చంద్రబాబుచే ప్రారంభం: 40 స్కానియా బస్సులకు 'అమరావతి' పేరు..!
విజయవాడ: నవ్యాంధ్ర నూతన రాజధాని పేరు మారుమోగేలా చేసేందుకు ఏపీఎస్ఆర్టీసీ ఒక అడుగు ముందుకేసింది. ఇందులో భాగంగా విజయవాడ బస్ డిపో నుంచి నడిచే స్కానియా హైఎండ్ బస్సులకు అమరావతి పేరు పెట్టాలని ఆర్టీసీ నిర్ణయం తీసుకుంది.
విజయవాడ బస్ డిపోకు కేటాయించిన 40 అత్యాధునిక 'స్కానియా' బస్సులకు అమరావతి అనే పేరుని పెట్టారు. స్వీడన్ దేశానికి చెందిన ఈ బస్సులను అర్టీసీ కొనుగోలు చేసేందుకు రెండు నెలల కిందట నిర్ణయించింది. కొనుగోలు ఆర్డర్ ఇచ్చిన తర్వాత ఒక్కొక్కటిగా స్కానియా బస్సులు విజయవాడ ఆర్టీసీ డిపోకు చేరుకున్నాయి.
ఇప్పటికే అరడజను స్కానియా బస్సులు విజయవాడ డిపో గ్యారేజీలో పార్కింగ్ చేసి ఉన్నాయి. మరికొన్ని రోజుల్లో మిగతా బస్సులు కూడా రానున్నాయి. అయితే వీటన్నింటిని ఒకేరోజు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుచే ప్రారంభించడానికి ఆర్టీసీ సన్నాహాలు చేస్తున్నారు.
రాష్ట్ర విభజన అనంతరం విజయవాడలోనే ఆర్టీసీ హౌస్ పేరిట ఏపీఎస్ఆర్టీసీ తన కార్యకలాపాలను కొనసాగిస్తోంది. రాజధాని నిర్మాణం సాగేవరకు అమరావతి పేరును ఆర్టీసీ బస్సులకు పెట్టాలని ఆర్టీసీ నిర్ణయించింది. కాగా, ఈ స్కానియా బస్సులను హైదరాబాద్, బెంగళూరు, చెన్నై వంటి పొరుగు రాష్ర్టాల రాజధానులకు నడపనున్నారు.