సేవ్ అమరావతి .. 30వ రోజు నిరసనలు .. మద్దతుగా బాలకృష్ణ ,సీపీఐ నేతల పర్యటన
ఆంధ్రప్రదేశ్ లో సేవ్ అమరావతి సేవ్ ఆంధ్రప్రదేశ్ అంటూ కొనసాగుతున్న నిరసనలు నేటితో 30వ రోజుకు చేరాయి. రాజధాని రైతుల పోరాటం ఇప్పటికీ ఉధృతంగా సాగుతుంది. పండుగ కూడా జరుపుకోకుండా రాజధాని రైతులు నిరసనలు ఉపవాస దీక్షలు చేస్తున్నారు.అమరావతినే రాజధానిగా కొనసాగించాలంటూ రైతులు చేస్తున్న పోరాటానికి ప్రతిపక్ష పార్టీలు మద్దతు తెలుపుతున్నాయి. అయితే రాజధాని రైతులు ఇంతగా పోరాటం సాగిస్తున్నా, రాజధాని రైతులు మనస్తాపంతో మృతి చెందుతున్నా ప్రభుత్వం నుంచి మాత్రం ఎలాంటి స్పందన లేదు.
30వరోజు రాజధాని గ్రామాల్లో రిలే దీక్షలు కొనసాగిస్తున్న రైతులు
రైతులు చనిపోతున్నా, మహిళలుకన్నీటి పర్యంతం అవుతున్నా వారి ఆవేదన ఎవరికి పట్టడం లేదు. రాజధాని రైతుల వేదన అరణ్య రోదనగా మారుతుంది. ఇప్పటికే పండగకు దూరంగా ఉన్న రాజధాని గ్రామాల రైతులు తమ పోరును మరింత ఉధృతం చేసేందుకు సిద్ధమయ్యారు. గురువారం మందడం, తుళ్లూరులో మహాధర్నాకు దిగిన రైతులు రాజధాని అమరావతి ముద్దు మూడు రాజధానులు వద్దు అని నినదిస్తున్నారు. . వెలగపూడి, కృష్ణాయపాలెంలో 30వరోజు రిలే దీక్షలు కొనసాగిస్తున్న రైతులు ప్రభుత్వం నిర్ణయం మార్చుకోవాలని డిమాండ్ చేస్తున్నారు .
ప్రతిపక్ష పార్టీలన్నీ రైతులకే మద్దతు
నిడమర్రు,నవులూరు,ఎర్రబాలెంతో పాటు ఇతర రాజధాని గ్రామాల్లోనూ నిరసనలు, ఆందోళనలు కొనసాగుతున్నాయి.. జై అమరావతి నినాదంతో రాజధాని గ్రామాల్లో ఆందోళన కొనసాగుతుంది. ఇక రాజధాని రైతుల పోరాటానికి ప్రతి ఒక్కరూ మద్దతు తెలుపుతున్నారు. ప్రతిపక్ష పార్టీలన్నీ రాజధాని అమరావతినే కొనసాగించాలని తమ స్టాండ్ ను ఇప్పటికే తెలియజేశాయి . ఇక రాజధాని రైతులకు మద్దతుగా విపక్షాలు, ప్రజా, విద్యార్థి సంఘాలు దీక్షా శిబిరాలకు చేరుకుని రైతులకు సంఘీభావం ప్రకటిస్తున్నారు.
రాజధాని గ్రామాల్లో బాలకృష్ణ , సీపీఐ నేతల పర్యటన
నేడు అమరావతిలో నందమూరి బాలకృష్ణతో పాటు సీపీఐ నేతలు రాజధాని అమరావతి పోరాటానికి మద్దతుగా పర్యటించనున్నారు. బాలకృష్ణ రాజధాని ప్రాంత రైతులను కలుసుకుని భరోసా కల్పించనున్నారు. అటు సీపీఐ నేతలు నారాయణ, రామకృష్ణ, నాగేశ్వరరావు దీక్షా శిబిరాలను సందర్శించి రైతులను సంఘీభావం తెలపనున్నారు. ప్రభుత్వ తీరును ఎండగట్టనున్నారు. ఇక రైతులు సైతం రాజధాని అమరావతి అని సీఎం జగన్ ప్రకటించేవరకు తమ ఉద్యమాన్ని ఆపమని చెప్తున్నారు. ప్రాణాలైనా వదిలేస్తాం కానీ రాజధాని అమరావతిని విడిచిపెట్టమని చెప్తున్నారు. రాజధానిగా అమరావతినే కొనసాగించాలని డిమాండ్ చేస్తున్నారు.