ఏపీలో స్కూల్స్ రీ ఓపెన్ ప్రచార ఆర్భాటాలకే .. కరోనా సమయంలో ఇదో తుగ్లక్ చర్య : అనిత ఫైర్
ఏపీలో సెప్టెంబర్ 5 నుండి స్కూళ్లను రీ ఓపెన్ చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. ఆ దిశగా స్కూల్ రీ ఓపెన్ కు సంబంధించిన ప్రణాళికలు సైతం రూపొందిస్తోంది. అకడమిక్ క్యాలెండర్ ను సిద్ధం చేస్తోంది. అయితే కరోనా కాలంలో స్కూల్స్ రీ ఓపెన్ చేయడంపై టీడీపీ మాజీ ఎమ్మెల్యే, తెలుగు మహిళ రాష్ట్ర అధ్యక్షురాలు వంగలపూడి అనిత ఏపీ ప్రభుత్వం పై ఫైర్ అయ్యారు. ప్రభుత్వ స్కూళ్లను సెప్టెంబర్లో తిరిగి ప్రారంభిస్తామన్న జగన్ సర్కార్ చర్యను తుగ్లక్ చర్యగా ఆమె అభివర్ణించారు.
కరోనా విజృంభిస్తుంటే స్కూల్స్ తెరుస్తారా ?
కరోనా విజృంభిస్తున్న సమయంలో స్కూళ్లను ఎలా తెరుస్తారు అంటూ ఆమె ప్రశ్నించారు. ఇప్పటికే కరోనాని ఎదుర్కోవడం చేతగాని తుగ్లక్ ముఖ్యమంత్రి చర్యలతో నాలుగు వేల మంది ప్రాణాలు కోల్పోయారు అంటూ ఆమెమండిపడ్డారు . ఏపీలో ప్రతి 100 మందిలో 15 మంది కరోనా బారిన పడుతున్నారని, ఇలాంటి సమయంలో స్కూల్స్ అని తెరవటం ఏమిటి అని ఆమె ప్రశ్నించారు. ఏకంగా విద్యాశాఖ మంత్రి కరోనాతో బాధపడుతూ ఉంటే, విద్యాశాఖ కరోనా కట్టడికి ఏదో చేస్తామని చెప్పడం సిగ్గుచేటు అంటూ ఆమె మండిపడ్డారు.
ప్రచార ఆర్భాటాల కోసమే స్కూల్స్ రీ ఓపెన్ నిర్ణయం
గ్రామీణ ప్రాంతాల్లో కరోనా వ్యాప్తి అధికంగా ఉన్న నేపథ్యంలో స్కూళ్లను తెరవాలి అనుకోవడం అత్యంత ప్రమాదకరమని పేర్కొన్నారు అనిత. ఏపీ ముఖ్యమంత్రి జగన్ మాస్కు పెట్టుకోవటం లేదని, మంత్రులు ఎమ్మెల్యేలు కరోనాను వ్యాప్తి చేస్తున్నారని మండిపడ్డారు. కేవలం ప్రచార ఆర్భాటాల కోసం పసివాళ్ళ ప్రాణాలు తీయాలనుకుంటున్నారా అంటూ విమర్శలు గుప్పించారు. ప్రభుత్వానికి పిల్లల భవిష్యత్తు పై అంత శ్రద్ధ ఉంటే విద్యార్థులందరికీ సెల్ ఫోన్ లు ఇచ్చి ఆన్లైన్ క్లాసులు నిర్వహించవచ్చు కదా అంటూ ఆమె ప్రశ్నించారు.
సీఎం జగనే మాస్క్ పెట్టుకోరు ? పిల్లలు పెట్టుకుంటారా
పిల్లల యూనిఫామ్ లకు, స్కూల్ బ్యాగులకు కూడా పార్టీ రంగు వేయాలన్న ఆలోచన వైసీపీ ప్రభుత్వానికి తప్ప మరెవరికీ రాదు అని అనిత ఎద్దేవా చేశారు. గోరంత చేసి కొండంత చెప్పుకునే ప్రభుత్వం ప్రచార ఆర్భాటాల కోసం స్కూల్స్ తెరిస్తే విద్యార్థులకు ఏదైనా జరిగితే వారి జీవితాలను ఎవరు కాపాడుతారు అంటూ ప్రశ్నించారు. ఏపీ ముఖ్యమంత్రి, ప్రిన్సిపల్ సెక్రెటరీ, చీఫ్ సెక్రటరీ లే మాస్కులు పెట్టుకోకుంటే ఇక స్కూల్ పిల్లలు మాస్కులు ధరిస్తారా అంటూ ప్రశ్నించారు అనిత.
Recommended Video
వ్యాక్సిన్ వచ్చే వరకు ఇలాంటి పిచ్చి పనులు మానుకోవాలి
ప్రైవేటు స్కూల్స్, కాలేజీల దందాను గుర్తించలేని ప్రభుత్వం స్కూల్స్ ని రీ ఓపెన్ చేసి వారితో పాటు కలసిపోవాలని చూస్తోందని, వ్యాక్సిన్ వచ్చేవరకు ఇలాంటి పిచ్చి పనులు మానుకుంటే మంచిదంటూ అనిత ప్రభుత్వానికి హితవు పలికారు. కరోనా ఉధృతంగా ఉన్న సమయంలో స్కూల్స్ పెట్టి తల్లిదండ్రులను మరింత టెన్షన్ పెట్టవద్దని అనిత ప్రభుత్వాన్ని కోరారు. తీవ్రంగా స్కూల్స్ పునః ప్రారంభ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్నారు అనిత .