ఛీఫ్ జస్టిస్కు జగన్ లేఖ కేసు విచారణ- కొత్త ధర్మాసనం, కొత్త తేదీ ఖరారు- మళ్లీ ఉత్కంఠ
సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా జస్టిస్ నూతలపాటి వెంకటరమణ ఏపీ హైకోర్టులో తనకున్న పరపతితో వైసీపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా తీర్పులు ఇప్పిస్తున్నారంటూ సీఎం జగన్ సుప్రీంకోర్టు ఛీఫ్ జస్టిస్కు రాసిన లేఖపై త్వరలో సుప్రీంకోర్టు విచారణ జరగబోతోంది. గతంలో ఈ కేసు విచారణ జరుపుతున్న ముగ్గురు సభ్యుల బెంచ్ నుంచి జస్టిస్ యూయూ లలిత్ తప్పుకోవడంతో విచారణ వాయిదా పడింది. ఇప్పుడు సుప్రీంకోర్టు ఛీఫ్ జస్టిస్ ఈ కేసు విచారణ కోసం కొత్త బెంచ్ను, కొత్త తేదీని ఖరారు చేశారు.
జస్టిస్ రమణకు వ్యతరేకంగా ఛీఫ్ జస్టిస్కు జగన్ రాసిన లేఖ, ఆ తర్వాత ఆయన సలహాదారు అజయ్ కల్లం దాన్ని బయటపెట్టిన నేపథ్యంలో వీరిద్దరిపై కోర్టు ధిక్కార చర్యలు తీసుకోవాలని న్యాయవాదులు మణి, సునీల్ నారాయణ్ సింగ్ రెండు వేర్వేరు పిటిషన్లు దాఖలు చేశారు.
వీటిపై విచారణకు నియమించిన బెంచ్లో ఉన్న జస్టిస్ యూయూ లలిత్.. గతంలో ఈ పిటిషన్లో భాగస్వాములుగా ఉన్న వారి తరఫున వాదించినందున, ఈ కేసు విచారణ నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించారు. దీంతో సుప్రీంకోర్టు ఛీఫ్ జస్టిస్ ఈసారి జస్టిస్ సంజయ్ కిషన్ కౌల్, జస్టిస్ దినేష్ మహేశ్వరి, జస్టిస్ హృషికేష్ రాయ్లతో కూడిన కొత్త ధర్మాసనాన్ని ఏర్పాటు చేశారు.
ముగ్గురు సభ్యుల సుప్రీంకోర్టు ధర్మాసనం జగన్, అజయ్ కల్లంపై దాఖలైన కోర్టు ధిక్కార పిటిషన్లను డిసెంబర్ 1న విచారణ జరపబోతోంది. దీంతో మరోసారి ఏం జరగబోతోందనే ఉత్కంఠ నెలకొంది. సుప్రీంకోర్టు సిట్టింగ్ న్యాయమూర్తిపై ఛీఫ్ జస్టిస్కు లేఖ రాయడం ద్వారా జగన్ అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారని, ఆయన్ను సీఎం పదవి నుంచి తొలగించాలని పిటిషనర్లు కోరుతున్నారు.
దీంతో సుప్రీంకోర్టు ధర్మాసనం తీసుకోబోయే నిర్ణయంపై యావత్ దేశం ఉత్కంఠగా ఎదురుచూస్తోంది. గతంలో ఎన్నడూ ఇలాంటి పరిణామం ( సుప్రీం ఛీఫ్ జస్టిస్కు ముఖ్యమంత్రి లేఖ) చోటు చేసుకోకపోవడంతో ఈ కేసులో సుప్రీం ఆదేశాలు భవిష్యత్ పిటిషన్లకూ మార్గదర్శనం చేయబోతున్నాయి.