ఇంత అన్యాయమా?: దశాబ్దం గడిచినా.. వాకపల్లి 'రేప్'పై సుప్రీం సీరియస్, క్వాష్ పిటిషన్ కొట్టివేత
ఇంత అన్యాయమా? అంటూ జస్టిస్ అరుణ్ మిశ్రా, జస్టిస్ మోహన్ శాంతానగౌడార్ల బెంచ్ విస్మయం వ్యక్తం చేసింది.
పాడేరు/న్యూఢిల్లీ: వాకపల్లి గిరిజన మహిళలపై పోలీసుల అత్యాచారం కేసు విషయంలో సుప్రీంకోర్టు సీరియస్ అయింది. దశాబ్దం గడిచిపోయినా ఈనాటికీ విచారణ మొదలుకాలేదంటే.. గిరిజన మహిళలు న్యాయం పొందే హక్కుకు దూరమవుతున్నారని ఆవేదన వ్యక్తం చేసింది.
గిరిజన మహిళల అత్యాచార కేసు విషయంలో ఇంత అన్యాయమా? అంటూ జస్టిస్ అరుణ్ మిశ్రా, జస్టిస్ మోహన్ శాంతానగౌడార్ల బెంచ్ విస్మయం వ్యక్తం చేసింది. ఇప్పటికైనా కేసు విచారణను వేగతవంతం చేయాలని, రోజువారీ విచారణ ద్వారా త్వరితగతిన కేసును తేల్చాలని సుప్రీం ఆదేశాలు జారీ చేసింది.
పోలీసుల పిటిషన్ కొట్టివేత:
కేసులో అభియోగాలు ఎదుర్కొంటున్న 13మంది పోలీసులు.. సుప్రీంలో దీనిపై క్వాష్ పిటిషన్ దాఖలు చేయడంతో.. సుప్రీం దానిని విచారించింది. కేసు నుంచి తమను మినహాయించాలని వారు కోరడాన్ని సుప్రీం తోసిపుచ్చింది. పోలీసులు దాఖలు చేసిన క్వాష్ పిటిషన్ ను కొట్టివేసింది.
వాకపల్లి వాసుల తరుపున సీనియర్ న్యాయవాదులు వ్రిందా గ్రోవర్, స్నేహాషిష్ ముఖర్జీ, రత్నా వాదనలు వినిపించారు. కోర్టు ఆదేశాలతో వాకపల్లి బాధితులకు అనుకూలంగా ఉండటంతో వారి నుంచి హర్షం వ్యక్తమవుతోంది. హక్కుల సంఘాలు కూడా దీనిపై హర్షం వ్యక్తం చేస్తున్నాయి.
అప్పట్లో అసలేం జరిగింది?:
పదేళ్ల క్రితం 2007 ఆగస్టు 20వ తేదీన వాకపల్లిలో జరిగిన ఘటన రాష్ట్రమంతా కలకలం రేపింది. మావోయిస్టులు తలదాచుకున్నారన్న సమాచారంతో.. వాకపల్లిపై దండెత్తిన పోలీసులు.. ప్రతీ ఇంటిని తనిఖీ చేశారు. వాకపల్లి గూడెం మొత్తాన్ని చుట్టుముట్టారు. మగవాళ్లు ఇంట్లో లేరని చెప్పినా.. లోపలకు చొచ్చుకెళ్లి మరీ తనిఖీలు చేశారు. ఈ క్రమంలో కొంతమంది మహిళలకు, పోలీసులకు మధ్య వాగ్వాదం జరగగా.. పోలీసులు వారిపై అత్యాచారం చేసినట్లుగా ఆరోపణలున్నాయి. 13మంది గిరిజన మహిళలపై పోలీసులు అత్యాచారం చేసినట్లుగా ఆరోపణలు వెల్లువెత్తాయి.
పోలీసులపై కేసులు:
13మంది గిరిజన స్త్రీలపై పోలీసులు అత్యాచారం జరిపారన్న ఆరోపణలతో వాకపల్లి అట్టుడికింది. బాధితులకు ప్రజాప్రతినిధులు, ప్రజాసంఘాలు, పలు పార్టీల ప్రతినిధులు మద్దతుగా నిలవడంతో.. ఆరోపణలు ఎదుర్కొంటున్న 22 మంది పోలీసులపై ఐపీసీ సెక్షన్ 37 (2), సెక్షన్ 3 (2), ఎస్సీ, ఎస్టీ అత్యాచారం చట్టం కింద కేసులు నమోదుచేసి విచారణ జరపాలని అప్పటి జిల్లా కలెక్టర్ ఆదేశించారు. అప్పటికే ఇద్దరు గిరిజన మహిళలు అనారోగ్యం కారణంగా ప్రాణాలు కోల్పోయారు.
కలెక్టర్ ఆదేశాలు కేసు కదిలింది:
కలెక్టర్ ఆదేశాలతో ఆరోపణలు ఎదుర్కొంటున్న పోలీసులపై పాడేరు పోలీస్ స్టేషన్లో కేసులు నమోదయ్యాయి. దీనిపై ప్రథమ శ్రేణి జ్యుడీషియల్ కోర్టు విచారణ చేపట్టింది. అయితే ఈ ఆదేశాలను వ్యతిరేకిస్తూ, పోలీసులు హైకోర్టును ఆశ్రయించారు. ఆపై నిరాధార ఆరోపణలతో సుప్రీంను కూడా ఆశ్రయించారు.
పోలీసుల పిటిషన్ను విచారణకు స్వీకరించిన సుప్రీం.. విచారణ సందర్భంగా పలు విషయాల పట్ల విస్మయం వ్యక్తం చేసింది. వాకపల్లి కేసుపై పదేళ్లుగా విచారణ జరగలేదన్న నిజం తెలియడంతో.. క్వాష్ పిటిషన్ను కొట్టివేసింది. దీనిపై జస్టిస్ అరుణ్ మిశ్రా, జస్టిస్ మోహన్ శాంతానగౌడార్ల బెంచ్ తీవ్ర విస్మయాన్ని, ఆగ్రహాన్ని వెలిబుచ్చింది.
కాగా, ఘటన సమయంలో డ్యూటీలో లేరనే కారణంగా.. వారిలో తొమ్మిది పోలీసులను కేసు నుంచి కోర్టు మినహాయించింది.