కేశవ రెడ్డి కలకలం, చిట్టా విప్పుతున్న పోలీసులు: రంగంలోకి హరికృష్ణ!
కర్నూలు: కేశవ రెడ్డి విద్యా సంస్థల అధినేత కేశవ రెడ్డి వందల కోట్ల రూపాయల డిపాజిట్ల స్కాం తెలుగు రాష్ట్రాల్లో కలకలం రేపుతోంది. పోలీసులు కేశవ రెడ్డి విద్యాసంస్థల్లో సోదాలు నిర్వహిస్తున్నారు. అన్ని కోణాల్లోను దర్యాఫ్తును కొనసాగిస్తున్నారు.
కేశవ రెడ్డి విద్యా సంస్థల యాజమాన్యంపై దర్యాప్తు ప్రారంభమైంది. దాదాపు 11,000 మంది పిల్లల తల్లిదండ్రుల నుంచి లక్షలాది రూపాయల మేర డిపాజిట్లు సేకరించిన విద్యాసంస్థల అధినేత కేశవ రెడ్డి, గడువు ముగిసినా డిపాజిట్ సొమ్ము చెల్లించడంలో విఫలమయ్యారు.
అంతేకాక బ్యాంకులు, ప్రైవేట్ వ్యక్తుల నుంచి అధిక వడ్డీలకు తీసుకున్న రుణాల చెల్లింపులోనూ ఆయన చేతులెత్తేశారు. ఈ నేపథ్యంలో రెండు రోజుల క్రితం కేశవ రెడ్డిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. గురువారం కోర్టులో ప్రవేశ పెట్టారు. రిమాండుకు తరలించారు.
ఈ నేపథ్యంలో శుక్రవారం ఉదయం కర్నూలులోని వెంకటరమణ కాలనీలో ఉన్న పాఠశాల క్యాంపస్కు చేరుకున్న పోలీసులు రికార్డులు పరిశీలించారు. డిపాజిటర్లతో పాటు బ్యాంకులు, ప్రైవేట్ వ్యక్తులకు కేశవ రెడ్డి రూ.570 కోట్ల మేర బకాయి పడ్డట్టు పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు.
కాగా, కేశవ రెడ్డి విద్యాసంస్థల డిపాజిట్ల సేకరణపై తక్షణమే విచారణ చేపట్టి నివేదిక ఇవ్వాలని మంత్రి గంటా శ్రీనివాస రావు ఆదేశించారు. ఈ మేరకు విద్యార్థుల తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు నమోదు చేసిన కేసులు, కేశవ రెడ్డి అరెస్టుపై కర్నూలు ఎస్పీ రవికృష్ణతో గంటా ఫోన్లో మాట్లాడారు. అదే సమయంలో విద్యార్థులకు ఇబ్బందులు రానివ్వమని చెప్పారు.
రంగంలోకి హరికృష్ణ!
రాజ్యసభ మాజీ సభ్యుడు నందమూరి హరికృష్ణ మళ్లీ తెరపైకి వచ్చారు. కొంతకాలంగా ఆయన టిడిపి పార్టీ కార్యకలాపాలకు దూరంగా ఉంటున్నారు. కొద్ది రోజుల క్రితం వనజాక్షి పైన దాడి జరిగిన ఘటన పైన స్పందించారు. వనజాక్షికి మద్దతు ప్రకటించారు.
తాజాగా, కేశవ రెడ్డి విద్యా సంస్థల యాజమాన్యం చీటింగ్ పైన స్పందించారు. కేశవ రెడ్డి విద్యా సంస్థల వద్ద డిపాజిట్ చేసిన వారందరికీ న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. ఇక ఆ విద్యా సంస్థల్లో విద్యను అభ్యసిస్తున్న విద్యార్థుల విద్యా బోధనకు ఎలాంటి అంతరాయం కలగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.