నోట్ల రద్దు ఎఫెక్ట్ : ఓపిక నశించి.. బ్యాంకు అద్దాలు ధ్వంసం చేశాడు
తాజాగా గుంటూరు జిల్లా మేడికొండూరు ఆంధ్రా బ్యాంకులో ఇలాంటి అనుభవాన్నే ఎదుర్కొన్న ఓ వ్యక్తి.. తీవ్ర అసహనంతో బ్యాంకు అద్దాలు పగలగొట్టాడు.
మేడికొండూరు : నోట్ల రద్దుతో సామాన్యుడిలో అసహనం కట్టలు తెంచుకుంటుంది. వ్యక్తిగత ఖర్చులకు, ఇంటి అవసరాలకు చేతిలో డబ్బు లేకపోవడంతో.. ఏం చేయాలో పాలుపోని పరిస్థితి. బ్యాంకులు ఏటీఎంల ముందు గంటల తరబడి క్యూ కట్టినా.. తీరా కౌంటర్ దగ్గరికి చేరుకునే లోపు నో క్యాష్ బోర్డులు దర్శనమిస్తున్నాయి.
దీంతో సామాన్యుడిలో ఓపిక నశించిపోతోంది. తాజాగా గుంటూరు జిల్లా మేడికొండూరు ఆంధ్రా బ్యాంకులో ఇలాంటి అనుభవాన్నే ఎదుర్కొన్న ఓ వ్యక్తి.. తీవ్ర అసహనంతో బ్యాంకు అద్దాలు పగలగొట్టాడు. చాలాసేపటి నుంచి లైన్లో వేచియున్నా.. తీరా కౌంటర్ వద్దకు వచ్చేలోపే బ్యాంకులో డబ్బంతా అయిపోయింది. క్యాషియర్ నుంచి నో క్యాష్ సమాధానం రావడంతో.. తీవ్ర ఆవేశానికి లోనయ్యాడు.
ఒక్కసారిగా తీవ్ర ఆగ్రహావేశాలతో బ్యాంకు అద్దాలను ధ్వంసం చేశాడు. దీంతో బ్యాంకు అధికారులు ఉలిక్కిపడ్డారు. వెంటనే పోలీసులు రంగప్రవేశం చేసి సదరు ఖాతాదారుడికి నచ్చజెప్పి అక్కడినుంచి పంపించేశారు. మొన్న ఉత్తరప్రదేశ్ ముజఫర్ నగర్ లో.. నేడు గుంటూరులో.. ఇలా పలుచోట్ల బ్యాంకులు అద్దాలు ధ్వంసమవుతున్నాయి. పలుచోట్ల ఖాతాదారులు ఘర్షణకు దిగుతున్న ఘటనలు కూడా చోటు చేసుకుంటున్నాయి.