Gali Janardhan Reddy: కడప జిల్లా పర్యటనకు అనుమతి కోరిన మైనింగ్ బ్యారెన్
కడప: గాలి జనార్ధన్ రెడ్డి. రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు కర్ణాటకలో ఈ పేరు గురించి తెలియని వారు దాదాపు ఉండకపోవచ్చు. ఈ మూడు రాష్ట్రాల్లో కూడా రాజకీయంగా పెను ప్రకంపనలు, వివాదాలకు కేంద్రబిందువైన పేరు ఇది. చాలాకాలం తరువాత మరోసారి వార్తల్లోకి ఎక్కారు కర్ణాటక మాజీ మంత్రి, మైనింగ్ బరూన్ గాలి జనార్ధన్ రెడ్డి. ప్రస్తుతం బెంగళూరుకు మాత్రమే పరిమితం అయ్యారు. ఆయన ఇతర ప్రాంతాల్లో పర్యటించడానికి అనుమతి కావాలంటూ దేశ అత్యున్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. తన బెయిల్పై విధించిన ఆంక్షలను కూడా శాశ్వతంగా ఎత్తేయాలని ఆయన విజ్ఙప్తి చేశారు. ఈ మేరకు పిటీషన్ను దాఖలు చేశారు.
బళ్లారి, కడప..
తనకు మంజూరు చేసిన బెయిల్పై విధించిన ఆంక్షలను సడలించాలని కోరుతూ సుప్రీంకోర్టులో పిటీషన్ను దాఖలు చేశారు. కర్ణాటకలోని బళ్లారి సహా కడప జిల్లాల్లో పర్యటించడానికి అనుమతి ఇవ్వాలని ఆయన ఈ పిటీషన్లో పేర్కొన్నారు. తన వ్యాపార కార్యకలాపాలన్నీ బళ్లారి నుంచే కొనసాగుతున్నందున.. వాటిని పర్యవేక్షించడానికి అక్కడికి వెళ్లాల్సి ఉందని అన్నారు. ఈ పిటీషన్పై సుప్రీంకోర్టు సోమవారం విచారణకు స్వీకరించింది. సీబీఐ అధికారులకు నోటీసులను జారీ చేసింది.
ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో..
ఆదాయానికి మించిన ఆస్తులు, ఓబుళాపురం గనుల అక్రమ తవ్వకాల కేసులో ప్రస్తుతం గాలి జనార్ధన్ రెడ్డి బెయిల్పై ఉన్నారు. పలు ఆంక్షలను విధిస్తూ సీబీఐ న్యాయస్థానం ఆయనకు బెయిల్ను మంజూరు చేసింది. ఈ ఆంక్షలను సడలించాలని ఆయన కొద్దిరోజుల కిందటే సుప్రీంకోర్టులో పిటీషన్ దాఖలు చేశారు. దీన్ని ఇద్దరు న్యాయమూర్తుల ధర్మాసనం ఈ మధ్యాహ్నం విచారణకు స్వీకరించింది. అనంతరం జస్టిస్ అరుణ్ మిశ్రా, జస్టిస్ ఇందిరా బెనర్జీలతో కూడిన ఇద్దరు న్యాయమూర్తుల ధర్మాసనం సీబీఐకి నోటీసులను జారీ చేసింది.
పిటీషనర్ కోరిన విధంగా..
పిటీషనర్ కోరిన విధంగా బళ్లారి, కడపజిల్లాల్లో పర్యటించడానికి అనుమతి ఇవ్వడం,, బెయిల్పై ఉన్న ఆంక్షలను శాశ్వతంగా ఎత్తేయడంపై తన వైఖరిని స్పష్టం చేయాలని సుప్రీంకోర్టు ధర్మాసనం సూచించింది. అనంతరం ఈ పిటీషన్పై విచారణను రెండు వారాలకు వాయిదా వేసింది. తదుపరి విచారణ ఎప్పుడనే విషయాన్ని ఇంకా ఖరారు చేయలేదు. ఈలోగా సీబీఐ అధికారులు తమ వైఖరిని స్పష్టం చేస్తూ సుప్రీంకోర్టుకు అఫిడవిట్ను అందజేయాల్సి ఉంటుంది.
రాజకీయంగా ప్రాముఖ్యత..
కర్ణాటకలో భారతీయ జనతా పార్టీ, ఏపీలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో కొనసాగుతున్నాయి. ఈ రెండు పార్టీలు, వాటి అగ్ర నాయకులతో గాలి జనార్ధన్ రెడ్డికి సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. ఓబుళాపురం గనుల కేసు వెలుగులోకి వచ్చిన తరువాత బీజేపీ ఆయనను సస్పెండ్ చేసినప్పటికీ.. పార్టీలో ఆయన హవా నడుస్తోంది. ఆయన రాజకీయాలకు కేంద్రబిందువుగా చెప్పుకొనే బళ్లారి, ప్రతిపాదిత బ్రాహ్మణి స్టీల్స్ ఫ్యాక్టరీకి శంకుస్థాపన చేసిన కడప జిల్లాల్లో పర్యటనకు అనుమతి కోరడం రాజకీయంగా ప్రాధాన్యతను సంతరిచుకుంది.