గోదావరిలో లాంచీ వెలికితీత కోసం చివరి ప్రయత్నం: స్కూబా డైవర్లతో
రాజమహేంద్రవరం: తూర్పు గోదావరి జిల్లా దేవీపట్నం మండలం కచ్చులూరు వద్ద గోదావరిలో ప్రమాదానికి గురై, నీట మునిగిన పర్యాటక లాంచీ రాయల్ వశిష్ఠను వెలికి తీయడానికి చివరి ప్రయత్నాలు మొదలయ్యాయి. లాంచీని వెలికి తీసే పనుల కాంట్రాక్టును పొందిన ధర్మాడి సత్యం తాజాగా స్కూబా డైవర్ల మీద ఆధార పడ్డారు. విశాఖపట్నం నుంచి ఎనిమిది మంది స్కూబా డ్రైవర్లను పిలిపించారు. తగిన జాగ్రత్తలు తీసుకుని సముద్ర గర్భాలకు సైతం వెళ్లి రాగల స్కూబా డైవర్ల సహకారంతో లాంచీని వెలుపలికి తీసుకుని రావాలని నిర్ణయించుకున్నారు.
హిందూ మహాసభ నేత హత్యలో ఉగ్ర కోణం: మహారాష్ట్ర, గుజరాత్ లల్లో దర్యాప్తు: మహిళ పాత్రపై అనుమానాలు
ఉపరితలం నుంచి 50 అడుగుల లోతు వరకు
లాంచీని వెలికి తీయడానికి రెండో సారి ప్రయత్నాలు మొదలు పెట్టారు ధర్మాడి సత్యం. మూడురోజులుగా నిరంతరాయంగా లాంచీని వెలికి తీసే పనులను కొనసాగిస్తున్నప్పటికీ.. ఉపయోగం లేకుండా పోయింది. మొదట్లో సుమారు 310 అడుగుల లోతు వరకు చేరుకున్న లాంచీని 250 అడుగుల ఎత్తు వరకు తీసుకుని రాగలిగారు ధర్మాడి సత్యానికి చెందిన నిపుణులు. ఆ తరువాత దాన్ని బయటికి తీసుకుని రావడం వారి శక్తికి మించిన పనైంది. నది ఉపరితలం నుంచి సుమారు 50-60 అడుగుల లోతులోనే ఉన్న లాంచీని క్రమంగా మళ్లీ జారిపోతున్నట్లు గుర్తించారు.
స్కూబా డ్రైవర్లపై ఆధారం..
బురద పేరుకుని పోవడం వల్ల నది నుంచి లాంచీని వెలికి తీయడానికి ఇన్నిరోజుల పాటు సంప్రదాయబద్ధంగా చేపట్టిన పనులన్నీ బెడిసి కొట్టాయి. ఫలితంగా ఇక స్కూబా డ్రైవర్లను తీసుకుని రావాలని నిర్ణయించారు. ధర్మాడి సత్యం, మరి కొందరు నిపుణులు శనివారం విశాఖపట్నం వెళ్లారు. ఎనిమిది స్కూబా డైవర్లను సంప్రదించారు. ఆదివారం ఉదయం వారు దేవీపట్నానికి చేరుకున్నారు. స్కూబా డైవర్లను లాంచీ వెలికి తీసే పనులకు మొదట్లో పోలీసులు అనుమతి ఇవ్వలేదని సమాచారం. ఫలితంగా వారు దేవీపట్నంలోని ఆగిపోయారు. ధర్మాడి సత్యం దేవీపట్నానికి వెళ్లి పోలీసులను ఒప్పించి కచ్చులూరుకు తీసుకెళ్లినట్లు తెలుస్తోంది.
చివరి ప్రయత్నమేనా?
కచ్చులూరు వద్ద గోదావరి నదిలో మునిగిపోయిన రాయల్ వశిష్ఠ లాంచీ ఎక్కడ ఉన్నది స్పష్టంగా తెలియడంతో, దాన్ని వెలికి తీయాలంటే స్కూబా డైవర్ల అవసరం ఉందని భావించారు. స్కూబా డైవర్లను నది గర్భంలోనికి పంపించి, ఇనుప తాళ్లతో దాన్ని కట్టిన అనంతరం ప్రొక్లెయిన్లతో దాన్ని బయటికి లాగాలనేది ధర్మాడి సత్యం తాజాగా రూపొందించిన వ్యూహం. ఈ వ్యూహం విఫలం కాదని ధీమా వ్యక్తం చేస్తున్నారు ధర్మాడి సత్యం. ఇప్పటిదాకా చేసిన ప్రయత్నాలన్నీ విఫలం కావడంతో చివరిగా స్కూబా డైవర్ల మీద ఆధారపడాల్సి వచ్చిందని అన్నారు. ఈ ప్రయత్నం విఫలం కాదని అంటున్నారు.
నదీ గర్భానికి ఎనిమిది మంది స్కూబా డైవర్లు
లాంచీ ఎక్కడ మునిగిందో స్పష్టంగా తెలియడం వల్ల మానవ ప్రయత్నంగా స్కూబా డైవర్లను పంపించేలా ఏర్పాట్లు చేసినట్లు ధర్మాడి సత్యం చెబుతున్నారు. ఎనిమిది మంది స్కూబా డైవర్లు నదీ గర్భంలోకి వెళ్లి లాంచీకి ఇనుప తాళ్లను కట్టి బయటికి వస్తారని, అనంతరం దాన్ని ప్రొక్లెయిన్లతో లాగుతామని అంటున్నారు. నదీ గర్భంలోనికి వెళ్లి లాంచీకి ఇనుప తాళ్లను కట్టే సాంకేతిక పరిజ్ఞానం గానీ, అంతసేపు నీటిలో ఉండటానికి అవసరమైన మానవ వనరులు గానీ, సాకేంతిక పరికరాలు గానీ తమ వద్ద లేవని ధర్మాడి సత్యం తెలిపారు. అందుకే స్కూబా డైవర్ల మీద ఆధారపడుతున్నామని అన్నారు.