ఛీఫ్ జస్టిస్కు జగన్ లేఖ వ్యవహారం- నేడు సుప్రీంకోర్టు ముందుకు పిటిషన్లు.. సర్వత్రా ఉత్కంఠ
సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీరమణ, ఏపీ హైకోర్టులోని మరికొందరు న్యాయమూర్తులతో కలిసి తన ప్రభుత్వానికి వ్యతిరేకంగా పనిచేస్తున్నారంటూ సీఎం జగన్ ఛీఫ్ జస్టిస్ బాబ్డేకు రాసిన లేఖ కలకలం రేపుతూనే ఉంది. లేఖ రాయడం ఓ ఎత్తయితే దాన్ని బహిర్గతం చేయడం మరో ఎత్తుగా మారింది. దీంతో జగన్ను ఈ రెండు వ్యవహారాల్లో దోషిగా నిర్దారిస్తూ పదవి నుంచి తొలగించాలంటూ సుప్రీంకోర్టులో పలు పిటిషన్లు దాఖలయ్యాయి.
Recommended Video
సుప్రీంకోర్టు ఛీఫ్ జస్టిస్కు జగన్ రాసిన లేఖను కోర్టు ధిక్కరణగా పరిగణిస్తూ ఆయన్ను పదవి నుంచి తొలగించాలని జీఎస్ మణి, ఏఎన్నార్ దాఖలు చేసిన ప్రజాప్రయోజన వాజ్యం ఇవాళ విచారణకు రాబోతోంది. సుప్రీంకోర్టులోని మూడు నంబర్ కోర్టులో జస్టిస్ యూయూ లలిత్, జస్టిస్ వినీత్ శరణ్, జస్టిస్ రవీంద్ర భట్తో కూడిన త్రిసభ్య ధర్మాసనం దీన్ని విచారించబోతోంది. ఇందులో వీరు సుప్రీం ఛీఫ్ జస్టిస్కు రాసిన లేఖను సీరియస్గా పరిగణిస్తూ జగన్ను పదవి నుంచి తప్పించేలా కేంద్రానికి ఆదేశాలు ఇవ్వాలని పిటిషన్లో కోరారు. దీంతో పిటిషన్లో కేంద్రాన్ని ప్రతివాదిగా చేర్చారు. దీంతో పాటు లాయర్లు సునీల్ నారాయణ్సింగ్, అశ్వినీ ఉపాధ్యాయ దాఖలు చేసిన పిటిషన్లపైనా సుప్రీంకోర్టు విచారణ జరుపుతుందా లేక ఈ పిల్ ఒక్కటే విచారిస్తుందా చూడాల్సి ఉంది.
మరోవైపు వైసీపీ తరఫున గెలిచి ఆ పార్టీపై నిత్యం విమర్శలకు దిగుతున్న ఎంపీ రఘురామకృష్ణంరాజు తాజాగా ఈ పిటిషన్లపై సుప్రీంకోర్టు నుంచి తీవ్రమైన ఆదేశాలు వచ్చే అవకాశముందని వెల్లడించారు. సీఎం జగన్కు కోర్టు ధిక్కరణ నోటీసులు జారీ కావడం ఖాయమని, ఆయన పదవి కోల్పోయే అవకాశం ఉందని రఘురామ చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో తాజా పిటిషన్లపై సుప్రీంకోర్ట్టు విచారణ ప్రాధాన్యం సంతరించుకుంది. ఆయా పిటిషన్లపై సుప్రీంకోర్టు ఎలాంటి ఉత్తర్వులు ఇవ్వబోతోందన్న ఉత్కంఠ రాష్ట్రంలోని రాజకీయ పార్టీల్లోనూ నెలకొంది.