రాష్ట్రవిభజనపై కేంద్రం, కెసిఆర్లకు సుప్రీంకోర్టు నోటీసులు
న్యూఢిల్లీ: రాష్ట్ర విభజనకు వ్యతిరేకంగా దాఖలైన పిటిషన్పై కేంద్ర ప్రభుత్వం, తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షులు కల్వకుంట్ల చంద్రశేఖర రావులకు భారత అత్యున్నత న్యాయస్థానం సుప్రీం కోర్టు శుక్రవారం నోటీసులు జారీ చేసింది. విభజనను వ్యతిరేకిస్తూ దాఖలు చేసిన పిటిషన్పై ఉదయం సుప్రీంలో విచారణ జరిగింది.
విభజన విధానాన్ని వ్యతిరేకిస్తూ ఇప్పటి వరకు దాఖలైన పిటిషన్లతో పాటు తాజాగా దాఖలైన శర్మ పిటిషన్ను కూడా జత చేయాలని కేంద్ర ప్రభుత్వానికి ఇచ్చిన నోటీసుల్లో సుప్రీం సూచించింది. విభజనపై దాఖలైన అన్ని కేసులను ఒకేసారి విచారిస్తామని న్యాయస్థానం పేర్కొంది. కెసిఆర్ను నాలుగో ప్రతివాదిగా చేర్చింది.
కాగా, విభజనపై దాఖలైన అన్ని పిటిషన్లు ఒకే తరహాలోనే ఉన్నాయని, కాబట్టి అన్నింటినీ కలిపి ఒకేసారి విచారిస్తామని కోర్టు ఈ సందర్భంగా తెలిపి విచారణను వాయిదా వేసింది.
నల్లకోటుతో ఉండవల్లి
బార్ అసోసియేషన్లో గురువారం సభ్యుడిగా నమోదు చేయించుకున్న ఉండవల్లి అరుణ్ కుమార్ శుక్రవారం సుప్రీం కోర్టుకు నల్లకోటుతో వచ్చారు. విభజన వ్యవహారంలో తాను వేసిన పిటిషన్ ను తానే వాదించుకునేందుకు... రెండ్రోజుల క్రితం సుప్రీంకోర్టు బార్ కౌన్సిల్లో ఆయన తన పేరును నమోదు చేయించుకున్నారు.
సుప్రీం విచారణ అనంతరం కోర్టు ఆవరణలో ఉండవల్లి మాట్లాడుతూ... విభజన అన్యాయం అని కోర్టు భావిస్తే సీమాంధ్రులకు న్యాయం జరిగినట్టే అని తెలిపారు. విభజన రాజ్యాంగ విరుద్ధమని, రాబోయే లోకసభలో రాజ్యాంగ సవరణ చేయాల్సి ఉంటుందని, తానిని అందరు కలిసి అడ్డుకోవాలన్నారు.