వైసీపిలో తారాస్థాయి వెళ్లిన దూషణల పర్వం..!!
రాజకీయ నాయకులు విమర్శలు, ఆరోపణలు చేయడం చాలా సహజం. అయితే ఈ మధ్య కాలంలో ఆంధ్రప్రదేశ్ నేతలు నోటికి పదును పెట్టారు. మాటలు దూషణలు, దుర్భాషల స్థాయికి చేరుకున్నాయి. అప్పుడప్పుడు బూతులు కూడా నాయకుల నాలుకలపైన నాట్యం చేస్తున్నాయి. రాజకీయాలను వ్యక్తిగతంగా తీసుకోవడంతో పరిస్థితి చేయిదాటుతోంది. చంద్రబాబు, జగన్ పైన రెండు పార్టీల నేతలు పరస్పరం మాటల మంటలు పుట్టిస్తున్నారు. అవినీతిపైన పరస్పరం నిందలు వేసుకుంటున్నారు. తెలుగుదేశం నాయకులు జగన్ ను ఆర్థిక ఉగ్రవాది అంటే వైసీపీ నేతలు చంద్రబాబునాయుడిని అవినీతి పరుడంటు నిప్పులు చెరుగుతున్నారు. నంద్యాల ఎన్నికల సమయంలో చంద్రబాబును కాల్చి చంపాలంటు వ్యాఖ్యానించారు. అంతకు ముందు చెప్పుతో కొట్టాలని ధ్వజమెత్తారు. అసహనం పెరిగినప్పుడల్లా జగన్ మాట జారుతునే ఉన్నారు. అయితే అనుభవం వల్లనో లేక ఇంకేమిటో తెలియదు కాని ఇటీవల కాలంలో వైసీపీ అధినేత కంట్రోల్ లో ఉన్నప్పటికి క్రిందిస్థాయి నాయకులు మాత్రం రెచ్చిపోతున్నారు.
వైసీపి నేతల బూతు పురాణం.. హద్దులు దాటొద్దంటున్న టీడిపి నేతలు..
ఏపీలో వైసిపి నేతలు తరచూ అధికారులపై నోరుపారేసుకోవడంతో విమర్శల పాలవుతున్నారు. పార్టీలో నెలకొన్న అసంతృప్తి కారణంగా వీరు ఇలా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలున్నాయి. అధికార పార్టీ నాయకులతో పాటు అధికారులను టార్గెట్ చేసుకుని వారు మాటల దాడులకు దిగుతున్న వైనం పలు విమర్శలకు దారితీస్తోంది. ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో ఆ ఒత్తిడితో, సహనం కోల్పోయి వారికి నచ్చినట్టు వ్యవహరించడం సరికాదని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. ఇటీవల వైసిపికి చెందిన ముగ్గురు కీలక నేతలు వ్యవహరించిన తీరు సరికాదన్న అభిప్రాయం సర్వత్రా వ్యక్తమవుతోంది. కొడాలి నాని వైసిపి కార్యకర్తల జోలికి వస్తే ఎన్నికల తరువాత మీ కథ తేలుస్తానని మున్సిపల్ అధికారులను హెచ్చరించారు, దీన్ని మరువక ముందే నగరి ఎమ్మెల్యే రోజా పోలీసులపై తిట్ల వర్షం కురిపించారు. తాజాగా వైసిపి సీనియర్ నేత భూమన కరుణాకర్ రెడ్డి సిబిఐ అధికారులను ఊరకుక్కలతో పోల్చడం తీవ్ర విమర్శలకు దారితీస్తోంది.
జూనియర్లే కాదు.. సీనియర్లు కూడా ప్రయోగిస్తున్న బూతులు..
వైసీపిలో సీనియర్ నేతలకు కూడా మినహాయింపు ఏమీ లేదు. చార్డెట్ ఎకౌంటెంట్ నుంచి రాజకీయ వేత్తగా రూపాంతరం చెందిన సాయిరెడ్డికి ఇంకా అనుభవం ఒంటబట్టినట్లు కనిపించడం లేదు. అందుకే ఆయన పదే పదే గీత దాటుతున్నారు. కావాలనే మాటల మంటలు పుట్టించి చలికాచుకునే పనిచేస్తున్నారు. కాని జగన్ నమ్మిన బంటు విజయసాయిరెడ్డి మాత్రం నోటికి పని చెపుతూనే ఉన్నారు.ఎపి సి.ఎం చంద్రబాబునాయుడిపైన తీవ్ర విమర్శలు గుప్పిస్తున్న ఆయన అప్పుడప్పుడు నాలుక మడతేసి మాట్లాడుతున్నారు. వ్యక్తిగత విమర్శలు చేస్తు టీడీపీ అధినేతను కవ్విస్తున్నారు. తాజాగా ఢిల్లీలో విజయసాయిరెడ్డి ఒక అడుగు ముందుకు వేసి చంద్రబాబుపైన దూషణలకు దిగారు. ప్రత్యేక హోదా అంశంలో తెలుగుదేశం ఇచ్చిన అవిశ్వాసం తీర్మానం చర్చకు రావడంతో సాయిరెడ్డిలో సహనం చచ్చిపోయింది. ఈ విషయంలో టీడీపీ హైలెట్ కావడాన్ని చూడలేకపోతున్న ఆయన తనలోని మంటను మాటల ద్వారా చల్లార్చుకునే పని చేస్తున్నారు. చంద్రబాబు నాయుడు ఆడా,మగా,మాడా కూడా కాని మరో జీవి అంటు తీవ్రాతి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఫోర్త్ జండర్ గా ఎపి సిఎం ని ఆయన అభివర్ణించారు. ప్రక్రుతి కార్యంలో కూడా డ్యుయల్ రోల్ ప్లే చేసే వ్యక్తి అంటు దూషణలకు దిగారు. ఫోర్త్ జండర్ గా ప్రజలకు చంద్రబాబు మోసం చేస్తున్నారని వ్యాఖ్యానించారు.
రోజా లాంటి మహిళలు దుర్బాషలు.. అసహనమే కారణమా..!!
కాగా వైసిపి నేతలు ఇలా అధికారులను టార్గెట్ చేసుకోవడంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇటీవలే వైసిపి అధినేత జగన్ రిజర్వేషన్ పై చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు మరువక ముందే ఆ పార్టీ నేతలు కూడా ఇలా మాట్లాడటం విచిత్రంగా ఉందనే వ్యాఖ్యానాలు వినిపిస్తున్నాయి. జగన్ చేపడుతున్న పాదయాత్రకు మంచి స్పందన వస్తున్న తరుణంలో ఆ పార్టీ నేతలు ఇలా వ్యవహరించడం సరికాదని విశ్లేషకులు అంటున్నారు. అయితే ముంచుకొస్తున్న ఎన్నికల నేపధ్యంలోనే వారు గెలుస్తామో? లేదోనన్న సందేహంతో ఒత్తిడికి గురై ఇలా ప్రవర్తిస్తున్నారని విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు. ఏదిఏమైనప్పటి ఇటువంటి తీరును వైసిపి నేతలు మార్చుకోకపోతే రాబోయే ఎన్నికల్లో ఆ పార్టీకి ఇబ్బందులు తప్పవని రాజకీయ విశ్లేషకులు జగన్ పార్టీ నేతలకు సూచిస్తున్నారు.
నేతలు, అదికారులన్న భేదం లేదు..! తిట్లదండకానికి అందరూ అర్హులే..!!
వైసిపి నాయకులు వ్యవహరిస్తున్న తీరుపై అధికారులు, ఇతర ఉద్యోగులతోపాటు ఎమ్మెల్యేలు కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. విధి నిర్వహణలో భాగంగా తాము అలా వ్యవరించాల్సి వస్తోందని, రాజకీయాలతో తమకు సంబంధం లేదని అదికారులు వివరణ ఇస్తుండగా., రాజకీయ విమర్శలకు ఓ హద్దు ఉంటుందని, వైసీపి నేదలు హద్దులు దాటి ఆరోపణలకు దిగుతున్నారని టీడిపి నాయకులు అంటున్నారు. తమపై రాజకీయాలు రుద్దడమే కాకుండా తీవ్ర పదజాలాన్ని వాడుతూ దూషించడం సరికాదంటున్నారు అదికారులు. ఇకనైనా జగన్ పార్టీ నేతలు తమ తీరు మార్చుకోకపోతే చట్టపరంగా చర్యలు తీసుకోవాల్సి వస్తుందని హెచ్చరిస్తున్నారు.