ఏకగ్రీవ పంచాయతీలపై నిమ్మగడ్డ మార్క్ ఆర్డర్స్: ఆ రెండు జిల్లాల్లో ఫలితాల నిలిపివేత
అమరావతి: రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికల్లో ఏకగ్రీవాలను ప్రోత్సహించడానికి అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేస్తోన్న ప్రయత్నాలు, వేస్తోన్న వ్యూహాలకు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ తనదైన శైలిలో అడ్డుకట్ట వేసే ప్రయత్నాలను ఆరంభించినట్లు కనిపిస్తోంది. ఏకగ్రీవాలను తాము ప్రోత్సహించట్లేదని, ప్రజాస్వామ్యంలో ఎన్నికలు జరగాల్సిందేనంటూ మొదటి నుంచీ చెప్పుకొంటూ వస్తోన్న ఆయన ఆ దిశగా కార్యాచరణ ప్రణాళికను కూడా మొదలు పెట్టారు. ఏకగ్రీవ పంచాయతీల ఫలితాలను వెల్లడించవద్దంటూ ఆదేశాలను జారీ చేశారు.
టీడీపీ మేనిఫెస్టో రద్దుపై వైసీపీ సెటైర్లు: మొదటి రోజే స్ప్రాప్: ప్రింటింగ్ ఖర్చు వృధాగా
ఆ రెండు జిల్లాల్లో ఫలితాలపై అనుమానాలు..
తొలి విడత గ్రామ పంచాయతీ ఎన్నికల నామినేషన్ల ఉపసంహరణ ప్రక్రియ ముగిసే సరికి రాష్ట్రవ్యాప్తంగా 523 చోట్ల ఏకగ్రీవాలు నమోదు అయ్యాయి. అత్యధిక ఏకగ్రీవాలు.. తెలుగుదేశం పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సొంత జిల్లా చిత్తూరులోనివే. ఈ జిల్లాలో 110 పంచాయతీల్లో గ్రామస్తులు సర్పంచ్ను ఏకగ్రీవంగా ఎన్నుకొన్నారు. 454 పంచాయతీలకు 110 చోట్ల ఏకగ్రీవం అయ్యారు. అలాగే- అమరావతి ప్రాంత పరిధిలోకి వచ్చే గుంటూరు జిల్లాలో 67 పంచాయతీలు ఏకగ్రీవం అయ్యాయి. ఈ రెండు జిల్లాల్లోని ఫలితాలపై నిమ్మగడ్డ రమేష్ కుమార్ అనుమానాలను వ్యక్తం చేస్తున్నారు.
చిత్తూరు, గుంటూరు ఫలితాలు నిలిపివేయాలంటూ..
చిత్తూరు, గుంటూరు జిల్లాల్లో ఏకగ్రీవ పంచాయతీ ఎన్నికల ఫలితాలను ప్రకటించవద్దంటూ రమేష్ కుమార్.. ఆ రెండు జిల్లాల కలెక్టర్లను ఆదేశించారు. ఈ మేరకు కొద్దిసేపటి కిందటే ఆదేశాలను జారీ చేశారు. గ్రామస్థాయిలో ఎన్నికల పరిశీలకులు అందించాల్సిన నివేదికలు ఇంకా పెండింగ్లో ఉన్నాయని, వాటిని పరిశీలించిన తరువాతే.. ఫలితాలను వెల్లడించాల్సి ఉంటుందని పేర్కొన్నారు. అప్పటిదాకా ఏకగ్రీవ ఎన్నికల ఫలితాలను నిలిపివేయాలని చిత్తూరు, గుంటూరు జిల్లాల కలెక్టర్లుహరి నారాయణ్, బంసత్ కుమార్లను ఆదేశించారు.
చిత్తూరులో 110, గుంటూరులో 67..
తొలి విడతలో చిత్తూరు, గుంటూరు జిల్లాల్లోనే అత్యధిక పంచాయతీలు ఏకగ్రీవమయ్యాయి. చిత్తూరులో 110, గుంటూరుల్లో ఏకగ్రీవాలు రికార్డు అయ్యాయి. రాజకీయంగా ఈ రెండు జిల్లాలు అత్యంత ప్రాముఖ్యతను కలిగి ఉన్నవే. చిత్తూరు.. చంద్రబాబు సొంత జిల్లా కావడం, గుంటూరు.. అమరావతి పరిరక్షణ సమితి ఉద్యమానికి వేదికగా మారిన జిల్లా కావడం వల్ల రాజకీయ ప్రాధాన్యత ఏర్పడింది. ఈ రెండు జిల్లాల్లో ఏకగ్రీవాలు అత్యధికంగా నమోదు అయ్యాయి. వాటిల్లో 90 శాతం వరకు వైఎస్ఆర్సీపీ మద్దతు ఇచ్చిన అభ్యర్థులే విజయం సాధించారంటూ అనధికారికంగా వార్తలు వస్తున్నాయి. ఈ పరిస్థితుల్లో అత్యధి ఏకగ్రీవాలు అక్కడే నమోదు కావడం ఎన్నికల కమిషన్ కార్యాలయం దృష్టి సారించడానికి కారణమైందని అంటున్నారు.