లాక్ డౌన్ లో రికార్డులు బద్దలు కొట్టిన రైల్వే.. ఏకంగా 522 శాతం వృద్ధి- కోట్లలో ఆదాయం..
కరోనా లాక్ డౌన్ సమయంలో దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో చిక్కుకుపోయిన వలస కార్మికుల రవాణాలో రైల్వేలు పోషిస్తున్న పాత్ర మరువలేనిది. అయితే అదే సమయంలో లాక్ డౌన్ లోనూ ఇళ్ల వద్ద ఉంటూ జనం నిత్యావసరాలను పొందుతున్నారంటే దానికి కారణం కూడా రైల్వేలే అంటే ఆశ్చర్యం కలుగక మానదు. దేశంలోని వివిధ ప్రాంతాల్లో ఆహార ధాన్యాలు, ఇతర నిత్యావసరాల కొరత రాకుండా భారీ సంఖ్యలో గూడ్స్ సర్వీసులను రైల్వే నడుపుతోంది.
సికింద్రాబాద్ కేంద్రంగా ఉన్న దక్షిణ మధ్య రైల్వే కూడా లాక్ డౌన్ సమయంలో భారీ ఎత్తున ఆహారధాన్యాలను వివిధ రాష్ట్రాలకు రవాణా చేయడం ద్వారా దేశంలో ఎందరో నిరుపేదలకు అండగా నిలిచింది. గతేడాది ఏప్రిల్ తో పోలిస్తే గత నెలలో దక్షిణ మధ్య రైల్వే ఏకంగా ఆరు రెట్లు ఎక్కువగా సరుకు రవాణా చేయగలిగింది. తద్వారా 522 శాతం వృద్ధిని నమోదు చేసింది లాక్ డౌన్ కారణంగా నెలకొన్న ప్రత్యేక పరిస్ధితుల్లో రైల్వే చురుగ్గా వ్యవహరించడంతో ఇతర రాష్ట్రాలకు ఆహార ధాన్యాల రవాణాలో ఎలాంటి ఇబ్బందులూ లేకుండా చేయగలిగింది.
ఫుడ్ కార్పోరేషన్ ఆఫ్ ఇండియాతో కలిసి సమన్వయంగా పనిచేస్తూ భారీ ఎత్తున ఆహార ధాన్యాలను ఇతర రాష్ట్రాలకు దక్షిణ మధ్య రైల్వే ఎగుమతి చేసింది. ఇందుకోసం జైకిసాన్ రైళ్ల పేరుతో ప్రత్యేక కార్గో సర్వీసులు నడిపింది. రెండు వేర్వేరు ప్రాంతాల నుంచి సరుకులు తీసుకెళ్తూ ఓ కామన్ జంక్షన్లో వీటిని ఒక రైలుగా మార్చడం వీటి ప్రత్యేకత. తద్వారా గత నెల రోజుల్లో అత్యధికంగా 12.3 లక్షల టన్నుల ఆహార ధాన్యాలను దక్షిణ మధ్య రైల్వే రవాణా చేయగలిగింది.
నిజామాబాద్, వరంగల్, కాజీపేట్, మిర్యాలగూడ, నెక్కొండ,, కరీంనగర్, పెదపల్లి, ఖమ్మం, రాజమండ్రి, సామర్లకోట, నిడదవోలు, ఏలూరు, విజయవాడ, గుడివాడ, మచిలీపట్నం, తణుకు, పాలకొల్లు నుంచి బయలుదేరిన ప్రత్యేక రైళ్లు.. కేరళ, కర్నాటక, తమిళనాడు, బెంగాల్ వంటి రాష్ట్రాల్లో ఎందరో నిరుపేదలకు ఆహార ధాన్యాల కొరత లేకుండా చేశాయి. అదే సమయంలో పాసింజర్ రైళ్ల నిలిపివేత కారణంగా కోల్పోయిన ఆదాయం కంటే ఎక్కువ ఆదాయాన్ని గూడ్స్ రవాణాతో దక్షిణ మధ్య రైల్వే ఆర్జించింది.