అతి త్వరలో విశాఖకు జగన్ మకాం- తుది దశకు క్యాంపు ఆఫీస్ అన్వేషణ- ఆగస్టు తర్వాత....
ఏపీ సీఎం జగన్ త్వరలో విశాఖకు మకాం మార్చేందుకు అన్ని ఏర్పాట్లు చురుగ్గా సాగుతున్నాయి. ఏడాది పాలన వూర్తి చేసుకున్న వైసీపీ ప్రభుత్వంలో పలు మార్పులకు కూడా ఇదే అనువైన అవకాశమని భావిస్తున్న జగన్.. విశాఖ వేదికగా వాటిని చేపట్టినా ఆశ్చర్యం లేదని చెబుతున్నారు. విశాఖలో క్యాంపు కార్యాలయం కోసం తాజాగా ఆయన వ్యక్తిగత కార్యదర్శి ప్రవీణ్ ప్రకాష్ పర్యటించి వచ్చారు. ఇందులో ఆయన పలు ఆప్షన్లను ఎంపిక చేసినట్లు తెలుస్తోంది.
జేసీ బద్రర్స్కు మరో షాక్: కేంద్రానికి వైఎస్ జగన్ సర్కారు ఫిర్యాదు
క్యాంపు ఆఫీస్ అన్వేషణ....
అతి త్వరలో అమరావతి నుంచి విశాఖకు మకాం మార్చాలని భావిస్తున్న ఏపీ సీఎం వైఎస్ జగన్ ఆ మేరకు అధికారులను పరుగులు పెట్టిస్తున్నారు. విశాఖలో సీఎం క్యాంపు కార్యాలయం కోసం ఇప్పటికే పలు స్ధలాల పరిశీలన కోసం అధికారులతో పాటు సతీమణి బారతిని కూడా పంపిన జగన్... పలు ఆప్షన్లను సిద్ధం చేసుకున్నట్లు అర్ధమవుతోంది. వీటిలో మరింత అనువైన వాటిని ఎంపిక చేసేందుకు వీలుగా తాజాగా ఆయన రాజకీయ వ్యవహారాల కార్యదర్శి ప్రవీణ్ ప్రకాష్.. విశాఖలో పర్యటించారు. ఎవరికీ సమాచారం లేకుండానే ప్రొటోకాల్ అధికారులు కేటాయించిన ఓ కారులో, తన వెనుక మరో బీఎండబ్ల్యూ కారులో భీమిలి బీచ్ రోడ్డుకు వెళ్లి స్ధలాలు పరిశీలించారు.
తుది జాబితాలో ఇవే...
ఇప్పటివరకూ పరిశీలించిన స్ధలాల తుది జాబితాలో ఉన్న వాటినే సీఎం పొలిటికల్ సెక్రటరీ ప్రవీణ్ ప్రకాష్ మరోసారి పరిశీలించినట్లు తెలుస్తోంది. వీటిలో కాపులుప్పాడ గ్రేహౌండ్స్ కు కేటాయించిన స్ధలం, అక్కడికి సమీపంలో బౌద్ధారామం ఉన్న తొట్లకొండ, రామానాయుడు స్టూడియో కూడా పరిశీలించారు. వీటిలో దాదాపుగా ఏదో ఒక ప్రాంతాన్ని క్యాంపు కార్యాలయం కోసం ఖరారు చేస్తారని భావిస్తున్నారు. వీటిలో తొట్లకొండ మాత్రం పురావస్తుశాఖ సంరక్షణ ప్రాంతంగా ఉంది. ఇక్కడ ఎలాంటి నిర్మాణాలు చేపట్టేందుకు వీల్లేదు. గతంలో టీడీపీ హయాంలో ఫిల్మ్ నగర్ క్లబ్ కు ఇచ్చి... ఆ తర్వాత రద్దు చేశారు.
అభ్యంతరాలతో.... ముందుగా తానే
ప్రవీణ్ ప్రకాష్ పరీశీలించిన మూడు స్ధలాల్లో ఏదో ఒక దానికి సీఎం గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం ఖాయమని చెబుతున్నారు. ఆ తర్వాత విశాఖ వెళ్లే తేదీ ఖరారు కానుంది. మరోవైపు విశాఖకు రాజధాని తరలింపుపై న్యాయ, చట్టపరమైన అభ్యంతరాలు ఎదురవుతున్న నేపథ్యంలో ముందుగా తానొక్కడే వెళ్లాలని సీఎం జగన్ భావిస్తున్నారు. సీఎంగా తాను ఎక్కడి నుంచి పనిచేయాలో ఎవరూ నిర్దేశించలేరని, రాష్ట్రంలో ఎక్కడి నుంచైనా పనిచేసే హక్కు తనకుందని గతంలో అసెంబ్లీలోనే జగన్ తేల్చిచెప్పారు. దీంతో ఈ ఏడాది ఉద్యోగులతో పాటు కాకుండా తానొక్కరే విశాఖకు మకాం మార్చబోతున్నట్లు అర్ధమవుతోంది. ఇందులో ఎలాంటి చట్టపరమైన ఇబ్బందులు కూడా లేవని ప్రభుత్వం అంచనా.
ఉద్యోగుల తరలింపు వచ్చే ఏడాది....
అమరావతి సచివాలయంతో పాటు హెచ్వోడీ కార్యాలయాల్లో పనిచేస్తున్న ఉద్యోగులను విశాఖ తరలించేందుకు పెట్టుకున్న గడువు ముగిసిపోయిన నేపథ్యంలో వచ్చే ఏడాది వెళ్లేందుకు సిద్ధంగా ఉండాలని ప్రభుత్వం వారికి సంకేతాలు పంపుతోంది. ఈ ఏడాది సీఎం క్యాంపు కార్యాలయం తరలింపు ఒక్కటే ఉంటుందని, వచ్చే విద్యా సంవత్సరం నాటికి అన్ని న్యాయపరమైన చిక్కులను అధిగమించి ఉద్యోగుల తరలింపుకు రూట్ మ్యాప్ సిద్ధం చేస్తారని చెబుతున్నారు. దీంతో ప్రస్తుతం కరోనా సమయంలో విశాఖ ఎలా వెళ్లాలా అని ఆందోళనలో ఉన్న ఉద్యోగులకు ఊరట లభించినట్లయింది.