వేగంగా నిమ్మగడ్డ అడుగులు- ఎస్ఈసీ ఉద్యోగులతో సమీక్ష -రెండ్రోజుల్లో సీఎస్, డీజీపీతో
ఏపీలో గ్రామ పంచాయతీ ఎన్నికల నిర్వహణు హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన నేపథ్యంలో ఎన్నికల సంఘం వేగంగా అడుగులేస్తోంది. హైకోర్టు తీర్పు రాగానే షెడ్యూల్ ప్రకారమే ఎన్నికలు ఉంటాయని ప్రెస్నోట్ విడుదల చేసిన నిమ్మగడ్డ రమేష్.. ఇప్పుడు ఎన్నికల ఏర్పాట్లపై ఉద్యోగులతో కీలక సమావేశం నిర్వహిస్తున్నారు. ఇందులో ఎన్నికల ఏర్పాట్లపై ఆయన చర్చిస్తున్నారు.
ఏపీలో పంచాయతీ ఎన్నికల నిర్వహణ విషయంలో ప్రభుత్వం నుంచి ఎలాంటి సహకారం తీసుకోవాలనే అంశంపై ఉద్యోగులతో నిమ్మగడ్డ రమేష్ చర్చిస్తున్నట్లు తెలుస్తోంది. ఆ తర్వాత రెండు రోజుల్లో సీఎస్, డీజీపీ, కలెక్టర్లు, ఎస్పీలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించేందుకు ఎస్ఈసీ నిమ్మగడ్డ సిద్దమవుతున్నారు. ఈ వీడియో కాన్ఫరెన్స్లో చర్చించాల్సిన అజెండాను తయారు చేసే పనిలో నిమ్మగడ్డ ప్రస్తుతం బిజీగా ఉన్నట్లు కనిపిస్తోంది. ఓసారి అజెండా సిద్ధమైతే వారికి సమాచారం ఇచ్చే అవకాశముంది.
ఎల్లుండి ఏపీలో గ్రామ పంచాయతీ ఎన్నికల తొలి విడతకు నోటిఫికేషన్ విడుదల చేయాల్సి ఉంటుంది. ఆ తర్వాత నామినేషన్ల స్వీకరణ, పరిశీలన, ఉపసంహరణకు తీసుకోవాల్సిన చర్యలతో పాటు శాంతి భద్రతల అంశాన్ని కూడా ఈసారి ఎస్ఈసీ సీరియస్గా తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. అదే సమయంలో గతంలో ఎన్నికల సందర్భంగా తాము చర్యలు తీసుకోవాలని సూచించిన అధికారుల విషయంలో ఏం చేశారో తెలుసుకునేందుకు సీఎస్ ఆదిత్యనాథ్ దాస్కు ఎస్ఈసీ నిమ్మగడ్డ లేఖ రాయబోతున్నట్లు తెలుస్తోంది. ఎస్ఈసీ పట్టుబడితే సదరు ఎస్పీలు, కలెక్టర్లతో పాటు ఇతర అధికారులను ప్రభుత్వం బదిలీ చేయక తప్పదు.