బకాయిపడ్డారు: మాజీ కేంద్రమంత్రి ఆస్తుల వేలానికి సిద్ధమైన ఎస్బీఐ
హైదరాబాద్: కేంద్ర మాజీ మంత్రి, బీజేపీ నేత కావూరి సాంబశివరావుకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) షాక్ ఇవ్వనుంది. కావూరి కుటుంబానికి చెందిన 'ప్రోగ్రెసివ్ కన్స్ట్రక్షన్' సంస్థ ఎస్బీఐకి బకాయిపడ్డ అప్పులను రాబట్టుకునేందుకు రంగం సిద్ధం చేసినట్లుగా తెలుస్తోంది.
కావూరి సాంబశివరావు ప్రమోట్ చేసిన ప్రోగ్రెసివ్ కన్స్ట్రక్షన్ కంపెనీని ప్రస్తుతం ఆయన కుమార్తె శ్రీవాణి ముళ్లపూడి మేనేజింగ్ డైరెక్టర్గా ఉన్నారు. మౌలిక వసతుల అభివృద్ధి, నిర్మాణ రంగంలో దేశంలోనే ప్రముఖ కంపెనీల్లో ఒకటిగా ఎదిగిన ఈ కంపెనీ కావూరి కుమారుడు భాస్కరరావు కూడా గతంలో డైరెక్టర్గా ఉన్నారు.
2013 వరకు మెరుగైన లాభాలను ప్రదర్శించిన సంస్ధ ఆ తర్వాత కాలంలో ఆటుపోట్లను ఎదుర్కొంది. అంతేకాదు ఫ్రాడ్ అండ్ కరెప్షన్ పాలసీని అతిక్రమించిన ఆరోపణలతో తాను చేపట్టే పనుల నుంచి ప్రోగ్రెసివ్ కన్స్ట్రక్షన్ను వరల్డ్ బ్యాంకు్ ఈ సంస్ధను 11 ఏళ్ల పాటు నిషేధించింది.
దీంతో కంపెనీ ఒక్కసారిగా ఆర్ధిక ఇబ్బందుల్లో పడిపోయింది. ఆ తర్వాత పలు బ్యాంకుల నుంచి తీసుకున్న రుణ వాయిదాల చెల్లింపులను కూడా ప్రోగ్రెసివ్ కన్స్ట్రక్షన్ సక్రమంగా చెల్లించలేపోయింది. ఈ క్రమంలో ప్రోగ్రెసివ్ కన్స్ట్రక్షన్... దేశంలోని వివిధ బ్యాంకులకు రూ.1,000 కోట్ల మేర బకాయి పడినట్లు సమాచారం.
ఈ క్రమంలో ఎస్బీఐకి బకాయిపడ్డ అప్పులను రాబట్టుకునేందుకు రంగంలోకి దిగింది. ఎస్బీఐకి ప్రోగ్రెసివ్ కన్స్ట్రక్షన్ కంపెనీ రూ.35.53 కోట్లు బకాయి పడింది. దీంతో రుణం తీసుకునే సమయంలో తన వద్ద తాకట్టు పెట్టిన మూడు ఆస్తులను ఎస్బీఐ ఇప్పటికే స్వాధీనం చేసుకుంది.
తాజాగా వీటిని వేలం వేసేందుకు ఎస్బీఐ సన్నాహాలు చేస్తోంది. వచ్చే నెల 29న నిర్వహించనున్న ఆన్లైన్ వేలానికి సంబంధించి బ్యాంకు గురువారం ఓ స్పష్టమైన ప్రకటనను జారీ చేసింది. రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ పరిసరాల్లోని వట్టినాగులపల్లి పరిధిలోని మూడు ఆస్తులను ప్రోగ్రెసివ్ కన్స్ట్రక్షన్ బ్యాంకుకు తనఖా పెట్టి రుణం తీసుకుంది.
కావూరి సాంబశివరావు కూతురు శ్రీవాణి ముళ్లపూడి పేరిట ఈ ఆస్తులున్నాయి. వీటిలో రెండు ఆస్తులు 1.20 ఎకరాల విస్తీర్ణం చొప్పున ఉండగా, మరో ఆస్తి 2 ఎకరాల విస్తీర్ణంలో ఉంది. ఈ ఆస్తులను వేలం వేసి తద్వారా వచ్చిన సొమ్ముని బకాయిపడ్డ మొత్తానికి బ్యాంకు జమ చేసుకోనుంది.