విశాఖపట్నం:యారాడ బీచ్ లో గల్లంతైన ఆరుగురు యువకుల కోసం...కొనసాగుతున్న గాలింపు
విశాఖపట్నం: విశాఖ పరిధిలోని యారాడ బీచ్ లో గల్లంతైన ఆరుగురు యువకుల కోసం పెద్ద ఎత్తున గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. ఒక నేవీ హెలికాఫ్టర్, మూడు బోట్లతో గాలింపు జరుపుతున్నారు.
ఆదివారం సముద్ర స్నానానికి 12 మంది యువకులు కలసి రాగా వారిలో ఆరుగురు గల్లంతయ్యారు. తొలుత 12 మంది అలల ఉధృతికి కొట్టుకుపోతుండగా గమనించిన స్థానిక జాలర్లు ఆరుగురిని రక్షించి ఒడ్డుకు తీసుకువచ్చారు. గల్లంతైన వారంతా విశాఖ విశాఖ హౌసింగ్బోర్డు కేఆర్ఎమ్ కాలనీ వాసులని తెలిసింది. వీరు వాసు, గణేష్, రాజేష్, తిరుపతి, దుర్గ, శ్రీనులుగా గుర్తించారు.
విశాఖపట్నంలోని యారాడ సముద్ర తీరంలో ఆరుగురు యువకుల గల్లంతుతో ఆదివారం పెను విషాదం చోటు చేసుకున్న సంగతి తెలిసిందే. ఆదివారం ఆటవిడుపుగా విహారయాత్రకు వచ్చిన 12 మంది విశాఖ యువకులు బీచ్ లో సరదాగా స్నానం చేస్తుండగా ప్రమాదవశాత్తు అలల తాకిడికి గురయ్యారు. వీరంతా అలల్లో చిక్కుకొని కొట్టుకుపోతుండగా గమనించిన స్థానిక జాలర్లు గమనించి వెంటనే నీళ్లలో దూకి ఐదుగురిని సురక్షితంగా ఒడ్డుకు తీసుకురాగా మరొకరిని కోస్ట్ గార్డ్ సిబ్బంది రక్షించారు. అయితే మరో ఆరుగురు మాత్రం అప్పటికే సముద్రంలోకి కొట్టుకుపోయారు.
యువకుల గల్లంతు గురించి సమాచారం అందుకున్న అధికారులు పెద్ద ఎత్తున గాలింపు చర్యలు ప్రారంభించారు. ఆదివారం ఘటన చోటుచేసుకున్న కొంత సేపటికే చీకటి పడటంతో గాలింపు చర్యలు ముమ్మరం చేసేందుకు అవకాశం లేకుండా పోయింది. ఈ నేపథ్యంలో సోమవారం ఉదయం నుంచే గల్లంతైన యువకుల కోసం పెద్ద ఎత్తున గాలింపు చర్యలు ఆరంభించారు. తమ పిల్లల క్షేమంగా తిరిగి రావాలని తల్లిదండ్రులు బీచ్ వద్ద గుండెలు చిక్కబట్టుకొని నిరీక్షిస్తున్నారు.
ఇదిలావుంటే ప్రకృతి అందాలకు పెట్టింది పేరైన యారాడ బీచ్ కార్తీకమాసం వచ్చిందంటే సందర్శకులతో కిక్కిరిసిపోతుంది. అయితే ఈ బీచ్ ఎంత అందమైనదో అంత ప్రమాదకరమైందని ఇక్కడి స్థానికులు చెబుతూ ఉంటారు. ఇక్కడి సహజమైన ప్రకృతి అందాలను చూసి ఆనందించాలే తప్ప బీచ్ లో స్నానాలకు దిగడం ప్రమాదకరమని స్థానిక జాలర్లు హెచ్చరిస్తూనే ఉంటారు.