అదితి మృతదేహాన్ని డిక్కీలో తరలిస్తారా?: కలెక్టర్-కమిషనర్లకు నోటీసులు
విశాఖ: విశాఖలో మురుగు కాలువలో పడి చనిపోయిన ఆరేళ్ల పాప అదితి భౌతిక కాయానికి తగిన గౌరవం లభించలేదని రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ పేర్కొంది. తీరానికి కొట్టుకు వచ్చిన ఆమె భౌతిక కాయాన్ని కారు డిక్కీలో ఉంచి విశాఖకు తరలించినట్లు తమకు సమాచారం అందిందని తెలిపింది.
ఇది పిల్లల హక్కులను కాలరాయడమేనని వాపోయింది. ఈ అంశాన్ని సుమోటోగా విచారణకు స్వీకరించింది. తీరానికి కొట్టుకు వచ్చిన మృతదేహం ఎవరిదైనా సరే, అంబులెన్సులో గౌరవప్రదంగా తరలించాలని పేర్కొంది.
దయనీయస్థితిలో ఉన్న భౌతిక కాయాన్ని కారుడిక్కీలో వేయడం వల్ల గాయాలై, శవపరీక్ష నివేదిక తారుమారు అయ్యే అవకాశముందని వ్యాఖ్యానించింది. ఈ అంశంపై విశాఖ కలెక్టర్, నగర పోలీస్ కమిషనర్లకు నోటీసులు జారీ చేసింది. 15వ తేదీలోగా సమాధానం చెప్పాలని శనివారం ఆదేశించింది.
కాగా, గత నెల 24న నగరంలో కురిసిన భారీ వర్షానికి రోడ్లపై నీరు భారీగా చేరడం, అదే సమయంలో అదితి ట్యూషన్ నుంచి బయటకు వచ్చి, కారు ఎక్కుతున్నప్పుడు ప్రమాదవశాత్తు కాలువలో పడి కొట్టుకుపోయిన విషయం తెలిసిందే అదితి జాడ కోసం వారం రోజులపాటు గాలించారు.
చివరికి గురువారం సాయంత్రం సుమారు ఆరు గంటల సమయంలో అదితి శవమై విజయనగరం జిల్లా భోగాపురం మండలం దిబ్బపాలెం సముద్ర తీరంలో కనిపించింది. శుక్రవారం ఉదయం అదితి మృతదేహానికి పోస్ట్మార్టం నిర్వహించి, తరువాత బంధువులకు అప్పగించారు.
సీతమ్మధారలోని అదితి తాత వెంకటేశ్వర రావు ఇంటికి మృతదేహాన్ని తీసుకువెళ్లారు. అప్పటికే అదితి ఇంటి వద్దకు బంధువులు, నగర ప్రజలు భారీగా చేరుకున్నారు. అదితి మృతదేహం వద్ద నివాళులు అర్పించారు. ఇదే సమయంలో అదితి తండ్రి శ్రీనివాస రావుకు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఫోన్ చేసి ఓదార్చారు.