స్ధానిక పోరుపై పట్టువీడని నిమ్మగడ్డ- హైకోర్టుకు మరో హామీ- చిక్కుల్లో జగన్ సర్కార్
ఏపీలో స్ధానిక సంస్ధల ఎన్నికల నిర్వహణ విషయంలో జగన్ సర్కార్కూ, ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్కూ మధ్య ఎత్తులు, పై ఎత్తులు సాగుతూనే ఉన్నాయి. కరోనా తగ్గినందున ఎన్నికలను ఎట్టి పరిస్ధితుల్లోనూ నిర్వహించి తీరాలని పట్టుబడుతున్న నిమ్మగడ్డకు చెక్ చెప్పేందుకు కరోనా వ్యాక్సిన్ పంపిణీ కార్యక్రమాన్ని అడ్డుపెట్టిన జగన్ సర్కార్కు ఆ అవకాశం లేకుండా చేయాలని నిమ్మగడ్డ గట్టిగా ప్రయత్నిస్తున్నారు. దీంతో హైకోర్టులో ఆయన తాజాగా దాఖలు చేసిన అఫిడవిట్ ప్రభుత్వానికి గట్టి షాక్ ఇచ్చింది. ఇప్పుడు ప్రభుత్వం దీనిపై ఎలా స్పందిస్తుందన్న దానిపై స్ధానిక ఎన్నికలు ఆధారపడనున్నాయి.
స్ధానిక పోరుపై నిమ్మగడ్డ అఫిడవిట్
ఏపీలో త్వరలో కేంద్రం ఇచ్చిన మార్గదర్సకాల ప్రకారం కరోనా వ్యాక్సినేషన్ కార్యక్రమం ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో స్దానిక సంస్ధల ఎన్నికలు నిర్వహించేందుకు ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ చేస్తున్న ప్రయత్నాలు అడ్డుకోవాలని కోరుతూ ప్రభుత్వం హైకోర్టును ఆశ్రయించింది. దీనికి నిమ్మగడ్డ హైకోర్టులో కౌంటర్ దాఖలు చేశారు. కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియకు అడ్డులేకుండా స్ధానిక ఎన్నికలు నిర్వహించుకునేలా తమకు అనుమతి ఇవ్వాలని ఆయన తన అఫిడవిట్లో కోరారు. దీంతో ఇప్పుడు నిమ్మగడ్డ అఫిడవిట్ ఆధారంగా హైకోర్టు నిర్ణయం తీసుకుంటే ఏం జరుగుతుందన్న దానిపై ఉత్కంఠ నెలకొంది.
కరోనా వ్యాక్సిన్ షెడ్యూల్కు కట్టుబడతాం...
కేంద్రం మార్గదర్శకాల ప్రకారం కరోనా వ్యాక్సిన్ పంపిణీకి దేశవ్యాప్తంగా షెడ్యూల్ విడుదలైతే దానికి కట్టుబడి ఉంటామని ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ హైకోర్టులో దాఖలు చేసిన అఫిడవిట్లో పేర్కొన్నారు. కరోనా వ్యాక్సిన్ షెడ్యూల్ ఇప్పటివరకూ విడుదల కాలేదని, ఒకవేళ కేంద్రం ప్రకటిస్తే మాత్రం తాము దానికి కట్టుబడి ఉంటామని నిమ్మగడ్డ తెలిపారు. ఇదే కేసులో గతంలో ఇచ్చిన కౌంటర్లోనూ కరోనా వ్యాక్సిన్ పంపిణీకి ఇంకా సమయం ఉందని, వ్యాక్సినే అందుబాటులోకి రాలేదన్నారు. ఇప్పుడు షెడ్యూల్ ఆధారంగా ఎన్నికలు నిర్వహించుకుంటే తప్పేముందని ఆయన ప్రశ్నించారు. దీంతో నిమ్మగడ్డ వాదన ప్రాధాన్యం సంతరించుకుంది.
హైకోర్టు అంగీకరిస్తే జగన్ సర్కార్కు చిక్కులే..
కరోనా వ్యాక్సిన్ షెడ్యూల్ ఆధారంగానే స్ధానిక సంస్ధల నిర్వహణకు నిమ్మగడ్డ అంగీకరించిన నేపథ్యంలో ప్రభుత్వం మరికొన్ని అభ్యంతరాలు లేవనెత్తింది. దీంతో ఈ పిటిషన్పై మరింత లోతైన విచారణ అవసరమని హైకోర్టు తెలిపింది. సంక్రాంతి సెలవుల తర్వాత దీన్ని విచారిస్తామని తెలిపింది. అయితే అప్పటివరకూ ఎన్నికల నిర్వహణకు ఎలాంటి చర్యలు తీసుకోకుండా చూడాలని హైకోర్టును ప్రభుత్వ న్యాయవాది కోరారు. దీనిపై స్పందించిన హైకోర్టు తాము తదుపరి ఆదేశాలు ఇచ్చే వరకూ ఎన్నికల విషయంలో ఎలాంటి చర్యలు తీసుకోకుండా ఎస్ఈసీని ఆదేశించాలా వద్దా అనే విషయంలో ఇవాళ విచారణ జరిపి ఆధేశాలు ఇవ్వాలని నిర్ణయించింది. ఈ రెండు వ్యవహారాల్లోను హైకోర్టు నిమ్మగడ్డ వాదనకు అంగీకరిస్తే మాత్రం జగన్ సర్కారుకు చిక్కులు తప్పకపోవచ్చు.