ఏపీ పంచాయితీ ఎన్నికల నిర్ణయాధికారంపై ఎస్ఈసీ వర్సెస్ సీఎస్..గవర్నర్ కోర్టులో బంతి
పంచాయతీ ఎన్నికల విషయంలో ఏపీ రాష్ట్ర ఎన్నికల సంఘానికి, ఏపీ ప్రభుత్వానికి మధ్య కొనసాగుతున్న ప్రచ్ఛన్న యుద్ధం చిలికి చిలికి గాలివానగా మారుతోంది. రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్నిల మధ్య లేఖల పరంపర రాష్ట్రంలో చర్చనీయాంశంగా మారుతోంది. ఎవరూ తగ్గకపోవటంతో ఈ వ్యవహారం రాష్ట్ర ఎన్నికల సంఘం వర్సెస్ ఏపీ సర్కార్ అంటూ హాట్ టాపిక్ అయ్యింది.
నీలంసాహ్నికి ఘాటుగా లేఖ రాసిన ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్
పంచాయతీ ఎన్నికల నిర్వహణకు సంబంధించి ప్రభుత్వ ఉన్నతాధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించాలని ప్రభుత్వాన్ని కోరిన రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రమేష్ కుమార్ కు చుక్కెదురైంది. వరుసగా బుధవారం గురువారం రెండు రోజుల పాటు సమావేశానికి అధికారులు ఎవరూ హాజరు కాకపోవడంతో వీడియో కాన్ఫరెన్స్ రద్దయింది. ఈ నేపథ్యంలో గురువారం రోజు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని కి ఘాటుగా లేఖ రాశారు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ . ఎన్నికల తేదీలపై నిర్ణయాధికారం రాష్ట్ర ఎన్నికల సంఘానికి ఉంటుందని, మీరు చెప్పినట్టే జరగాలి అనుకోవడం భ్రమ అంటూ ఆయన ఆ లేఖలో పేర్కొన్నట్లు సమాచారం.
ఎన్నికల తేదీల నిర్ణయాధికారం మాదే .. అనుమానం ఉంటే కోర్టుకు వెళ్ళండన్న ఎస్ఈసీ
ఎన్నికల నిర్వహణకు సంబంధించి ఏవైనా సందేహాలు ఉంటే కోర్టులో అడగండి అంటూ నిమ్మగడ్డ రమేష్ కుమార్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్నికి స్పష్టం చేశారు. ప్రభుత్వం తన సంకుచిత ప్రయోజనాల కోసం ప్రజలలో భయాందోళనలను ప్రేరేపించడం మంచిదికాదని, ఇది అనైతిక చర్య అని అభిప్రాయపడిన రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రమేష్ కుమార్ ఎన్నికల సంఘం రాష్ట్ర ప్రభుత్వాన్ని సంప్రదించాలి తప్ప రాష్ట్ర ప్రభుత్వ అనుమతి తీసుకోవాల్సిన అవసరం లేదని కోర్టు చెప్పిందని లేఖలో పేర్కొన్నారు.
రాజ్యాంగ విరుద్ధంగా ప్రభుత్వ తీరు .. ఫైర్ అయిన నిమ్మగడ్డ
ఎన్నికలపై నిరంతరం సంప్రదింపులు కొనసాగిద్దామని చెబుతూనే, మరోపక్క వీడియో కాన్ఫరెన్స్ కు అధికారులు హాజరు కాకుండా చేయడంపై మండిపడిన రమేష్ కుమార్ సమావేశం జరగకుండా అడ్డుకోవడం రాజ్యాంగానికి, చట్టానికి విరుద్ధమని లేఖలో పేర్కొన్నారు.
తాజా పరిణామాల నేపథ్యంలో ఎప్పటికప్పుడు రాష్ట్ర ప్రభుత్వ తీరుపై గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ కు ఫిర్యాదు చేస్తున్న రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రమేష్ కుమార్, గురువారం నాడు కూడా ఈ వ్యవహారంలో గవర్నర్ జోక్యం చేసుకోవాలని కోరారు. తాజా పరిణామాలు వివరిస్తూ మరో లేఖ రాశారు .
Recommended Video
చొరవ తీసుకోవాల్సింది మీరే .. గవర్నర్ కు మరోమారు ఎస్ఈసీ విజ్ఞప్తి
ఈ పరిస్థితుల్లో చొరవ తీసుకోవలసిన బాధ్యత గవర్నర్ గా మీ పైనే ఉంది అంటూ ఆ లేఖలో ప్రస్తావించినట్లుగా తెలుస్తుంది. అంతేకాదు తనపై అభ్యంతర వ్యాఖ్యలు చేసిన కొడాలి నాని పై చర్యలు తీసుకోవాలని కూడా గవర్నర్ కు లేఖ రాశారు . ఈ వ్యవహారంపై గవర్నర్ జోక్యం చేసుకుంటే ఆయన తీసుకునే నిర్ణయం ఏ విధంగా ఉంటుంది? అనేది ఆసక్తికరం. రాష్ట్ర ప్రభుత్వ అధికార యంత్రాంగం పూర్తిస్థాయిలో ఎన్నికల నిర్వహణకు సహకరించకపోతే,ఎన్నికల నిర్వహణ సాధ్యం కాదు కాబట్టి ఈ వ్యవహారంపై గవర్నర్ జోక్యం చేసుకోకపోతే రాష్ట్ర ఎన్నికల సంఘం, రాష్ట్ర ప్రభుత్వ తీరుపై కోర్టుకు వెళ్లాల్సిందే.