ఎపికి ఊరట: సిఆర్డిఎ చట్టంపై పిటిషన్ను కొట్టేసిన సుప్రీం
న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ రాజధాని నిర్మాణానికి సంబంధించి సీఆర్డీఏ చట్టం రాజ్యాంగ విరుద్ధమంటూ దాఖలైన పిటిషన్ను సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. దీంతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ఊరట లభించింది. ఈ పిటిషన్ను సోమవారం ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ హెచ్ఎల్ దత్తు, జస్టిస్ అమితవ రాయ్లతో కూడిన ధర్మాసనం విచారించింది.
పిటిషన్ విచారణకు వచ్చిన వెంటనే దాన్ని పరిశీలించిన జస్టిస్ దత్తు - హైకోర్టుకు వెళ్లాలని సూచించారు. తమ కంటే ఎక్కువ అధికారాలు హైకోర్టుకు ఉంటాయని వ్యాఖ్యానించారు. దీంతో పిటిషనర్ తరఫు న్యాయవాది అనిల్ కుమార్ ఝా కల్పించుకొని వాదనలు వినడానికి సమయమివ్వాలని కోరగా, ధర్మాసనం అనుమతించింది. దాదాపు 20 నిమిషాల పాటు న్యాయవాది వాదనలు వినిపించారు.
రాజధాని ప్రాంత అభివృద్ధి ప్రాధికార సంస్థ (సిఆర్డిఎ)ను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎపి పునర్వ్యస్థీకరణ చట్టం నిబంధనలకు విరుద్ధంగా ఏర్పాటు చేసిందంటూ పిటిషన్ దాఖలైంది. రాష్ట్ర రాజధాని నిర్మాణంపై కేంద్ర ప్రభుత్వం పునర్వ్యస్థీకరణ చట్టంలో విధివిధానాలను రూపొందించిందని, శివరామకృష్ణన్ కమిటీ ఇచ్చిన నివేదికను ప్రామాణికంగా తీసుకోకుండా దాన్ని పక్కన పెట్టి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఓ కమిటీని ఏర్పాటు చేసి భూసేకరమ చేసిందని, ఇది రాజ్యాం విరుద్ధమేనని మాజీ ఐఎఎస్ అధికారి దైవసహాయం సుప్రీంకోర్టును ఆశ్రయించారు.
ఆయన పిటిషన్పై సోమవారం సుప్రీంకోర్టు ధర్మాసనం విచారణ చేపట్టింది. రాజ్యాంగంలోని 3,4 అధికరణలను ఎపి ప్రభుత్వం అతిక్రమించిందని పిటిషనర్ తరఫు న్యాయవాది అనిల్ కుమార్ వాదించారు.
ఆంధ్రప్రదేశ్ నూతన రాజధాని నిర్మాణానికి సంబంధించి భూసమీకరణ విధానాన్ని వ్యతిరేకిస్తూ దాఖలైన వ్యాజ్యాన్ని సుప్రీంకోర్టు కొట్టేయడం శుభపరిణామమని పురపాలక శాఖ మంత్రి నారాయణ అన్నారు. రాజధాని నిర్మాణానికి అందరూ సహకరించాలని ఆయన సోమవారం సాయంత్రం మీడియా సమావేశంలో విజ్ఢప్తి చేశారు. సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలోనైనా ఇక ముందు ఎవరూ భూసేకరణపై న్యాయస్థానాలకు వెళ్లవద్దని ఆయన సూచించారు.