ఎవరి లెక్కలు వారివి: 2019 ఎన్నికలకు జగన్-పవన్ కళ్యణ్లది ఒక్కటే లెక్క!
Recommended Video
అమరావతి: 2019 సార్వత్రిక ఎన్నికలపై వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ఏపీ ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డి, జనసేన అధినేత పవన్ కళ్యాణ్లు ఒకేరకంగా ఆలోచిస్తున్నారా? కేవలం ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు మాత్రమే భిన్నంగా ఆలోచిస్తున్నారా? అంటే అవుననే అంటున్నారు.
ఫలించని బుజ్జగింపు, జగన్కు రాజీనామా పంపిన ఆదిశేషగిరిరావు: ఆయన ద్వారా టీడీపీలోకి
2014 ఎన్నికల నాటి పరిస్థితులకు, ఇప్పుడు జరగబోయే లోకసభ, అసెంబ్లీ ఎన్నికల నాటి రాజకీయ పరిస్థితులు పూర్తి భిన్నమని జనసేన, వైసీపీలు లెక్కలు వేసుకుంటున్నాయి. టీడీపీ మాత్రం తాము చేసిన అభివృద్ధి పనులు తమను గెలిపిస్తాయని చెబుతున్నాయి.
ఒంటరిగా పోటీ చేసినా గెలుస్తామనే ధీమా
2014లో పవన్ కళ్యాణ్ వల్లే తాము గెలిచామనడంలో వాస్తవం లేదని టీడీపీ నేతలు అభిప్రాయపడుతున్నారు. గెలిచిన కొత్తలో జనసేనాని సహకారాన్ని కూడా వారు ప్రశంసించారు. ఇటీవల క్రమంగా ఆయన దూరం కావడంతో వారు కూడా యూటర్న్ తీసుకున్నారు. చంద్రబాబుపై నమ్మకం గెలిపించిందని చెబుతున్నారు. 2014లో ఎలా పోటీ చేసినా, వచ్చే ఎన్నికల్లో మాత్రం ప్రజలు తమ వైపే మొగ్గు చూపుతారని, చంద్రబాబు చేసిన అభివృద్ధి పనులే తమను గెలిపిస్తాయని టీడీపీ నేతలు అంటున్నారు. 2014లో పొత్తు పెట్టుకొని గెలిచినా ఇప్పుడు ఒంటరిగా గెలుస్తామని, అభివృద్ధి అంతా మార్చివేస్తుందని అంటున్నారు.
కాంగ్రెస్ పార్టీ జతకలిస్తే మరింత ప్లస్
అయితే, కాంగ్రెస్ పార్టీతో జతకట్టడం తమకు మరికొంత కలిసి వస్తుందని టీడీపీ నేతలు చెబుతున్నారు. తాము కేంద్రంలో అధికారంలోకి వస్తే ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తామని ఏఐసీసీ అధ్యక్షులు రాహుల్ గాంధీ ప్రకటించారు. బీజేపీ హోదా ఇస్తానని మాట తప్పిందని, కాంగ్రెస్ ఇస్తానని చెబుతోందని, కాబట్టి ఆ పార్టీతో జతకట్టడం మరికొంత కలిసి వస్తుందని అంటున్నారు.
ఇదీ జగన్ లెక్క
2014 అసెంబ్లీ ఎన్నికల్లో తెలుగుదేశం, జనసేన పార్టీలు కలిసి పోటీ చేశాయని, ఈ ఎన్నికల్లో వారు వేర్వేరుగా పోటీ చేస్తే అప్పుడు వారికి వేసిన ఓట్లు చీలిపోతాయని వైయస్ జగన్ లెక్కలు వేసుకుంటున్నారు. ఒకవేళ వారు కలిసి పోటీ చేసినా తమకు సంతోషమేనని, చంద్రబాబు ప్రభుత్వం పైన వ్యతిరేకత ఉందని, అప్పుడు ప్రభుత్వ వ్యతిరేక ఓటు మొత్తం తమకే పడుతుందని చెబుతున్నారు.
మారిపోతోందని పవన్, జగన్, అదే దారిలో చంద్రబాబు
ఇక, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా 2014కు 2019 సినారియోకు తేడా ఉంటుందని చెబుతున్నారు. చంద్రబాబు ప్రభుత్వంపై వ్యతిరేకత ఉందని, అలాగే, వైసీపీ కూడా ప్రతిపక్షంగా సరిగా వ్యవహరించలేదని ప్రజలు భావిస్తున్నారని, కాబట్టి జనసేన వైపు ప్రజలు చూస్తున్నారని పవన్ కళ్యాణ్ అంటున్నారు. మొత్తంగా 2014లో మూడు పార్టీలు కలిసినందువల్ల చంద్రబాబు గెలిచారని, ఇప్పుడు పరిస్థితి మారుతుందని జగన్ చెబుతుండగా, అప్పుడు తాము మద్దతిచ్చామని అందుకే టీడీపీ గెలిచిందని, ఇప్పుడు నాటి పరిస్థితి ఉండదని పవన్ చెబుతుండగా, ఎవరు అండగా లేకున్నా 2014 కంటే మంచి మెజార్టీతో గెలుస్తామని టీడీపీ చెబుతోంది. పవన్, జగన్లు నాటి పరిస్థితులు ఉండవని చెబుతుండగా, నాటి కంటే భారీ విజయం ఉంటుందని టీడీపీ అంటోంది.