మూడు చార్జిషీట్లు దాఖలు చేసిన సిబిఐ ఆ తర్వాత ఒకే చార్జిషీట్ కిందికి మార్చింది.