'ఆ ఘనత మీదే... దటీజ్ పవన్ కళ్యాణ్': ఫిబ్రవరిలో సీట్ల పంపిణీపై చర్చ.. జనసేనాని
విశాఖపట్నం: జనసేన అధినేత పవన్ కళ్యాణ్తో శుక్రవారం సీపీఐ, సీపీఎం నేతలు రాఘవులు, మధు, సురవరం తదితరులు విశాఖపట్నంలో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా వారు వచ్చే ఎన్నికల్లో ఎలా వెళ్లాలనే అంశంపై చర్చించారు. అలాగే, ఈవీఎంల ట్యాంపరింగ్, టీడీపీ, వైసీపీని ఎదుర్కొనే వాటితో పాటు ఇతర అంశాలపై చర్చించారు.
అనంతరం వారు మీడియాతో మాట్లాడారు. ఎన్నికల్లో ఎలా ముందుకు వెళ్లాలనే అంశంపై తాము వామపక్ష నేతలతో చర్చించామని జనసేనాని తెలిపారు. భావసారూప్యత కలిగిన పార్టీలతో కలిసి ముందుకు సాగుతామని చెప్పారు. ఈవీఎంల ట్యాంపరింగ్ అంశం కూడా ఈ సమావేశంలో చర్చకు వచ్చిందని చెప్పారు. తెలంగాణ ఎన్నికల్లో లెక్కింపు క్రమంలో చాలా అనుమానాలు కలిగించాయని, ఈవీఎంలపై ఉన్న అనుమానాలు తొలగించడానికి ఈసీ కమిటీ వెయ్యాలని లెఫ్ట్ పార్టీ నేతలు అన్నారు.
బాబు భారీ ఆఫర్, కొత్త విషయం చెప్పిన పవన్ కళ్యాణ్! కుండబద్దలు.. పార్టీల్లో కలకలం
పోరాటం విషయంలో ఏకాభిప్రాయం
పర్యావరణ పరిరక్షణ తక్షణ కర్తవ్యంగా ఉందని, దీని పైన చర్చించామని సురవరం అన్నారు. మైనింగ్ కారణంగా పర్యావరణ సమస్య అధికంగా మారిందని చెప్పారు. ప్రజా సమస్యల పరిష్కారంపై పోరాడే విషయంలో తాము ఏకాభిప్రాయానికి వచ్చామని రాఘవులు చెప్పారు. పర్యావరణం, పౌరహక్కులు, సామాజిక న్యాయం విషయంలో పోరాటంపై తాము చర్చించామని తెలిపారు.
పవన్ కళ్యాణ్పై లెఫ్ట్ ప్రశంసల వర్షం
ఉద్ధానం సమస్యపై జనసేన పోరాటం అభినందనీయమని లెఫ్ట్ పార్టీ నేతలు ప్రశంసలు కురిపించారు. ఏపీకి ప్రత్యేక హోదా కోసం కలిసి పనిచేస్తామని తెలిపారు. యువతను రాజకీయాలకు మళ్లించిన ఘనత పవన్ కళ్యాణ్ది అని వారు ప్రశంసలు కురిపించారు.
సీట్ల పంపిణి గూర్చి ఫిబ్రవరిలో చర్చ
ఫిబ్రవరిలో సీట్ల పంపిణీ గురించి చర్చిస్తామని పవన్ కళ్యాణ్ చెప్పారు. తాము ఎన్నికలకు వెళ్లే ముందు సమస్యలపై తమ పార్టీల కూటమికి ఓ స్పష్టత ఉండాలని అభిప్రాయపడ్డారు. తాము గత రెండేళ్లుగా కలిసి పని చేస్తున్నామని చెప్పారు. ఎన్నికల్లో కూడా కలిసే వెళ్తామన్నారు. సీట్ల పంపకాలు ఇవాళ చర్చకు రాలేదని చెప్పారు. ఫిబ్రవరిలో ఉంటాయని చెప్పారు.