ఏపీలో స్కూల్స్ ప్రారంభం ఆ రోజు నుంచే, జగనన్న విద్యా కానుక కూడా: మంత్రి సురేష్
అమరావతి: కరోనా మహమ్మారి కారణంగా రాష్ట్ర వ్యాప్తంగా విద్యాలయాలు మూతబడిన విషయం తెలిసిందే. పలు ప్రైవేట్ విద్యా సంస్థలు విద్యా సంస్థలు ఆన్లైన్లో క్లాసులను ప్రారంభించినప్పటికీ.. ప్రభుత్వ పాఠశాలల్లో మాత్రం క్లాసులు ప్రారంభం కాలేదు.
ఉపాధ్యాయుల దినోత్సవాన్ని పురస్కరించుకుని..
ఈ క్రమంలో మూతపడ్డ విద్యాలయాలను తెరిచేందుకు ప్రభుత్వం కసరత్తులు చేస్తోంది. ఇప్పటికే విద్యార్థులు కావాల్సిన పాఠ్యపుస్తకాలు, యూనిఫాంలను సిద్ధం చేశారు. ఈ విద్యా సంవత్సరాన్ని ఉపాధ్యాయుల దినోత్సవాన్ని పురస్కరించుకుని పునర్ ప్రారంభించాలని నిర్ణయానికి వచ్చింది ఏపీ సర్కారు.పాఠశాలలను సెప్టెంబర్ 5 నుంచి ప్రారంభిస్తామని సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి మీడియాకు చెప్పారని విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ గుర్తు చేశారు.
అదే రోజు జగనన్న విద్యా కానుక కూడా..
కేంద్రం లాక్డౌన్ నిబంధనల ప్రకారం ఆగస్టు 31 వరకు విద్యా సంస్థలను ప్రారంభించకూడదని ఆదేశాలు ఉన్నాయని తెలిపారు. ఇక పాఠశాలల పునర్ ప్రారంభంపై ఆగస్టు 31 తర్వాత పరిస్థితిని సమీక్షించి నిర్ణయం తీసుకుంటామని మంత్రి సురేష్ తెలిపారు. సెప్టెంబర్ 5న గురు పూజోత్సవం సందర్భంగా నాడు-నేడు పనులను పూర్తి చేసి పాఠశాలలు ప్రారంభిస్తామని మంత్రి తెలిపారు.
అదే రోజు 1-10వ తరగతి వరకు విద్యార్థులకు జగనన్న విద్యా కానుక కిట్ల పంపిణీ కార్యక్రమం ఉంటుందన్నారు.
Recommended Video
కరోనా తీవ్రతను బట్టే తుది నిర్ణయం..
అయితే, ఆగస్టు 31వ తేదీ తర్వాత కరోనా తీవ్రతను బట్టి విద్యాలయాల ప్రారంభం, లేదా వాయిదాపై నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. కాగా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రోజు రోజుకు అత్యధిక కేసులు నమోదవుతుండటం ఆందోళన కలిగించే అంశంగా మారింది. తాజాగా ఏపీలో 9597 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా, 6676 మంది కరోనా నుంచి కోలుకున్నారు. తాజాగా, ఏపీలో 93 మంది మరణించారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 2,54,146 కరోనా పాజిటివ్ కేసులు ఉండగా, 90,425 యాక్టివ్ కేసులున్నాయి. 1,61,425 మంది కరోనా నుంచి కోలుకుని వివిధ ఆస్పత్రుల నుంచి డిశ్చార్జ్ అయ్యారు. ఇప్పటి వరకు రాష్ట్రంలో కరోనాతో మరణించిన వారి సంఖ్య 2296కు చేరింది.