నివర్ తుపానుతో భారీ నష్టం: పవన్ కళ్యాణ్ ఆవేదన, జగన్ సర్కారుకు విజ్ఞప్తి
అమరావతి: నివర్ తుపాను కారణంగా రాష్ట్రంలో రైతులు తీవ్రంగా నష్టపోవడం దురదృష్టకరమని, వారిని ప్రభుత్వం ఆదుకోవాలని జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కోరారు. క్షేత్రస్థాయి సమాచారం ప్రకారం సుమారు రూ. 1000 కోట్ల మేర పంట నష్టం జరిగినట్లు తెలిసిందన్నారు.
రైతుల పరిస్థితిపై పవన్ కళ్యాణ్ ఆవేదన
ఈ పరిస్థితుల్లో రైతులను అన్ని విధాలా ఆదుకోవాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వంపై ఉందని పవన్ కళ్యాణ్ అన్నారు. పంటలు చేతికొచ్చే సమయంలో ప్రకృతి విపత్తుతో రైతులు నష్టపోయారని తెలిపారు. అప్పులపాలవుతున్న రైతులను మరింత కుంగదీసేలా ఈ నష్టాలు ఉన్నాయని పవన్ కళ్యాణ్ ఆవేదన వ్యక్తం చేశారు.
రైతులను ఆదుకోండి..
ఈ మేరకు పవన్ ఓ ప్రకటన విడుదల చేశారు. పెట్టుబడి రాయితీతోపాటు పంటల బీమాను సకాలంలో అందించడం చాలా అవసరమని అన్నారు. గత సంవత్సరం ఖరీఫ్, రబీ పంటల నష్టానికి సంబంధించిన బీమా మొత్తాలు ఇప్పటికీ దెబ్బతిన్న రైతులకు అందలేదని, ఈ విషయంలో వ్యవసాయ శాఖ తగిన చర్యలు తీసుకోవాలని కోరారు.
నివర్ తుపానుతో భారీ నష్టం..
ప్రకృతి విపత్తుల వల్ల ఈ ఏడాది పంటలు కోల్పోయిన రైతులకు విత్తనాలు, ఎరువులు ఉచితంగా అందజేస్తే వ్యవసాయం చేసేవారికి ధీమా కలుగుతుందని పవన్ అభిప్రాయపడ్డారు. నివర్ తుపాను మూలంగా ఇళ్ళల్లోకి నీళ్ళు చేరి ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని చెప్పారు. నివర్ తుఫానులో నిరాశ్రయులైన వారికి తక్షణమే ఆదుకునేలా ప్రభుత్వం చర్యలు చేపట్టాలని, బాధితులక ఉపశమనం కలిగించాలని పవన్ కళ్యాణ్ విజ్ఞప్తి చేశారు.
Recommended Video
జనసైనికులకు పవన్ కళ్యాణ్ పిలుపు
అంతేగాక, రాబోయే కొద్ది రోజుల్లో మరో తుపాను పొంచివుందని, ప్రజలను ముందుగా అప్రమత్తం చేసే చర్యల్లో జనసైనికులు భాగస్వాములు కావాలని పవన్ కళ్యాణ్ పిలుపునిచ్చారు. నివర్ తుపాను కారణంగా ఏపీలోని చాలా ప్రాంతాలు నీటి మునిగాయి. చాలా ప్రాంతాల్లో భారీ ఎత్తున పంట నష్టం సంభవించింది. లోతట్టు ప్రాంతాలు నీటమునగడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఏపీతోపాటు తెలంగాణలోని పలు ప్రాంతాల్లో కూడా వర్షాలు కురుస్తున్నాయి. నివర్ తుపాను ప్రభావం తమిళనాడు, పుదుచ్చేరి, కర్ణాటకలో ఎక్కువగా ఉంది.