జగన్ సర్కారుకు సుప్రీంలో మరో షాక్- పురుషోత్తపట్నం లిఫ్ట్ పిటిషన్ కొట్టివేత
ఏపీలో తూర్పుగోదావరి జిల్లాలో గోదావరి నదిపై నిర్మించ తలపెట్టిన పురుషోత్తపట్నం ఎత్తిపోతల పథకం విషయంలో జగన్ సర్కార్కు సుప్రీంకోర్టులో భారీ ఎదురుదెబ్బ తగిలింది. పర్యావరణ అనుమతుల్లేకుండా ఈ ప్రాజెక్టును నిర్మించడాన్ని సుప్రీంకోర్టు తప్పుపట్టింది. దీనిపై గతంలో జాతీయ హరిత ట్రైబ్యునల్ ఇచ్చిన ఆదేశాలను సుప్రీంకోర్టు సమర్ధించింది.
పురుషోత్తపట్నం లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు నిర్మాణం ద్వారా తూర్పుగోదావరి జిల్లాల్లో పంట పొలాలకు సాగునీరు అందించేందుకు ప్రభుత్వం డీపీఆర్ సిద్ధం చేసింది. అయితే ఇందుకు పర్యావరణ అనుమతులు మాత్రం తీసుకోలేదు. దీనిపై దాఖలైన పిటిషన్ను గతంలో విచారించిన జాతీయ హరిత ట్రైబ్యునల్ పర్యావరణ అనుమతులు తీసుకోకుండా ప్రాజెక్టు నిర్మించకూడదని ప్రభుత్వానికి ఆదేశాలు ఇచ్చింది. అయితే వీటిపై అసంతృప్తి వ్యక్తం చేసిన ప్రభుత్వం.. వీటిపై సుప్రీంకోర్టును ఆశ్రయించింది.
పురుషోత్త పట్నం ఎత్తిపోతల పథకంపై ఏపీ సర్కార్ దాఖలు చేసిన పిటిషన్ను విచారించిన సుప్రీంకోర్టు.. దీనికి పర్యావరణ అనుమతులు తప్పనిసరి అని స్పష్టం చేసింది. ఈ విషయంలో గతంలో జాతీయ హరిత ట్రైబ్యునల్ ఇచ్చిన ఉత్తర్వులను సుప్రీంకోర్టు సమర్ధించింది. పురుషోత్తపట్నం విషయంలో ఎన్జీటీ అన్ని అంశాలను పరిగణనలోకి తీసుకునే ఆదేశాలు ఇచ్చిందని సుప్రీంకోర్టు ఏపీ ప్రభుత్వానికి గుర్తు చేసింది. దీంతో ఈ ప్రాజెక్టుకు తప్పనిసరిగా పర్యావరణ అనుమతులు తీసుకోవాల్సిన అవసరం ఏర్పడింది.