ఈనెల 28న ఎన్నికల షెడ్యూల్: మార్చి నెలాఖరులో ఏపి ఎన్నికలు : మే లో కౌంటింగ్..!
ఏపిలో అసెంబ్లీ .. లోక్సభ ఎన్నికల షెడ్యూల్ కు దాదాపు ముహూర్తం ఖరారైంది. ఈ నెల 28న సార్వత్రిక ఎన్నికల షె డ్యూల్ విడుదల అయ్యే అవకాశం ఉందని విశ్వసనీయ సమాచారం. మార్చి మొదటి వారంలో నోటీఫికేషన్ విడుదల చేసిన తొలి విడతలోనే ఏపిలో ఎన్నికలు నిర్వహించే అవకాశం కనిపిస్తోంది. మే తొలి వారిలోనే ఎన్నికల ఫలితాలను విడుదల చేయనున్నట్లు సమాచారం.
ఈ నెల 28న షెడ్యూల్..!
2019 సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్ ఈ నెల 28న వెలువడే అవకాశం ఉంది. ఈ మేరకు కేంద్ర ఎన్నికల సంఘం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. ఎన్నికలకు సిద్ధంగా ఉన్నామంటూ.. రాష్ట్రాల ప్రధాన ఎన్నికల అధికారులందరూ సీఈసీకి నివేదికలు సమర్పించారు. ఎన్నికలకు అవసరమైన పారా మిలటరీ బలగాలను తరలించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తిచేశామని కేంద్ర హోంమంత్రిత్వ శాఖ కూడా ఇటీవలే సీఈసీకి నివేదించింది. క్రితంసారిలాగా కాకుండా ఈసారి 5 దశల్లోనే మొత్తం ఎన్నికల ప్రక్రియ పూర్తి చేయాలనే సంకల్పంతో కేంద్ర ఎన్నికల సంఘం ప్రయత్నాలు ముమ్మరం చేసింది. దీన్ని దృష్టిలో ఉంచుకునే షెడ్యూల్ను ఖరారు చేస్తోంది. అన్నీ అనుకున్నట్లుగా జరిగితే ఈ నెల 28న షెడ్యూల్ ఖరారు చేసే అవకాశం ఉందని విశ్వసనీయ వర్గాల సమాచారం. ఏపి ప్రభుత్వం అంచనా మేరకు ఏప్రిల్ మార్చి చివర్లో..లేదా ఏప్రిట్ మొదటి వారంలో రాష్ట్రంలో ఎన్నికలు ఉంటాయని భావిస్తున్నారు.
మార్చి నెలాఖరులో పోలింగ్..
ఏపిలో రాజకీయ పార్టీలు అంచనా వేస్తున్నట్లుగా ఈ నెల 28న షెడ్యూల్ విడుదలైతే.. మొదటిదశ ఎన్నికలకు నోటిఫికే షన్ మార్చి 3న వెలువడనుంది. మొదటిదశ ఎన్నికలకు మార్చి నాలుగో వారంలో ఎన్నిక జరగనుంది. మొత్తం ఐదు దశల్లో, 55 రోజుల్లో పూర్తి చేసే విధంగా ఈసీ కసరత్తు పూర్తి చేసింది. ఈ లెక్కన ఐదు దశల పోలింగ్ ఏప్రిల్ చివరి వరకు పూర్తి చేస్తారు. లోక్సభ ఎన్నికలతో పాటే ఆంధ్రప్రదేశ్, ఒడిశా శాసనసభలకు ఎన్నికలు నిర్వహించనున్నది. దీంతో.. ఏపిలో మార్చి నెలాఖరు లేదా ఏప్రిల్ మొదటి వారంలోనే ఎన్నికలు జరిగే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. దీని కోసమే అన్ని రకాలుగా ప్రభుత్వ పరమైన విధాన పర నిర్ణయాలను ఇప్పటికే ప్రకటించారు.
మే మొదటి వారంలో కౌంటింగ్..
ఎన్నికల షెడ్యూల్ లో చివరిదైన కీలకైమన కౌంటింగ్ ప్రక్రియ మే మొదటి వారంలో ఉండే అవకాశం కనిపిస్తోంది. ఈ సారి ఏపిలో అసెంబ్లీ ఎన్నికలతో పాటుగా లోక్సభ ఎన్నికలు సైతం జరగనున్నాయి. మొత్తం 175 అసెంబ్లీ..25 లోక్ సభ స్థానాలకు ఒకే విడతలో ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికలకు సంబంధించి కౌంటింగ్ ప్రక్రియ మే మొదటి వారంలో చేపట్టనున్నారు. 2014 ఎన్నికల్లో మే 26 న కౌంటింగ్ ప్రక్రియ జరిగింది. దీంతో..ఏపిలో ప్రధాన రాజకీయ పార్టీ లు ఇప్పటికే ఎన్నికలకు తుది కసరత్తు పూర్తి చేసి..బరిలో దిగేందుకు సిద్దమవుతున్నారు.