స్కూలు బస్సు బీభత్సం: బ్రేక్ బదులు యాక్సిలరేటర్ తొక్కేశాడు.. నిఘా కెమేరాలు చెప్పిన నిజాలు
శ్రీప్రకాశ్ విద్యా సంస్థకు చెందిన పాఠశాల బస్సు ప్రమాదానికి.. బస్సు డైవర్ నిర్లక్ష్యం, పొరపాటే ప్రధాన కారణమని పోలీసుల దర్యాప్తులో తేలింది.
విశాఖపట్నం: నగరంలోని సాగరతీరంలో శ్రీప్రకాశ్ విద్యా సంస్థకు చెందిన పాఠశాల బస్సు ఆదివారం రాత్రి బీభత్సం సృష్టించడానికి బస్సు డైవర్ నిర్లక్ష్యం, పొరపాటే ప్రధాన కారణమని పోలీసులదర్యాప్తులో తేలింది.
ఈ ప్రమాదం తరువాత డ్రైవర్ కృష్ణ షాక్లోకి వెళ్లిపోవడం, మరోవైపు చికిత్స పొందుతుండడంతో పోలీసులు సోమవారం అతడిని పూర్తిస్థాయిలో విచారించలేకపోయారు. మంగళవారానికి కాస్త కోలుకోవడంతో మహారాణిపేట సి.ఐ. వెంకటనారాయణ ఆధ్వర్యంలో పోలీసులు డ్రైవర్ను విచారించారు.
బ్రేక్ కు బదులు...
తాను బస్సును స్టార్ట్ చేశానని, అయితే బ్రేక్కు బదులు యాక్సిలేటర్ను గట్టిగా తొక్కడంతో క్షణాల్లో బస్సు తీవ్రమైన వేగంతో ముందుకు దూసుకుపోయిందని డ్రైవర్ కృష్ణ చెప్పినట్లు వారు పేర్కొన్నారు. డ్రైవర్ చర్యతో అసలే రహదారి బాగా వాలుగా ఉండడంతో బ్రేక్ వేసేలోపే పెను ప్రమాదం సంభవించింది.
అనుభవం ఉన్నప్పటికీ...
డ్రైవర్ కృష్ణ వాస్తవానికి మంచి అనుభవం వున్న వ్యక్తే. 40 సీట్ల బస్సును సుమారు ఏడేళ్ల నుంచి నడుపుతున్నాడు. ఆదివారం ప్రమాదానికి గురైన బస్సు 18 సీట్ల సామర్థ్యం ఉన్న చిన్న బస్సే. కానీ ఎందుకో ఆ క్షణంలో అతడు ఒకింత గందరగోళానికి గురవడంతో ఘోరప్రమాదం చోటుచేసుకుంది.
నిఘా కెమెరాలు చెప్పిన నిజాలు..
ఆ ప్రమాద దృశ్యాలు సమీపంలో ఉన్న నిఘా కెమేరాల నుంచి పోలీసులు సేకరించి విశ్లేషించారు. బస్సు అత్యంత వేగంగా జనాలమీదకు దూసుకుపోవడం ఆయా దృశ్యాల్లో స్పష్టంగా కనిపించింది.ప్రమాదం జరిగిన సమయంలో బీచ్ రోడ్డులో సుమారు పదిమంది వ్యక్తులు రోడ్డు దాటుతుండగా మొదట బస్సు వారిపైకి దూసుకుపోయింది.
వాళ్లకి భూమ్మీద నూకలుండి...
ప్రమాదాన్ని గ్రహించి వారు పక్కకు పరుగులు తీశారు. అయితే ఆ లోపే బస్సు వారిని ఢీకొట్టింది. బస్సు పక్కభాగం తగలడంతో వారు రోడ్డుపై పడిపోయినప్పటికీ తృటిలో ప్రాణాపాయం నుంచి తప్పించుకోగలిగారు. లేదంటే మరో పదిమంది ప్రాణాలు గాల్లో కలిసిపోయేవని ఆయా నిఘా కెమేరాల వీడియో దృశ్యాలు చూస్తే ఇట్టే అర్థం అవుతుంది.
మద్యం సేవించాడా?
పోలీసులు తమ దర్యాప్తులో భాగంగా డ్రైవర్ మద్యం తాగాడేమోనన్న ఉద్దేశంతో డ్రైవర్ నుంచి నమూనాలను సేకరించారు. వాటిని ఎఫ్.ఎస్.ఎల్.కు పంపి ఆయా శాంపిళ్లను విచారిస్తే మద్యం తాగుంటే తెలుస్తుందన్నారు.
అధికారుల నివేదిక మరోలా....
రవాణాశాఖ అధికారులు బస్సును పరిశీలించి ఇచ్చిన నివేదిక పోలీసుల దర్యాప్తులో వెలుగుచూసిన కొన్ని అంశాలతో విభేదిస్తుండడం గమనార్హం. సాగర తీరంలో బస్సు ప్రమాదానికి డ్రైవర్ పొరపాటు,నిర్లక్ష్యమే ప్రధాన కారణమని... బ్రేక్ బదులు యాక్సిలేటర్ తొక్కినట్లు డ్రైవర్ అంగీకరించాడని మహారాణిపేట సి.ఐ. వెంకటనారాయణ చెబుతుండగా, రవాణా శాఖ అధికారులేమో అసలు డ్రైవర్ బస్సును స్టార్ట్ చేసిన దాఖలాలు లేవని అంటున్నారు. డ్రైవర్ కృష్ణ మాత్రం ప్రమాదం సమయంలో తాను బస్సు ఇంజన్ ఆఫ్ చేశానని చెబుతున్నాడు.