ఒక్కసారిగా మారిన క్లైమేట్: విశాఖలో ఎరుపెక్కిన సముద్రం, అమరాతిలో 4.గం.లకే చిమ్మచీకట్లు
విశాఖపట్నం: ఉత్తరాంధ్ర జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. విశాఖ జిల్లాలోని అరకులోయలో కుండపోత కురుస్తోంది. ఉత్తరాంధ్ర ప్రాంతంలో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. విశాఖ బీచ్ ప్రాంతంలో సముద్ర తీరం కొద్దిగా రంగు మారింది. ఎర్ర రంగులో కనిపిస్తోంది.
విశాఖ బీచ్లో సముద్రం రంగు మారడంతో జనాలు చూసేందుకు ఆసక్తి కనబరుస్తున్నారు. చాలామంది అక్కడకు తరలి వచ్చారు. మరోవైపు, విజయనగరం జిల్లాలో పిడుగుపాటుకు ముగ్గురు మృతి చెందారు.
శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల్లో పలు మండలాల్లో ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం కురిసింది. ఇదిలా ఉండగా, శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ జిల్లాల్లో పిడుగులు ప్రమాదం ఉందని, ప్రజలు జాగ్రత్తలు తీసుకోవాలని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది.
అమరావతిలోను
మధ్యాహ్నానికి అమరావతిలోను ఒక్కసారిగా వాతావరణం మారింది. పట్టపగలే చీకట్లు కమ్ముకున్నాయి. గన్నవరంలో ఉరుములతో కూడిన వర్షం భారీగా కురిసింది. నాలుగు గంటలకే విజయవాడ, అమరావతి చీకటిమయంగా కనిపించింది. పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి.