పక్క రాష్ట్రంతో పనేంటి: బాబుపై స్వామిగౌడ్ ఫైర్
హైదరాబాద్: తెలంగాణ భవన్లో వార్ రూమ్ ఏర్పాటు చేయడంపై తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు చేసిన వ్యాఖ్యలపై తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) ఎమ్మెల్సీ స్వామిగౌడ్ మండిపడ్డారు. పక్క రాష్ట్రంతో చంద్రబాబుకు పనేమిటని ఆయన అడిగారు. ఎవరి రాష్ట్రాన్ని వాళ్లం బాగు చేసుకుందామని ఆయన శనివారం చంద్రబాబుకు సలహా ఇచ్చారు.
వార్ రూమ్ ఏర్పాటు చేసింది యుద్ధం చేయడానికి కాదని, ఉద్యోగులు పంపకం విషయంలో అభ్యంతరాలు వ్యక్తం చేయడానికి మాత్రమేనని ఆయన స్పష్టత ఇచ్చారు. ఉద్యోగుల సమాచారాన్ని సేకరించడానికి దాన్ని ఏర్పాటు చేశామని ఆయన చెప్పారు. సీమాంధ్రలో పనిచేస్తున్న ఉద్యోగులను తెలంగాణకు రప్పించాలని ఆయన డిమాండ్ చేశారు. ఓ రాష్ట్ర ఉద్యోగులు ఆ రాష్ట్ర సచివాలయంలోనే పనిచేయాలని తెరాస శాసనసభ్యుడు శ్రీనివాస గౌడ్ అన్నారు
కాగా, సీమాంధ్ర, సచివాలయ గెజిటెడ్ ఉద్యోగుల సంఘం నాయకులు శనివారం చంద్రబాబు నాయుడిని కలిశారు. ఎపి రాజధాని నిర్మాణ అంశంపై చర్చిస్తున్నట్లు సీమాంధ్ర గెజిటెడ్ ఉద్యోగుల సంఘం నాయకులు చెప్పారు. ఆంధ్రప్రదేశ్ పేరు మార్చాలని వారు సూచించారు. కెసిఆర్ వ్యాఖ్యలకు భయపడేది లేదని సీమాంధ్ర మహిళా ఉద్యోగులు అన్నారు.
ఉద్యోగుల పంపకాల్లో అక్రమాలు జరుగుతున్నాయంటూ తెలంగాణ ఉద్యోగులు ఆరోపిస్తున్న నేపథ్యంలో తెరాస వార్ రూమ్ను ఏర్పాటు చేసింది. వార్ రూమ్ దేనికి, ఎవరి మీద యుద్ధం చేయడానికి అంటూ చంద్రబాబు విరుచుకుపడ్డారు.