ఎంసెట్ రెండో విడత కౌన్సెలింగ్: విచారణ వాయిదా
న్యూఢిల్లీ/ హైదరాబాద్: ఎంసెట్ రెండో విడత కౌన్సెలింగ్పై విచారణను బుధవారానికి సుప్రీం కోర్టు వాయిదా వేసింది. ఇంజనీరింగ్ రెండో విడత కౌన్సెలింగ్కు అనుమతిస్తామంటూనే కళాశాలలు ఇచ్చిన అకాడమిక్ షెడ్యూల్పై సుప్రీం కోర్టు తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేసింది. ఏఐసీటీ నింబంధనలు మేరకు ఈ అకాడమిక్ షెడ్యూల్ లేదంటూ కాలేజీలపై కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. మంగళవారం ఉదయం ఎంసెట్ రెండో విడత కౌన్సెలింగ్పై న్యాయమూర్తులు బాబ్డే, ముఖోపాధ్యాయలతో కూడినటువంటి డివిజన్ బెంచ్ ముందు విచారణకు వచ్చిన నేపథ్యంలో అకాడమిక్ షెడ్యూల్ను కాలేజీలు సుప్రీంకు సమర్పించాయి.
ఏఐసీటీ నిబంధనల ప్రకారం ప్రతీ సంవత్సరం 525 గంటల పాటు తరగతులు నిర్వహించాల్సి ఉంది. అయితే కాలేజీలు ఇచ్చిన షెడ్యూల్ ప్రకారం 62 రోజులు తక్కువగా రావడంతో వీటిని ఏవిధంగా భర్తీ చేస్తారంటూ కాలేజీలను సుప్రీం నిలదీసింది. సుమారు గంట పాటు ఈ పిటిషన్పై వాదానలు జరిగాయి. మరో అకాడమిక్ షెడ్యూల్తో ముందుకు రావాలని కాలేజీలను సుప్రీం ఆదేశించింది. తదుపరి విచారణను రేపటి(బుధవారం)కి వాయిదా వేసింది.
రాష్ట్ర విభజన నేపథ్యంలో ఎంసెట్ కౌన్సెలింగ్ నిర్వహణలో రెండు రాష్ట్రాల మధ్య వివాదం చెలరేగిన సంగతి తెలిసిందే. తొలివిడత కౌన్సెలింగ్లో తెలంగాణ ప్రభుత్వం జెఎన్టియు తమకు అనుబంధం కాదన్న సాకుతో అవకాశం కల్పించలేదని ఆరోపిస్తూ తెలంగాణాలోని 174 ప్రయివేట్ కళాశాలల యాజమాన్యాలు సుప్రీంను ఆశ్రయించాయి. తమకు రెండోవిడత కౌన్సెలింగ్లో అవకాశం ఇవ్వాలని డిమాండ్ చేశాయి. గత పదిహేడేళ్లుగా తమకున్న అనుబంధ హోదా ఒక్కసారిగా రద్దుకావటం వెనుక కుట్ర జరిగిందని ఆరోపించారు. ప్రైవేట్ కళాశాలలు దాఖలు చేసిన పిటీషన్పై సోమవారం బెంచి విచారణ చేపట్టింది. తెలంగాణ తరఫున హరీష్ సాల్వే వాదించగా యాజమాన్యాల పక్షాన గోపాల్ సుబ్రహ్మణ్యం వాదించారు.
రెండోవిడత కౌన్సెలింగ్కు అనుమతి ఇవ్వరాదని గతంలోనే మరో బెంచి తీసుకున్న నిర్ణయాన్ని సాల్వే బెంచి దృష్టికి తెచ్చారు. గత పదిహేడేళ్లుగా తమ కళాశాలలకున్న అనుబంధం ఈసారి హఠాత్తుగా ఎలా రద్దయ్యిందో అంతుపట్టటం లేదని యాజమాన్యాల తరఫున వాదించిన గోపాల్ సుబ్రహ్మణ్యం బెంచి దృష్టికి తీసుకొచ్చారు. కాలేజీల్లో ప్రాథమిక సదుపాయాల కల్పన జరిగిందని తెలిపారు. అఖిల భారత సాంకేతిక విద్యామండలి తన ప్రతినిధి వర్గాలను పంపి నిజానిజాలను నిర్థారణ చేసుకోవచ్చని వాదించారు. అఖిల భారత సాంకేతిక విద్యామండలి ప్రతినిధులు రాత పూర్వకంగానే నివేదికలను అందిస్తుందని హారీష్ సాల్వే జోక్యం చేసుకోవటానికి ప్రయత్నించినప్పుడు జస్టిస్ ముఖోపాద్యాయ ఒకింత ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఏఐసిఇటి జోక్యం అవసరం లేదా? అని ప్రశ్నించారు.
నియమనిబంధనల ప్రకారం గతంలో తీసుకున్న నిర్ణయాన్ని తిరిగి పరిశీలించటం జరగదని, కాకపోతే ప్రతి ఒక్కరికీ న్యాయం లభించాలన్న సంకల్పంతోనే రెండోవిడత కౌన్సెలింగ్పై వాదోపవాదాలు వింటున్నట్టు జస్టిస్ ముఖోపాధ్యాయ చెప్పారు. తమకు అన్యాయం జరిగిందని చెబుతున్న కళాశాలలు ప్రాథమిక సదుపాయాలను మెరుగుపరచి తీరాలని బెంచి ఆదేశించింది. తనిఖీలలో తప్పులు బయటపడితే గుర్తింపు రద్దవుతుందని హెచ్చరించింది. గుర్తింపు రద్దయిన పక్షంలో ఆ కళాశాలల విద్యార్థులు న్యాయస్థానాన్ని ఆశ్రయించరాదని షరతు విధించింది. రెండోవిడత కౌన్సెలింగ్లో విద్యార్థుల నుంచి వసూలు చేసే ఫీజును ప్రత్యేక అకౌంట్లో జమ చేయాల్సిందిగా బెంచి ఆదేశించింది.
రెండోవిడత కౌన్సెలింగ్ ఆలస్యంగా ముగిసినప్పటికీ శని, ఆదివారాల్లో తరగతులు నిర్వహించి బోధనా దినాలు పూర్తి చేయవచ్చని న్యాయవాది గోపాల్ సుబ్రహ్మణ్యం బెంచికి వివరించారు. ఇదిలావుంటే, ఇంజనీరింగ్ అడ్మిషన్ల రెండో దశకు సుప్రీంకోర్టు అనుమతి ఇవ్వడంతో అధికారులు షెడ్యూలు రూపొందించారు. ఉన్నతాధికారుల అనుమతి, ఇరు రాష్ట్రాల అనుమతి పొందిన తర్వాత వచ్చే నెల మొదటివారంలో నోటిఫికేషన్ను జారీ చేస్తారు. మరింత విచారణ కోసం కేసును మంగళవారానికి వాయిదా వేసినా, షెడ్యూలు రూపకల్పనకు అనుమతి ఇవ్వడంతో అధికారులు రంగంలోకి దిగారు.
ఉన్నత విద్యామండలి అధికారులు, సాంకేతిక విద్యాశాఖ అధికారులు, అడ్మిషన్ల కమిటీ అధికారులు చర్చించి రెండో దశ కౌన్సెలింగ్కు షెడ్యూలు రూపొందించాలని నిర్ణయించారు. రెండో కౌన్సెలింగ్లో ఎఐసిటిఇ తనిఖీలకు లోబడే ప్రవేశాలు ఉంటాయని సుప్రీంకోర్టు పేర్కొనడంతో ఏయే కాలేజీలను చేర్చాలనే దానిపై జెఎన్టియు హైదరాబాద్ కసరత్తు మొదలు పెట్టింది.