ఆర్థిక కష్టాల్లో టీటీడీ.. నిర్మలమ్మే దిక్కు.. రూ. 50 కోట్ల రద్దయిన నోట్లపైనా రిక్వెస్ట్..
''సుదీర్ఘ లాక్ డౌన్ తర్వాత జూన్ 11 నుంచి శ్రీవారి దర్శనాలు పున:ప్రారంభమయ్యాయి. జులై 10 వరకు మొత్తం 2.50లక్షల మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. హుండీద్వారా రూ.16.73 కోట్లు, లడ్డూల విక్రయంతో రూ.13.36లక్షలు, తలనీలాల ద్వారా మరో రూ.7 కోట్లు ఆదాయం సమకూరింది. మొత్తంగా సెప్టెంబర్ నెల వరకు మాత్రమే వ్యవస్థను నడిపించగల సదుపాయాలున్నాయి. ఆ తర్వాత అంతా వేంకటేశ్వరుడి దయ.. '' అంటూ తిరుమల తిరుమల తిరుపతి దేవస్థానం(టీటీడీ) ఈవో అనిల్ కుమార్ సింఘాల్ కీలక ప్రకటన చేసిన కొద్ది గంటలకే దేశరాజధాని ఢిల్లీలో టీటీడీకి సంబంధించి కీలక పరిణామాలు చోటుచేసుకున్నాయి.
జగన్ పై డిప్యూటీ సీఎంకే నమ్మకం లేదు.. బాషాకు హైదరాబాద్లో ట్రీట్మెంట్.. టక్కుఠమారాలన్న సాయిరెడ్డి..
టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి సోమవారం ఢిల్లీలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ను కలిసి, కీలక అంశాలపై చర్చలు జరిపారు. ఉదయం భేటీ జరగ్గా, సంబంధిత వివరాలను సాయంత్రానికి సుబ్బారెడ్డే స్వయంగా వెల్లడించారు. లాక్ డౌన్ కారణంగా ఆదాయం బాగా పడిపోవడంతో టీడీడీ ఆర్థిక కష్టాలను ఎదుర్కొవాల్సి వస్తున్నదని, ఈ పరిస్థితి నుంచి గట్టెక్కేలా ఆర్థిక మంత్రి సహకరించాలని కోరినట్లు సుబ్బారెడ్డి తెలిపారు.
''కష్టాల్లో ఉన్న టీటీడీని ఆదుకోవాలని కేంద్రాన్ని కోరాను. పెద్ద నోట్ల రద్దు సమయంలో టీడీపీ వద్ద ఉండిపోయిన రూ. 50 కోట్ల విలువైన పాత నోట్లను కొత్త నోట్లతో మార్పిడి చేయాలని కోరాను. స్వామి వారికి భక్తులు ఇచ్చే కానుకలను డబ్బు రూపంలోకి మార్చుకునే వెసులుబాటు కూడా కల్పించాలని అడిగాను'' అని నిర్మలతో భేటీ వివరాలను వైవీ వివరించారు. టీటీడీకి సంబంధించి అంశాలతోపాటు ఏపీలో వెనుకబడిన జిల్లాలకు ప్రత్యేక నిధులు, పోలవరం ప్రాజెక్టుకు సహకారం తదితర విషయాలనూ ప్రస్తావించినట్లు తెలిపారు.
టీటీడీకి సంబంధించిన వివిధ వ్యవహారాలపై ఇటీవలి కాలంలో విమర్శలు ఎక్కువగా వస్తున్న నేపథ్యంలో శ్రీవారి ఆస్తులపై శ్వేతపత్రాన్ని విడుదల చేస్తామంటూ ఈవో సింఘాల్ సంచలన ప్రకటన చేశారు. ఆదివారం డయల్ యువర్ ఈవో కార్యక్రమంలో ఆయనీ వ్యాఖ్యలుచేయగా, సోమవారం కేంద్ర ఆర్థిక మంత్రితో టీటీడీ చైర్మన్ భేటీలోనూ ఈ అంశం చర్చకు రావొచ్చనే వార్తలు వచ్చాయి. కానీ శేతపత్రం విడుదలపై కేంద్రంతో టీటీడీ చర్చంచలేదని సుబ్బారెడ్డి వ్యాఖ్యలతో స్పష్టమైపోయింది. టీటీడీ అభ్యర్థనలపై సానుకూలంగా స్పందించిన కేంద్ర మంత్రి నిర్మల.. త్వరలోనే వీటిపై నిర్ణయం తీసుకుంటామని చెప్పినట్లు తెలుస్తోంది.