ఏపీలోనూ ఐదు రాష్ట్రాల ఎన్నికల కోడ్- ఎస్ఈసీ నిమ్మగడ్డ కీలక ఉత్తర్వులు
ఐదు రాష్ట్రాల ఎన్నికల కోసం కేంద్ర ఎన్నికల సంఘం నిన్న షెడ్యూల్ జారీ చేసింది.. ఈ సందర్భంగా కరోనా పరిస్ధితులను దృష్టిలో పెట్టుకుని ఎన్నికల ప్రవర్తనా నియమావళిలో పలు మార్పులు చేశారు. ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్దులు ఇంటింటి ప్రచారానికి కేవలం ఐదుగురితోనే వెళ్లాలని, నామినేషన్లకు ఒకేసారి ఇద్దరిని మాత్రమే అనుమతిస్తామని కేంద్ర ఎన్నికల కమిషనర్ ప్రకటించారు. వీటితో పాటు ఎన్నికల అధికారులకు వ్యాక్సిన్లు వేయడం, ఇతరత్రా నిబంధనలు కూడా పెట్టారు. వీటిని ఇప్పుడు ఏపీలోనూ అమలు చేయనున్నారు.
ఐదు రాష్ట్రాల ఎన్నికల కోసం కేంద్ర ఎన్నికల సంఘం విడుదల చేసిన ప్రవర్తనా నియమావళిని ఏపీలోనూ యథాతథంగా అమలు చేయాలని నిర్ణయించినట్లు ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఓ ప్రకటన విడుదల చేశారు. ఇందులో ఎన్నికల సంఘం ఆదేశాలను ఏపీలో అమలు చేసేందుకు రాజకీయ పార్టీలు, అభ్యర్ధులు సహకరించాలని కోరారు. ఎన్నికల కోడ్ కచ్చితంగా అమలయ్యేందుకు కలెక్టర్లు, ఇతర ఎన్నికల అధికారులు చర్యలు తీసుకోవాలని ఎస్ఈసీ ఆదేశాలు ఇచ్చారు.
ప్రస్తుతం ఏపీలో మున్సిపల్ ఎన్నికలకు రంగం సిద్ధమవుతోంది. ఆ తర్వాత ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలు జరగాల్సి ఉంది. కాబట్టి గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లోనూ కేంద్ర ఎన్నికల సంఘం ఇచ్చిన ఎన్నికల కోడ్ను అమలు చేస్తున్నట్లు ఎస్ఈసీ ప్రకటనలో తెలిపారు. ఎన్నికలు స్వేచ్ఛగా, నిష్పక్షపాతంగా నిర్వహిచేందుకు తాము ఇచ్చిన ఆదేశాలు అమలు చేయాలని పార్టీలు, అభ్యర్ధులను ఎస్ఈసీ నిమ్మగడ్డ కోరారు. దీంతో పంచాయతీ ఎన్నికల తరహాలో కాకుండా మరింత కచ్చితంగా కొత్త కోడ్ అమలు కానుంది.