వీ షేప్ లో లాంచీ: మధ్యలో విరిగిందా? ముక్కలుగా ముందుభాగం వెలికితీత
రాజమహేంద్రవరం: తూర్పు గోదావరి జిల్లా దేవీపట్నం మండలం కచ్చులూరు వద్ద గోదావరి నదిలో మునిగిన పర్యాటక లాంచీ రాయల్ వశిష్ఠ విరిగిపోయినట్లు తెలుస్తోంది. నది ఉపరితలం నుంచి సుమారు 120 అడుగుల లోతుకు జారుకున్న ఈ లాంచీ.. మధ్యలో విరిగిపోయిందని, వీ షేపులో కనిపిస్తోందని స్కూబా డైవర్లు వెల్లడించినట్లు సమాచారం. లాంచీని వెలికి తీయడానికి నదీ గర్భంలోకి వెళ్లిన స్కూబా డైవర్లు అది మధ్యలో విరిగిపోయిందని, వీ షేపులో బురదలో కూరుకునిపోయినట్లు గుర్తించారు. దాన్ని వెలికి తీయం కష్టసాధ్యమని అంటున్నారు.
ఫలించిన స్కూబా డైవర్ల ప్రయత్నాలు..
లాంచీని వెలికి తీయడానికి ధర్మాడి సత్యం నేతృత్వంలో బాలాజీ మెరైన్స్ నిపుణులు ఇన్ని రోజుల పాటు చేసిన ప్రయత్నాలు ఫలించకపోవడంతో.. స్కూబా డైవర్లు రంగంలోకి దిగారు. నదీ గర్భంలోకి ప్రవేశించిన స్కూబా డైవర్లు చేసిన తొలి ప్రయత్నాలు సఫలం అయ్యాయి. లాంచీని గుర్తించిన వారు.. తమ వెంట తీసుకెళ్లిన ఇనుప తాళ్లతో లాంచీ ముందు భాగానికి కట్టారు. ఒడ్డుకు చేరుకున్న అనంతరం ఆ తాళ్లను భారీ ప్రొక్లెయినర్లతో లాగారు. లాంచీ కదిలినట్లుగా కనిపించినప్పటికీ.. కొద్దిసేపటి తరువాత ముందు భాగం మాత్రమే ముక్కలు ముక్కలుగా వెలుపలికి వచ్చింది.
ముందు భాగం.. ముక్కలు ముక్కలుగా..
స్కూబా డైవర్లు లాంచీ ముందు భాగానికి ఇనుప తాళ్లను కట్టినప్పటికీ.. ఒడ్డు చేరేటప్పటికి అవన్నీ ముక్కలు ముక్కలుగా తయారయ్యాయి. లాంచీ క్యాబిన్ ముందు భాగంలో ఉండే రెయిలింగ్, నేమ్ బోర్డు, ఇంజిన్ లోని కొంత భాగం, గేర్ బాక్సు, పైకప్పు.. ఇలా ఒక్కో భాగం వేర్వేరుగా ఒడ్డుకు చేరింది. వరద ఉధృతికి లాంచీ ముక్కలై ఉంటుందనే అనుమానాలు వ్యక్తమౌతున్నాయి. లాంచీని యథాతథంగా వెలికి తీయడం అసాధ్యమని స్కూబా డైవర్లు అభిప్రాయపడుతున్నారు. బురదలో కురుకునిపోవడం వల్ల, దాని బరువుకు లాంచీ మధ్యలో విరిగి పోయి ఉండొచ్చని చెబుతున్నారు.
నాలుగు సార్లు నదీ గర్భానికి..
విశాఖపట్నానికి చెందిన స్కూబా డైవర్లు సోమవారం ఉదయం నుంచి లాంచీ వెలికితీత పనుల్లో నిమగ్నమయ్యారు. లాంచీ నదీ గర్భంలో ఎన్ని అడుగుల లోతులో ఉందనే విషయాన్ని నిర్ధారించుకోవడం, ఎలా బయటికి తీయాలో తెలుసుకోవడానికి నాలుగు సార్లు వాళ్లు లాంచీని చేరుకున్నారు. అది ఎలా ఉందనే విషయంపై నిర్దారణకు వచ్చారు. ఈ తరువాతే- అది మధ్యలో విరిగిపోయి ఉండొచ్చని అనుమానాలను వ్యక్తం చేశారు. లాంచీ ముందు భాగానికి ఇనుప తాళ్లను కట్టి ప్రొక్లెయినర్ సహాయంతో లాగడానికి చేసిన తొలి ప్రయత్నమే సఫలమైంది. అయినప్పటికీ- లాంచీ ముందు భాగం మాత్రమే వెలుపలికి రావడం నిరాశకు గురి చేసింది.
రెండోరోజు కొనసాగిస్తాం: ధర్మాడి సత్యం
లాంచీ వెలికితీత పనులను రెండో రోజు కూడా కొనసాగిస్తామని ధర్మాడి సత్యం తెలిపారు. స్కూబా డైవర్లు చేసిన ప్రయత్నాలు ఫలించాయని, లాంచీ స్థితిగతులు ఎలా ఉన్నాయనే విషయంపై ఓ అవగాహన ఏర్పడిందని అన్నారు. బురద పేరుకుపోవడం వల్ల, దాని బరువుకు లాంచీ మధ్యలో విరిగిపోయి ఉండొచ్చని స్కూబా డైవర్లు చెబుతున్నారని చెప్పారు. లాంచీ విరిగిపోవడానికి అవకాశం ఉందని ధర్మాడి సత్యం అభిప్రాయపడ్డారు. ఇక లాంచీని యథాతథంగా బయటికి తీసుకుని రావడం అసాధ్యమని ఆయన అన్నారు. పూర్తిగా రాకపోవచ్చని కూడా చెప్పారు.