మంత్రి పెద్దిరెడ్డి హౌస్ అరెస్టుకు నిమ్మగడ్డ ఆదేశం- అమలుచేసే వారిపై చర్యలు తప్పవన్న మంత్రి
ఏపీలో పంచాయతీ ఎన్నికల కేంద్రంగా జగన్ సర్కార్ వర్సెస్ ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్గా సాగుతున్న పోరు ఇవాళ మరో టర్న్ తీసుకుంది. తనను టార్గెట్ చేస్తూ పంచాయతీరాజ్ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్జి చేస్తున్న వ్యాఖ్యలపై ఇప్పటికే గవర్నర్కు ఫిర్యాదు చేసిన ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్.. ఇప్పుడు ఆయన్ను ఏకంగా హౌస్ అరెస్ట్ చేయాలని డీజీపీకి ఆదేశాలు పంపారు. ఎన్నికల్లో ఏకగ్రీవాలకు సంబంధించి పెద్దిరెడ్డి చేసిన తాజా వ్యాఖ్యలే ఇందుకు కారణం.
ఏకగ్రీవాలపై పెద్దిరెడ్డి వివాదాస్పద వ్యాఖ్యలు
ఏపీ పంచాయతీ ఎన్నికల్లో సాధ్యమైనంత వరకూ ఏకగ్రీవాలను ప్రోత్సహించాలని లక్ష్యంగా పెట్టుకున్న వైసీపీ సర్కార్ ఆ మేరకు బహిరంగ ప్రకటనలతో పాటు జనంలోనూ అవే సంకేతాలు పంపుతోంది. ఈ నేపథ్యంలో తొలి విడత పంచాయతీ ఎన్నికలకు ముందే చిత్తూరు, గుంటూరు జిల్లాల్లో భారీగా ఏకగ్రీవాలు చోటు చేసుకోవడంతో ఎస్ఈసీ నిమ్మగడ్డ సీరియస్ అయ్యారు. వాటి ఫలితాలను నిలిపేయాలని ఆదేశాలు ఇచ్చారు. దీనిపై స్పందించిన మంత్రి పెద్దిరెడ్డి కలెక్టర్లు, రిటర్నింగ్ అధికారులు ఎస్ఈసీ నిమ్మగడ్డ ఆదేశాలు అమలు చేస్తే తర్వాత వారిని బ్లాక్ లిస్ట్లో పెడతామని హెచ్చరికలు చేశారు. దీంతో పాటు నిమ్మగడ్డ టీడీపీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నారని ఆరోపణలు చేశారు.
పెద్దిరెడ్డి వ్యాఖ్యలపై ఎస్ఈసీ సీరియస్
తన సొంత జిల్లాలో ఏకగ్రీవాలను ఆమోదించలేదనే కారణంతో ఎన్నికల అధికారులపై మంత్రి పెద్దిరెడ్డి చేసిన వ్యాఖ్యలతో ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ సీరియస్ అయ్యారు. ఇప్పటికే ఆయన వరుసగా ఎస్ఈసీని టార్గెట్ చేస్తూ చేసిన వ్యాఖ్యలపై గవర్నర్కు ఫిర్యాదు చేసిన నిమ్మగడ్డ.. పెద్దిరెడ్డి తాజా వ్యాఖ్యలపై భగ్గుమన్నారు. కలెక్టర్లు, రిటర్నింగ్ అధికారులపై పెద్దిరడ్డి చేసిన వ్యాఖ్యలపై స్పందిస్తూ చర్యలు తీసుకోవాలని డీజీపీ గౌతం సవాంగ్కు ఆదేశాలు ఇచ్చారు.
ఎన్నికలయ్యే వరకూ పెద్దిరెడ్డి హౌస్ అరెస్ట్
పెద్దిరెడ్డి అధికారులను బెదిరించేలా ఉన్నాయని ఎస్ఈసీ తెలిపారు. ఇలాంటి పరిస్ధితుల్లో అధికారుల్లో స్ధైర్యం నింపాల్సిన బాధ్యత తమకుందని నిమ్మగడ్డ తెలిపారు. మంత్రి పెద్దిరెడ్డి వ్యాఖ్యలు రాజ్యాంగ విరుద్ధంగా ఉన్నాయన్నారు. దీంతో పంచాయతీ ఎన్నికయ్యే వరకూ అంటే ఈ నెల 21 వరకూ పెద్దిరెడ్డిని ఇంటికే పరిమితం చేయాలని డీజీపీకి ఎస్ఈసీ ఆదేశాలు ఇచ్చారు. ఈ సమయంలో ఎన్నికలపై పెద్దిరెడ్డి మీడియాలో ఎలాంటి వ్యాఖ్యలు చేయకుండా అడ్డుకోవాలని కూడా ఎస్ఈసీ ఆదేశాల్లో పేర్కొన్నారు.
నిమ్మగడ్డ ఆదేశాలపై పెద్దిరెడ్డి ఫైర్
చిత్తూరులో వివాదాస్పద వ్యాఖ్యల నేపథ్యంలో తనను ఎన్నికలు ముగిసేవరకూ హౌస్ అరెస్టు చేయాలని ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ ఇచ్చిన ఆదేశాలపై మంత్రి పెద్దిరెడ్డి భగ్గుమన్నారు. నిమ్మగడ్డ జైలు శిక్ష అనుభవించక తప్పదన్నారు. ఆయనకు మూడేళ్ల జైలుశిక్ష పడుతుందన్నారు. ప్రివిలేజ్ కమిటీ ముందు ఆయన హాజరు కావాల్సిందే అన్నారు. ప్రభుత్వంలో ఉన్న మంత్రిపై ఎలా చర్యలు తీసుకుంటారని నిమ్మగడ్డను పెద్దిరెడ్డి ప్రశ్నించారు. చంద్రబాబు తయారు చేసిన యాప్ను నిమ్మగడ్డ తీసుకొచ్చారని, ఆయన తనకు తాను రాష్ట్రపతి అనుకుంటున్నారని పెద్దిరెడ్డి తీవ్ర విమర్శలు చేశారు.
నిమ్మగడ్డ ఆదేశాలు ఖాతరు చేయనన్న పెద్దిరెడ్డి
నిమ్మగడ్డ ఆదేశాలు ఖాతరు చేయబోనని మంత్రి పెద్దిరెడ్డి తెలిపారు. మంత్రిని ఇంట్లో నిర్బంధించాలనడం దుర్మార్గమన్నారు. నిమ్మగడ్డ ఆదేశాలు పాటించేవారిపై భవిష్యత్తులో చర్యలు తప్పవని పెద్దిరెడ్డి మరోసారి హెచ్చరించారు. ఆదేశాలు ఇచ్చేటప్పుడు అవి అమలవుతాయో లేదో చూడాలని నిమ్మగడ్డకు సూచించారు. ఇవన్నీ ముందే ఊహించినట్లు ఆయన తెలిపారు. నిమ్మగడ్డ ఓ అధికారి మాత్రమేనని, తాను రాష్ట్రమంత్రినని పెద్దిరెడ్డి తెలిపారు.