పెద్దనోట్ల రద్దు: పని ఒత్తిడితో ఎస్బీఐ డిప్యూటీ మేనేజర్ మృతి
అవిశ్రాంతంగా విధులు నిర్వహిస్తూ పనిభారంతో ఒత్తిడికి గురై బ్యాంకు మేనేజర్ ఒకరు శనివారం సాయంత్రం మృతిచెందారు. నెల్లూరు మూలాపేట కోనేటిమిట్టకు చెందిన షేక్ షరీఫ్(43)ఎస్బీఐ బారకాస్ శాఖలో డిప్యూటీ మేనేజర్
నెల్లూరు: అవిశ్రాంతంగా విధులు నిర్వహిస్తూ పనిభారంతో ఒత్తిడికి గురై బ్యాంకు మేనేజర్ ఒకరు శనివారం సాయంత్రం మృతిచెందారు. నెల్లూరు మూలాపేట కోనేటిమిట్టకు చెందిన షేక్ షరీఫ్(43)ఎస్బీఐ బారకాస్ శాఖలో డిప్యూటీ మేనేజర్గా పని చేస్తున్నారు. ఇటీవల కేంద్ర ప్రభుత్వం రూ. 1000. రూ.500 నోట్లను రద్దు చేసినప్పటి నుంచి బ్యాంకులో పనిఒత్తిడి పెరిగింది.
ఈ నేపథ్యం లో శనివారం సాయంత్రం విధి నిర్వహణలో ఉండగా గుండెపోటుతో కుప్పకూలిపోయారు. అప్రమత్తమైన సిబ్బంది వెంటనే ఆయన్ను హుటాహుటి న ఆస్పత్రికి తలించారు. కాగా, మార్గంమధ్యలో ఆయన మృతి చెందారు. బ్యాంకులో పనిభారం, ఒత్తిడి ఎక్కువగా ఉందని తనతో చెప్పాడని షరీఫ్ తండ్రి జహీర్ తెలిపారు.
పెద్ద నోట్లు ప్రాణం తీశాయి
కర్ణాటకలోని తుమకూరు జిల్లా చేళూరులోని స్టేట్బ్యాంక్ ఆఫ్ మైసూర్(ఎస్బీఎం)లో నోట్ల మార్పిడికి శనివారం వృద్ధులకు అవకాశం కల్పించారు. ఈ విషయం తెలుసుకున్న సూలయ్యనపాళ్య గ్రామానికి చెందిన రైతు సిద్ధప్ప(68) రూ.500 నోట్లతో బ్యాంకుకు వెళ్లి క్యూలో నిల్చున్నాడు.
గంటల తరబడి నిలబడటంతో అక్కడే సొమ్మసిల్లి పడిపోయాడు. ఆస్పత్రికి తరలించేసరికే గుండెపోటుతో మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. సిద్ధప్పకు భార్య, ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు.
ప్రాణం తీసిన చిల్లర
చిల్లర సమస్య కారణంగా సకాలంలో వైద్యసేవలు అందక ఓ వ్యక్తి ప్రాణాలో కోల్పోయిన విషాదకర ఘటన తూర్పుగోదావరి జిల్లాలో చోటు చేసుకుంది. గ్రామస్థులు తెలిపిన వివరాల ప్రకారం.. రాజవొమ్మంగి మండలం కిండ్ర గ్రామానికి చెందిన తాపీమేస్త్రి జి కృష్ణ కొన్నాళ్లుగా ఆస్తమాతో బాధపడుతున్నాడు.
ఆదివారం సమస్య ఎక్కువ కావడంతో ఏలేశ్వరం ఆస్పత్రిలో వైద్యం చేయించుకోవడానికి బయలుదేరాడు. చిల్లర లేకపోవడంతో కొత్త రూ.2వేల నోటు పట్టుకుని ఉదయం నుంచి గ్రామంలో పలు దుకాణాలకు తిరగగా మధ్యాహ్నానికి చిల్లర లభించింది. ఇంతలో శ్వాస తీసుకోవడం కష్టమై గ్రామంలోనే ప్రాణాలు కోల్పోయాడు.