కీచకుడు: మహిళా టీచర్లను చూస్తే పిచ్చెక్కిపోతున్న హెడ్మాస్టర్
పిల్లలకు పాఠాలు చెప్పాల్సిన హెడ్మాస్టర్ పక్కదారి పట్టాడు. మహిళ పీఈటీపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. అతడి లైంగిక వేధింపులతో విసిగిపోయిన బాధితురాలు శుక్రవారం ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసింది. దీనికి సంబంధించి బాధిత పీఈటీ టీచర్ మీడియాకు వివరించిన వివరాలిలా ఉన్నాయి.
కృష్ణా జిల్లా చాట్రాయి మండలం చనుబండ ప్రభుత్వ ఉన్నత పాఠశాల హెడ్మాస్టర్ పి.రఘురామ్ గడిచిన ఏడాదిన్నర కాలంగా తనను వేధిస్తున్నారని పీఈటీ లక్ష్మి పేర్కొన్నారు. ఈ మేరకు గతంలో సహచరులైన పీఈటీలకు తెలపగా వారు మాట్లాడి ఇకపై జరగకుండా చూస్తామన్నారన్నారు.
అయితే మళ్లీ ఈ మధ్య కాలంలో చెప్పడానికి వీలుకాని రీతిలో అసభ్య పదజాలంతో ఆమెను హింసించడం మొదలు పెట్టాడన్నారు. తోటి ఉపాధ్యాయులతో మాట్లాడితే వివాహేతర సంబంధాలను సైతం అంటగడుతున్నారని, తన గదిలో కూర్చుని పని చేయాలని కోరుతున్నట్లు లక్ష్మి వాపోయారు.
దీంతో బాధితురాలు రఘురామ్ ప్రవర్తనపై ఈమేరకు శుక్రవారం నూజివీడులో డీవైఈవోకు ఫిర్యాదు చేశారు. పాఠశాల నుంచి విజయవాడకు వెళ్తుండగా విస్సన్నపేటలో ప్రధానోపాధ్యాయుడిని పట్టుకుని దేహశుద్ధి చేశారు. అనంతరం చనుబండ పాఠశాలకు తీసుకొచ్చారు.
ఈ సందర్భంలో స్కూల్లో తనపై చేసిన వేధింపులను ప్రశ్నిస్తూ ఆయనపై చేయి చేసుకున్నారు. హెడ్మాస్టర్పై చర్యలు తీసుకోవాలని కోరుతూ విద్యార్ధులు ఆయన గదికి ఎదురుగా ధర్నాకు దిగారు. ఈ విషయంపై పలువురు విద్యార్ధినిలు మాట్లాడుతూ తమపై కూడా చాలాసార్లు లైంగిక వేధింపులకు పాల్పడ్డారని తెలిపారు.
గతంలో జిల్లా విద్యాశాఖ అధికారికి, నూజివీడు ఉప విద్యాశాఖ అధికారికి ఫిర్యాదు చేసింది. వారు సదరు కీచక ప్రధాన ఉపాధ్యాయుడిని పిలిచి మందలించారు. అయినా అతడి తీరులో మార్పు లేదు. దీంతో బాధితురాలు శుక్రవారం నూజివీడు ఉప విద్యా శాఖ అధికారికి మరోమారు ఫిర్యాదు చేశారు. విచారణ తర్వాత చర్యలు తీసుకుంటామన్నారు.