పంచుకుంటే వివాదమేది: ఎపి, టీ కృష్ణానీటి వివాదంపై సుప్రీం
న్యూఢిల్లీ: కృష్ణానది జలాల్లో ఉమ్మడి రాష్ట్రానికి లభించిన నీటిని కొత్తగా ఏర్పడ్డ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ పంచుకుంటే వివాదానికి తావుండదని సుప్రీంకోర్టు ధర్మాసనం అభిప్రాయపడింది. కృష్ణా ట్రిబ్యునల్ నీటి పంపిణీ వివాదంపై పిటిషనర్లు, ప్రతివాదులైన ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, మహారాష్ట్రలు మూడు వారాల్లోగా తమ వాదనల్ని మూడు పేజీలకు మించకుండా దాఖలు చేయాలని, తదుపరి విచారణ ఏప్రిల్ 29వ తేదీన జరుపుతామని తెలిపింది.
జస్టిస్ బ్రిజేష్కుమార్ నేతృత్వంలోని కృష్ణానదీ జల వివాదాల పరిష్కార ట్రిబ్యునల్ 2010 డిసెంబర్లో ఇచ్చిన తీర్పు వల్ల తమకు అన్యాయం జరిగిందని, అది పరిష్కారమయ్యే వరకూ తీర్పును భారత ప్రభుత్వ గెజిట్లో ప్రచురించరాదని, అమలు చేయరాదని సమైక్య ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఈ క్రమంలో తెలంగాణ ఏర్పడడంతో ఆ రాష్ట్ర ప్రభుత్వం సైతం కృష్ణానది ట్రిబ్యునల్లో తమకు అన్యాయం జరిగిందని, తమ వాదనలు కూడా వినాలని, లేదంటే మరో ట్రిబ్యునల్ను ఏర్పాటు చేయాలని కోరుతూ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది.
అయితే, ట్రిబ్యునల్ తీర్పును తక్షణం గెజిట్లో ప్రచురించి, అమలు చేయాలంటూ కర్ణాటక, మహారాష్ట్రలు కూడా సుప్రీంను ఆశ్రయించాయి. ఈ నేపథ్యంలో ఆయా పిటిషన్లు అన్నీ శుక్రవారం న్యాయమూర్తులు జస్టిస్ దీపక్ మిశ్రా, జస్టిస్ ప్రఫుల్ల సి పంత్లతో కూడిన ధర్మాసనం ముందు విచారణకు వచ్చాయి. కేసు పూర్వాపరాలను జస్టిస్ దీపక్ మిశ్రా ఆరా తీశారు. మహారాష్ట్ర తరఫు సీనియర్ న్యాయవాది అంద్యార్జున వాటిని వివరించారు. రాజ్యాంగ నిబంధనల ప్రకారం ట్రిబ్యునల్ తీర్పునకు అంతా కట్టుబడి ఉండాల్సిందేనని, దాన్ని సవాల్ చేయరాదని చెప్పారు.
కొత్తగా ఏర్పడ్డ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల మధ్య వివాదాన్ని పరిష్కరించేందుకు ట్రిబ్యునల్ కొన్ని నియమనిబంధనల్ని తయారు చేస్తే సరిపోతుందని, ఆ రెండు రాషా్ట్రల వివాదాన్ని పరిష్కరించాలని, ఈ లోపు తీర్పును అమలు చేయాలని కోరారు. కాగా, కృష్ణానది ట్రిబ్యునల్ తీర్పును తాము చూడలేదని, ఇందులో ఎక్కువగా ఎవరు ప్రభావితమయ్యారని జస్టిస్ మిశ్రా ప్రశ్నించారు. నాలుగు రాష్ట్రాల న్యాయవాదులూ స్పందిస్తూ.. తామంటే తాము ఎక్కువ నష్టపోయామని చెప్పారు. ఇలాంటి వివాదం ఎస్ఎల్పీ (స్పెషల్ లీవ్ పిటిషన్) ద్వారా ఎలా పరిష్కారమవుతుంది? అని జస్టిస్ మిశ్రా ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ఈ ట్రిబ్యునల్ పరిధిలో ఎన్ని నదులు ఉన్నాయి? అని జస్టిస్ మిశ్రా అడగ్గా... కృష్ణానది ఒక్కటేనని, దీనిపైన కూడా ట్రిబ్యునల్ తీర్పు ఇచ్చేసిందని కర్ణాటక తరఫు సీనియర్ న్యాయవాది ఫాలీ నారిమన్ చెప్పారు.
ఈ సమస్య పరిధులు దాటి ప్రయాణించరాదని, ఇది ఒక ఆస్తి తగాదా కారాదని అభిప్రాయపడ్డారు. ఇలాంటి వివాదాలను అంతం లేకుండా కొనసాగించరాదని, వీలైనంత త్వరగా పరిష్కరించాల్ని ఉందని చెప్పారు. వీటిని పరిష్కరించటం కోర్టుల రాజ్యాంగ బాధ్యత అని తెలిపారు. ఆంధ్రప్రదేశ్ తరఫున సీనియర్ న్యాయవాది ఏకే గంగూలీ, ప్రభుత్వ న్యాయవాది గుంటూరు ప్రభాకర్ విచారణకు హాజరయ్యారు.