అనుకున్నదే: ఏపీ, తెలంగాణ చీఫ్ జస్టిస్ల బదిలీలపై సుప్రీంకోర్టు కొలీజియం అధికారిక ప్రకటన ఇదే
అమరావతి: ఊహించినట్టే.. రెండు తెలుగు రాష్ట్రాలకు కొత్త ప్రధాన న్యాయమూర్తులు నియమితులు అయ్యారు. ఏపీ, తెలంగాణలతో పాటు సిక్కిం, ఉత్తరాఖండ్ ప్రధాన న్యాయమూర్తులకు స్థానచలనం కల్పించారు. ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తికి చీఫ్ జస్టిస్గా పదోన్నతి కల్పించారు. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన కొద్దిసేపటి కిందటే వెలువడింది. దేశ అత్యున్నత న్యాయస్థానం కొలీజియం ఈ ప్రకటనను జారీ చేసింది. ఆయా రాష్ట్రాల హైకోర్టులకు బదిలీపై వెళ్లిన ప్రధాన న్యాయమూర్తులు త్వరలోనే బాధ్యతలను తీసుకుంటారని తెలిపింది.
Recommended Video
తెలంగాణ హైకోర్టుకు కొత్త ప్రధాన న్యాయమూర్తి: ఏపీకి జస్టిస్ అరుప్ గోస్వామి?
ఏపీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ జితేంద్ర కుమార్ మహేశ్వరి సిక్కింకు బదిలీ అయ్యారు. ప్రస్తుతం సిక్కిం హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా పని చేస్తోన్న అరుప్ కుమార్ గోస్వామిని ఏపీకి బదిలీ చేశారు. ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ హిమ కోహ్లీ.. తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా నియమితులు అయ్యారు. ఆమెకు చీఫ్ జస్టిస్గా పదోన్నతి కల్పించారు. తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రాఘవేంద్ర సింగ్ చౌహాన్ను ఉత్తరాఖండ్కు బదిలీ చేశారు. ఆయనను ఉత్తరాఖండ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా నియమించారు.
ఈ మేరకు సుప్రీంకోర్టు కొలీజియం కొద్దిసేపటి కిందటే ఓ ప్రకటన విడుదల చేసింది. ప్రధాన న్యాయమూర్తుల బదిలీలను అధికారికంగా ప్రకటించింది. రాఘవేంద్ర సింగ్ చౌహాన్ గత ఏడాది జూన్లో తెలంగాణ హైకోర్టుగా నియమితులు అయ్యారు. ఏడాదిన్నర కాలంలోనే ఆయన బదిలీ అయ్యారు. అలాగే- ఏపీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ జేకే మహేశ్వరి కూడా తక్కువ కాలంలోనే బదిలీ అయ్యారు. అరుప్ కుమార్ గోస్వామి స్థానంలో జేకే మహేశ్వరిని సిక్కిం హైకోర్టుకు బదిలీ చేశారు. ఆయన కూడా గత ఏడాదే ఏపీ హైకోర్టు చీఫ్ జస్టిస్గా నియమితులు అయ్యారు. ఇదివరకు ఆయన మధ్యప్రదేశ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా పనిచేశారు.