నోట్ల రద్దు ఎఫెక్ట్: పాలకొల్లులో బ్యాంకు అద్దాలు ధ్వంసం..
క్యూ లైన్లో నిలుచున్న వారంతా.. ఒక్కసారిగా బ్యాంకులోకి చొచ్చుకెళ్లేందుకు ప్రయత్నించడంతో.. బ్యాంకు అద్దాలు ధ్వంసమయ్యాయి.
పాలకొల్లు : నోట్ల రద్దు ప్రకటన తర్వాత తీవ్రమైన కష్టాలను ఎదుర్కొంటున్న సామాన్య జనం బ్యాంకులు, ఏటీఎంల ముందు గంటల తరబడి క్యూ లైన్లో నిలుచుంటున్న పరిస్థితి. అంతసేపు క్యూ లైన్లో వేచియున్నా.. డబ్బు చేతికందుతున్న గ్యారెంటీ లేకుండా పోయింది. దీంతో సామాన్యుడి ఆవేశం కట్టలు తెంచుకుని.. ఘర్షణలు చెలరేగుతున్న పరిస్థితి.
మొన్నటికిమొన్న గుంటూరు అమరావతి ఆంధ్రాబ్యాంకులో ఓపిక నశించిన ఖాతాదారులు.. బ్యాంకు అద్దాలను ధ్వంసం చేయగా.. తాజాగా పాలకొల్లులోను అలాంటి ఘటనే చోటు చేసుకుంది. ఎస్.బి.ఐకి నగదు వచ్చిందన్న సమాచారం అందుకోగానే భారీ ఎత్తున ఖాతాదారులు బ్యాంకు వద్దకు చేరుకున్నారు. పైగా రేపు సెలవుదినం కావడంతో.. బ్యాంకు వద్ద జనం తాకిడి విపరీతంగా పెరిగిపోయింది.
ఈ క్రమంలో క్యూ లైన్లో నిలుచున్న వారి మధ్య తోపులాటలు, స్వల్ప ఘర్షణలు చోటు చేసుకోగా.. ఖాతాదారులంతా ఒక్కసారిగా బ్యాంకులోకి వెళ్లేందుకు ప్రయత్నించడంతో.. బ్యాంకు అద్దాలు ధ్వంసమయ్యాయి. ఈ ఘటనలో ఇద్దరు ఖాతాదారులకు స్వల్ప గాయాలయ్యాయి. నోట్ల రద్దు నేపథ్యంలో.. దేశవ్యాప్తంగా ఎక్కడ చూసినా ఇలాంటి పరిస్థితే నెలకొని ఉండడం గమనార్హం.