విష్ణుమూర్తి ఫోటో కేసు: సుప్రీం కోర్టులో ధోనీకి ఊరట, ఏపీ పోలీస్కు ప్రశ్న
ఢిల్లీ/అనంతపురం: భారత్ ట్వంటీ 20, వన్డే కెప్టేన్ మహేంద్ర సింగ్ ధోనీకి సుప్రీం కోర్టులో శుక్రవారం నాడు ఊరట లభించింది. 'విష్ణుమూర్తి అవతారంలో ధోనీ' ప్రకటన అనంతపురం కోర్టులో ఉన్న విషయం తెలిసిందే. దీనిపై ధోనీ సుప్రీం కోర్టుకు వెళ్లారు.
ఈ కేసును అనంతపురం నుంచి బెంగళూరు కోర్టుకు తరలించాలని ధోనీ సుప్రీం కోర్టుకు విజ్ఞప్తి చేశారు. ఈ విజ్ఞప్తి పైన అభిప్రాయం తెలపాలని ఏపీ పోలీసులను అత్యున్నత న్యాయస్థానం ఆదేశించింది.
ధోనీ పైన అనంతపురం జిల్లాలో కేసు నమోదయిన విషయం తెలిసిందే. ఓ వార పత్రికలో ధోనీని విష్ణుమూర్తి అవతారంలో చూపించారని ఆరోపిస్తూ విశ్వ హిందూ పరిషత్ నేత శ్యాంసుందర్ ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు మేరకు పోలీసులు కేసును నమోదు చేసుకున్నారు. ధోనీతో పాటు పత్రిక ఎడిటర్ పైన కూడా కేసు నమోదయింది.
విష్ణు అవతారంలో ధోనీని చిత్రించి హిందువుల మనోభావాలను దెబ్బ తీశాడనే, దేవతలను అవమానించారని శ్యాంసుందర్ తన పిటిషన్లో పేర్కొన్నారు. బిజినెస్ టుడే పత్రికలో ధోనీని విష్ణుమూర్తిగా చూపిస్తూ ప్రకటన ఇచ్చారు. ఈ విషయమై గతంలోను అనంతపురం జిల్లా కోర్టు ధోనీకి నోటీసులు జారీ చేసింది.
నవంబర్ 7వ తేదీన వ్యక్తిగతంగా కోర్టుకు హాజరు కావాలని కోర్టు తొలుత ఆదేశాలు జారీ చేసింది. హాజరు కాకపోవడంతో నోటీసులు జారీ చేసింది.
గతంలో నోటీసులు పంపించినా కోర్టుకు హాజరుకాకపోవడంపై న్యాయస్థానం అప్పుడు ధోనీ పైన ఆగ్రహం వ్యక్తం చేసింది. జనవరి 8న నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది. ఆ తర్వాత కొద్ది రోజుల క్రితం అనంతపు కోర్టు ధోనీ పైన జారీ చేసిన నాన్ బెయిలబుల్ వారెంట్ను కోర్టు రద్దు చేసింది.