జగన్ సర్కారుపై నిమ్మగడ్డ మరో పోరు- స్ధానిక ఎన్నికలకు సహకరించట్లేదని హైకోర్టుకు..
ఏపీలో వైసీపీ సర్కారుకూ, రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్కూ మధ్య గతంలో సాగిన ముఖాముఖీ పోరు పూర్తవలేదని తెలుస్తోంది. తమ అభీష్టానికి వ్యతిరేకంగా హైకోర్టు ఉత్తర్వులతో రాష్ట్ర ఎన్నికల కమిషనర్గా పునర్ నియాయకం అయిన నిమ్మగడ్డ రమేష్ను ఏపీ సర్కార్ టార్గెట్ చేస్తూనే ఉన్నట్లు తెలుస్తోంది. తాజాగా హైకోర్టులో ఆయన దాఖలు చేసిన ఓ పిటిషన్ను గమనిస్తే తెరవెనుక ఏం జరుగుతుందో ఇట్టే అర్ధమవుతుంది. ముఖ్యంగా స్ధానిక ఎన్నికల నిర్వహణకు నిమ్మగడ్డ చేస్తున్న ప్రయత్నాలను వైసీపీ ప్రభుత్వం ఎలా అడ్డుకుంటుందో ఈ పిటిషన్లో వివరించారు.
జగన్ సర్కారుపై హైకోర్టుకు నిమ్మగడ్డ..
ఏపీలో ఈ ఏడాది మార్చిలో కరోనా కారణంగా స్ధానిక ఎన్నికలను వాయిదా వేస్తూ ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ తీసుకున్న నిర్ణయం, ఆ తర్వాత దాన్ని వ్యతిరేకిస్తూ ఓ ఆర్డినెన్స్ తీసుకొచ్చి ఆయన్ను వైసీపీ ప్రభుత్వం తొలగించడం, ఆ తర్వాత కోర్టు తీర్పులతో తిరిగి ఆయన పదవిలోకి రావడం చూస్తూనే ఉన్నాం. అయితే నిమ్మగడ్డ పదవిలోకి వచ్చాక స్ధానిక ఎన్నికలపై దృష్టిసారించారు. బీహార్లో పూర్తిస్ధాయి అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో రాష్ట్రంలో స్ధానిక ఎన్నికల నిర్వహణ అవకాశాలను ఆయన పరిశీలిస్తున్నారు. అయితే రాష్ట్ర ప్రభుత్వ సహకారం లేనిదే ఎన్నికల నిర్వహణ అసాధ్యం. ఇక్కడే వైసీపీ ప్రభుత్వం ఆయనకు సహాయనిరాకరణ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇదే విషయాన్ని ప్రస్తావిస్తూ నిమ్మగడ్డ ఇప్పుడు హైకోర్టును ఆశ్రయించారు.
స్ధానిక పోరుకు సహకరించని వైసీపీ సర్కారు...
ఏపీలో కరోనా కారణంగా మార్చిలో వాయిదా పడిన స్ధానిక సంస్ధల ఎన్నికల నిర్వహణకు రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రయత్నాలు చేస్తోంది. రాష్ట్రంలో కరోనా అదుపులోకి రావడంతో ఎన్నికల నిర్వహణకు ఉన్న అవకాశాలను పరిశీలించిన ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపారు. ఎన్నికల నిర్వహణకు అవసరమైన నిధులు ఇవ్వాలని కోరారు. అయితే ఆయన విజ్ఞప్తిని రాష్టప్రభుత్వం పట్టించుకోలేదని తెలుస్తోంది. దీన్ని హైకోర్టులో సవాలు చేస్తూ నిమ్మగడ్డ పిటిషన్ దాఖలు చేశారు. ఎన్నికల నిర్వహణ విషయంలో కమిషన్కు ప్రభుత్వం సహకరించడం లేదని ఆయన తెలిపారు. ఎన్నికల నిర్వహణ కోసం తాను చేస్తున్న ప్రయత్నాలను వివరిస్తూ, వీటికి ప్రభుత్వం నుంచి అవసరమైన సహకారాన్ని కూడా నిమ్మగడ్డ తన పిటిషన్లో పేర్కొన్నట్లు తెలుస్తోంది.
Recommended Video
ప్రభుత్వం నుంచి నిధులిప్పించాలని వినతి...
ఎన్నికల కమిషన్ నిర్వహణకు ఖర్చయ్యే నిధులను ప్రభుత్వం మంజూరు చేయకుండా నిలిపి వేసిందని, ఎన్నికల నిర్వహణకు ప్రభుత్వం సహకరించడం లేదని రమేష్ కుమార్ తన పిటిషన్లో పేర్కొన్నారు. దీనిపై కోర్టు వెంటనే జోక్యం చేసుకుని నిధులు విడుదల అయ్యేలా చూడాలని ఆయన కోరారు. రాజ్యాంగంలోని ఆర్టికల్243(కే) ప్రకారం ఎన్నికల కమిషన్కు నిధులు ఆపేయడం చట్ట విరుద్ధమని ఆయన పేర్కొన్నారు. వెంటనే నిధులు విడుదల చేసేలా రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించాలని రాష్ట్ర అత్యున్నత ధర్మాసనాన్ని ఎన్నికల కమిషనర్ కోరారు. ఈ పిటిషన్లో ప్రతివాదులుగా ఆర్థిక శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ, పంచాయతీరాజ్ ప్రిన్సిపల్ సెక్రెటరీలను పేర్కొన్నారు.